భారత్లో రికార్డు స్థాయిలో పెరుగుతున్న కరోనా కేసులు.. డబ్ల్యూహెచ్ఓ ఆందోళన
posted on Sep 14, 2020 @ 2:16PM
భారత్ లో కరోనా కేసులు, మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గత 24 గంటల్లో దేశంలో 92,071 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. అదే సమయంలో 1,136 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 48,46,428 కు చేరింది. మృతుల సంఖ్య మొత్తం 79,722కు పెరిగింది. ప్రస్తుతం 9,86,598 యాక్టివ్ కేసులున్నాయి.
ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా నమోదైన కేసుల్లో భారత్ రెండోస్థానంలో నిలిచింది. అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఒక్క ఆగస్టు నెలలోనే భారత్ లో 20లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధిక కేసులు నమోదు చేస్తున్న దేశాలలో భారత్, అమెరికా, బ్రెజిల్ దేశాలు ముందు వరసలో ఉన్నాయి.
కాగా, ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో నమోదవుతున్న కరోనా కేసులుపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ఆందోళన వ్యక్తం చేస్తోంది. గత 24 గంటలలో ప్రపంచవ్యాప్తంగా 307,930 కేసులు నమోదయ్యాయని, ఇది ఒకే రోజు అత్యధిక కేసులలో ఒక రికార్డని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 5,500మంది మరణించారని, దీంతో ప్రపంచవ్యాప్తంగా మరణాల సంఖ్య 917,417 చేరుకున్నట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.
భారత్లో కోవిడ్-19 పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. అమెరికా, బ్రెజిల్ తోపాటు భారత్లో రోజువారీ కేసులు అత్యధిక స్థాయిలో నమోదవుతున్నాయని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.