ఏపీలో పోటా పోటీ విగ్ర‌హాలు..?

 

ఏపీలో కొండ‌ల‌పై పోటా పోటీ విగ్ర‌హాల గురించి ప్ర‌ముఖంగా చ‌ర్చ న‌డుస్తోంది. కూట‌మి స‌ర్కార్ క‌మ్మ వారు అధికంగా ఉండే నీరుకొండ గ్రామం కొండ‌పై రూ. 1750 కోట్ల‌తో ఎన్టీఆర్  విగ్ర‌హం పెడతామ‌న్న ప్ర‌క‌ట‌న  చేసింది. దీంతో వైయ‌స్, రంగా  విగ్ర‌హాల  ప్ర‌స్తావ‌న సైతం విన‌ వ‌స్తోంది. క‌మ్మ‌ల‌ను చూసిన రెడ్లు.. తాము ఎక్కువ‌గా ఉండే పెనుమాక గ్రామం కొండ‌పై వైయ‌స్ విగ్ర‌హం అంత‌కన్నా మించిన ఎత్తుతో,, సుమారు మూడు వేల కోట్ల వ్య‌యం చేస్తూ.. విగ్ర‌హం పెట్ట‌డం ఖాయంగా తెలుస్తోంది.ఇక క‌మ్మ, రెడ్ల‌ను చూసి కాపులు తామేమీ త‌క్కువ కాదంటున్నార‌ట‌. కాపులు ఎక్కువ‌గా ఉండే ఉండ‌వ‌ల్లి గ్రామం కొండ‌ లేదా ఎర్రుపాలెం కొండ‌పై వంగ‌వీటి మోహ‌న రంగా విగ్ర‌హం పెడ‌తార‌ట‌.

దీంతో ఏపీలో ప్ర‌స్తుతం పోటా పోటీ విగ్ర‌హాల వ్య‌వ‌హారం ఒకింత జోరుగానే  సాగుతోంది. కొంద‌రు క‌మ్మ వారైతే ఎన్టీఆర్ విగ్ర‌హాన్ని వ‌ద్ద‌నే అంటున్నార‌ట‌. కారణం ఇదిగో ఇదేనంటున్నారు. ఇప్పుడు మీరు రెచ్చిపోయి ఎన్టీఆర్ విగ్ర‌హాన్ని పెడితే.. వ‌చ్చే రోజుల్లో అవి వైయ‌స్, రంగా విగ్ర‌హాలుగా ఒక‌టికి మూడ‌వుతాయని వీరు తీవ్ర నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నార‌ట‌. ఉన్న స‌మ‌స్య‌లు చాల‌వ‌న్న‌ట్టు వైసీపీ ఇదే విగ్ర‌హ వ్య‌వ‌హారంపై కొత్త రాగం అందుకుంది.

మెడిక‌ల్ కాలేజీల‌కు ఏడాదికి వెయ్యి కోట్లు ఖ‌ర్చు చేయ‌లేని కూట‌మి స‌ర్కార్.. సుమారు రెండు వేల కోట్ల‌తో ఈ ఎన్టీఆర్ విగ్ర‌హం పెట్ట‌డ‌మేంట‌ని రివ‌ర్స్ లో వ‌స్తోంది. దీంతో పాటు ద‌ళితుల‌ను కూడా ఎగ‌దోసి.. మా సొమ్ముతో క‌మ్మ వారి కుల ప్ర‌తీక అయిన ఎన్టీఆర్ విగ్ర‌హం పెట్ట‌డ‌మేంట‌ని ఒక ర‌క‌మైన ప్ర‌చారం చేయిస్తోంది. కొంద‌రైతే క‌మ్మ‌వారికి ఎన్టీఆర్ విగ్ర‌హాలు పెట్టుకునేంత సొమ్ములు కూడా లేవా? అన్న చ‌ర్చ‌కు తెర‌లేపారు. ఇదంతా ఇలా ఉంటే గ‌తంలో గుంటూరు ఎంపీ  గా ప‌ని చేసిన జ‌య‌దేవ్ గ‌ల్లా పార్ల‌మెంటులో బీజేపీ స‌ర్కార్ వేల కోట్ల‌తో నిర్మించిన స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్, శివాజీ విగ్ర‌హాల వీడియోని వైర‌ల్ చేస్తున్నారు.  వీట‌న్నిటి  న‌డుమ ఈ విగ్ర‌హాల వ్య‌వ‌హారం ఎక్క‌డి వ‌ర‌కూ వెళ్తుందో తేలాల్సి ఉంది.

భోగి సంబరాల్లో కేంద్ర మంత్రి కంజరాపు రామ్మోహన్ నాయుడు

కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శ్రీకాశుళంలోని తన స్వగృహంలో కుటుంబ సభ్యులతో కలిసి భోగి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మన తరువాతి తరాలకు ఆచార సాంప్రదాయాలను చేరవేసే భాద్యతను ప్రతీ ఒక్కరు తీసుకోవాలని పిలుపునిస్తూ ప్రజలకు   భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.   కూటమి సర్కారు ప్రజారంజక పాలనలో ప్రతీ పల్లెలో సంక్రాంతి శోభ మెండుగా కనిపిస్తోందని, ప్రతీ ఇంట సిరుల సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయన్న ఆయన  పుట్టిన ఊరికి పంచే మమకారమే నిజమైన సంక్రాంతి అన్నారు.  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో ఇబ్బందులు లేని వ్యవసాయాన్ని అన్నదాతలు చేస్తున్నారని, ధాన్యం కొనుగోళ్ళ విషయంలో ఎలాంటి జాప్యం, ఇతరుల ప్రమేయం లేకుండా సక్రమంగా చెల్లింపులు సత్వరం జరుగుతున్నాయనీ, ప్రధాని మోదీ తోడ్పాటుతో ఉత్తరాంధ్రను ఉత్తమాంధ్రగా మార్చే కీలక ప్రాజెక్టులు మరికొద్ది రోజుల్లో ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు.   భోగాపురం విమానాశ్రయాన్ని జూన్ కన్నా ముందే ప్రారంభిస్తామని స్పష్టం చేసిన రామ్మోహన్ నాయుడు.. దానికి అనుసంధానంగా శ్రీకాకుళం జిల్లాలో విస్తృతంగా పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని అన్నారు. వచ్చే సంక్రాంతి నాటికి సరికొత్త ఉత్తరాంధ్ర సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు.  

తెలుగు రాష్ట్రాలలో ఘనంగా భోగి వేడుకలు

ఉభయ తెలుగు రాష్ట్రాలలో  భోగి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. మకర సంక్రాంతి సంబరాలకు నాందిగా భోగి పండుగను ప్రజలు ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. బుధవారం (జనవరి 14) తెల్లవారు జామునే ఇళ్ల ముందు భోగి మంటలు వేసి, భోగి పాటలు పాడుతూ సందడి చేశారు.  గ్రామాలు, పట్టణాలు, నగరాలలో యువతీ యువకులు, పిల్లలు, పెద్దలు అన్న తేడా లేకుండా అందరూ భోగి సంబరాల్లో మునిగిపోయారు.  ఒకరికొకరు భోగి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఉత్తరాయణ పుణ్యకాలానికి స్వాగతం పలుకుతున్నారు. వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన భోగి వేడుకల్లో ప్రజా ప్రతినిధులు, నేతలు పాల్గొని ప్రజలకు భోగి శుభాకాంక్షలు తెలిపారు. విశాఖ ఆర్కే బీచ్ రోడ్డులో ఏర్పాటు చేసిన భోగి మంటల కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.   అలాగే ఉదయాన్నే భక్తులు ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజల్లో పాల్గొంటుండటంతో తెలుగు రాష్ట్రాలలో  ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.  ఉమ్మడి నెల్లూరు జిల్లాలో భోగి వేడుకలు సందడిగా జరిగాయి. పలు ప్రాంతాల్లో భోగి వేడుకల్లో ఏపీ మంత్రి నారాయణ పాల్గొన్నారు. ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం వెంప గ్రామంలో  జరిగిన భోగి సంబరాల్లో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ పాల్గొని సందడి చేశారు.   

రేపే మేడారం మహా జాతర... భారీగా ఏర్పాట్లు

  మేడారం మహా జాతరకు తొలి ఘట్టం రేపు జరగనుంది. సమ్మక్క, సారలమ్మ జాతర ప్రారంభానికి సంకేతంగా గుడిమెలిగే (శుద్ది పండుగ) క్రతువును పూజారులు నిర్వహించనున్నారు. పూజారులు తమ ఇళ్లతో పాటు మేడారంలోని వనదేవతల గద్దెలను శుద్ది చేస్తారు. అనంతరం అడవికి వెళ్లి గుట్ట,పుట్ట మట్టిని సేకరించి, గద్దెలకు చేరుకోని అలుకుపూతలు నిర్వహిస్తారు. దీంతో జాతర మొదలైనట్లుగా పూజారులు భావిస్తారు. ఈనెల 28వ తేదీ నుండి 31 వ తేదీ వరకు మేడారం జాతర జరగనుంది. మేడరం భక్తుల కోసం "MyMedaram" పేరిట వాట్సాప్ సేవలను మంత్రులు సీతక్క, వాకిటి శ్రీహరి ప్రారంభించారు.  7658912300 నంబర్‌కు మేసేజ్ చేస్తే రూట్ మ్యాప్‌లు, మరుగుదొడ్లు, వైద్య శిబిరాలు ట్రాఫిక్ వివరాలు క్షణాల్లో తెలుసుకోవచ్చును. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు టీజీఎస్ఆర్టీసీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈసారి జాతరకు వివిధ ప్రాంతాల నుంచి 3,495 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. ఈ ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీకి 50 శాతం అదనంగా వసూలు చేయాలని టీజీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ప్రత్యేక పండుగలు, జాతరలు, ఇతర ఉత్సవాల సమయంలో నడిపే ప్రత్యేక బస్సుల్లో 50 శాతం వరకు ఛార్జీలు పెంచుకునేందుకు ఆర్టీసీకి అనుమతి ఉంది. మరోవైపు  జాతర సమాచారాన్ని, నియమ నిబంధనలను తెలియచేసే ప్రత్యేక యాప్ ను/ క్యూ.ఆర్ కోడ్  రూపొందించి విస్తృతంగా ప్రచారం చేయాలని అన్నారు. పార్కింగ్ ఏరియాలలో కూడా ప్రత్యేకంగా వాటర్, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని మంత్రి సీతక్క ఆదేశించారు. శానిటేషన్, పరిశుభ్రతపై ప్రత్యేక ద్రుష్టి సాధించాలన్నారు. ప్రస్తుతం మేడారంలో జరుగుతున్న జాతర ఏర్పాట్లు, పురోగతి తదితర విషయాలను తెలియచేసే నివేదికను ప్రతీ రోజూ తమకు సమర్పించాలని సంబంధిత శాఖల కార్యదర్శులను కోరారు.  తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ సహా పలు రాష్ట్రాల నుంచి లక్షలాదిగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున, అందుకు అనుగుణంగా వసతి, పార్కింగ్, రవాణా సౌకర్యాలను విస్తృతంగా ఏర్పాటు చేయాలని తెలిపారు. పార్కింగ్ విషయంలో వీఐపీలు–సామాన్య భక్తులు అనే తేడా లేకుండా, అందరికీ సమాన సౌకర్యాలు కల్పించాలని మంత్రి స్పష్టం చేశారు.     ఈసారి జాతర ఏర్పాట్లకు రూ. 150 కోట్లతో పాటు గద్దెల పునరుద్ధరణ పనులకు రూ. 101 కోట్లు మొత్తం 251 కోట్లను రాష్ట్ర ముఖ్యమంత్రి మంజూరు చేశారని సీతక్క వివరించారు. జాతరకు వచ్చే ప్రతీ భక్తులకు సాఫీగా దర్శనం లభించేలా ప్రాధాన్యత నిస్తున్నట్టు అన్నారు. ఇందుకు గాను ప్రతీ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఆదేశించారు.  

తెలంగాణ గ్రామ పంచాయతీలకు గుడ్ న్యూస్

  సంక్రాంతి సందర్బంగా గ్రామ పంచాయితీలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశాలతో రూ.277 కోట్ల నిధులను ఆర్దిక శాఖ విడుదల చేసింది. ఈ సందర్బంగా సర్పంచ్‌లు, వార్డు మెంబర్లకు డిప్యూటీ సీఎం సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. తాజాగా రిలీజ్ చేసిన నిధులతో గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి కావడమే కాకుండా, పంచాయతీల నిర్వహణ మరింత సులభతరం కానుంది. సంక్రాంతి పండుగ వేళ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై స్థానిక సంస్థల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  

కుక్క కాటుకు రాష్ట్ర ప్రభుత్వాలపై భారీ జరిమానా : సుప్రీం కోర్టు

  వీధి కుక్కల బెడదను అరికట్టేందుకు చర్యలు తీసుకోకపోతే ఆయా రాష్ట్రాలపై భారీ జరిమానాలు వేస్తామని సుప్రీం కోర్టు హెచ్చరించింది. వీధి కుక్కల అంశంపై  సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.  తాజాగా దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ప్రతి కుక్క కాటుకు పరిహారం చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది.  కుక్క కరిచిన ప్రభావం బాధిత వ్యక్తిపై జీవితకాలం ఉంటుందని న్యాయస్థానం పేర్కొంది.  ఈ సందర్భంగా వీధికుక్కలకు ఆహారం పెడుతున్న వారిపైనా కోర్టు అసహనం వ్యక్తం చేసింది.  ఏదైనా సంస్థ ఆహారం పెడుతున్న కుక్కల దాడిలో ఓ చిన్నారి మరణిస్తే.. అప్పుడు ఎవన్ని దానికి బాధ్యుల్ని చేయాలని ప్రశ్నించింది.  వీధికుక్కల బెడదను నివారించేందుకు రాష్ట్రాలు తగిన చర్యలు చేపట్టాలని, లేదంటే కుక్క కాటుకు, కుక్కల దాడిలో జరిగిన ప్రతి మరణానికి ఆయా రాష్ట్రాలపై తాము నిర్ధేశించే భారీ పరిహారాలను చెల్లించాని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.  

మ్యాచ్‌ల వేదికలపై బీసీబీ వినతులకు ఐసీసీ నో

  బంగ్లాదేశ్‌ జట్టు ఆడే మ్యాచ్‌లను భారత్‌ నుంచి తరలించాలనే బంగ్లా క్రికెట్‌ బోర్డు డిమాండ్‌ను ఐసీసీ అంగీకరించే అవకాశాలు లేవు. ఇదే విషయాన్ని ఐసీసీ సూచన ప్రాయంగా వెల్లడించింది. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన భద్రతా నిపుణులతో ఐసీసీ రిస్క్‌ అంచనా విభాగం సర్వే చేయించింది. భారత్‌లో బంగ్లా మ్యాచ్‌లకు ముప్పు వాటిల్లే పరిస్థితి లేదని ఆ నిపుణులు తేల్చారని ఐసీసీ సోమవారం ప్రకటించింది. మొత్తంగా టీ20 వరల్డ్‌ కప్‌నకు భారత్‌లో రిస్క్‌ తక్కువగా, పరిమితంగా ఉందని నిపుణులు తేల్చారని, ప్రపంచ స్థాయి టోర్నీల భద్రత ప్రొఫైల్‌ ఇలాగే ఉంటుందని ఐసీసీ వర్గాలు తెలిపాయి.  భారత్‌లోని ఏ వేదిక వద్దా బంగ్లాదేశ్‌ అధికారులకు సైతం ఎలాంటి ముప్పు లేదని నిపుణులు నిర్ధారించినట్టు సమాచారం. ఐపీఎల్‌లో కేకే‌ఆర్ నుంచి  స్టార్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను బీసీసీఐ ఆదేశాల మేరకు తొలగించడం బంగ్లాదేశ్‌ను ఆగ్రహానికి గురి చేసింది. దీనికి నిరసనగా బంగ్లాదేశ్ ప్రభుత్వం తమ దేశంలో ఐపీఎల్ ప్రసారాలను నిషేధించింది. భారత్‌లో బంగ్లాదేశ్ వ్యతిరేక భావనలు ఉన్నాయని, కాబట్టి తమ జట్టు మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని  బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కోరుతుంది

అగ్నిప్రమాద బాధితులకు తక్షణ సాయం అందించండి : సీఎం చంద్రబాబు

  కాకినాడ జిల్లా రౌతులపూడి మండలంలోని సార్లంకపల్లె గ్రామంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 26 గిరిజన గుడిసెలు పూర్తిగా కాలి బూడిద కాగా, 33 కుటుంబాలు నిలువ నీడ కోల్పోయి నిరాశ్రయులయ్యాయి. అటవీ ఉత్పత్తులను ఆధారంగా చేసుకుని జీవనం సాగిస్తున్న ఈ కుటుంబాలు ఒక్కసారిగా సర్వం కోల్పోయి తీవ్ర ఆందోళనలో మిగిలిపోయాయి. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. అధికారులతో మాట్లాడి బాధితులకు అన్ని విధాలుగా అండగా నిలవాలని ఆదేశించారు. తక్షణ సహాయంగా ప్రతి బాధిత కుటుంబానికి రూ.25,000 చొప్పున నగదు అందించడంతో పాటు ఇల్లు కోల్పోయిన వారికి పక్కా గృహాలు మంజూరు చేయాలని స్పష్టం చేశారు. బాధితులకు తాత్కాలిక వసతి, ఆహారం, అవసరమైన సాయాన్ని కల్పించాలని సూచించారు. సీఎం ఆదేశాల మేరకు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ, కాకినాడ ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బొజ్జి రెడ్డి గ్రామాన్ని సందర్శించి బాధితులను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పి, ప్రభుత్వపు పూర్తి సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. తహసీల్దార్ ఎస్.వి. నరేశ్ మాట్లాడుతూ, 33 కుటుంబాలకు రూ.25 వేల చొప్పున నగదు సహాయం పంపిణీ చేసినట్టు తెలిపారు. బాధితులందరికీ పక్కా ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు హామీ ఇచ్చారు. ప్రస్తుతం వారికి ఆహారం, నిత్యావసర సరుకులు అందజేస్తున్నామని తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.

గ్రీన్‌లాండ్ విలీనానికి అమెరికా సెనెట్‌లో బిల్లు

  డెన్మార్క్ దేశంలో అంతర్భాగంగా ఉన్న గ్రీన్‌లాండ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకునే దిశగా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. తాజాగా రిపబ్లికన్ పార్టీకి చెందిన చట్టసభ సభ్యుడు రాండీఫైన్ ‘గ్రీన్‌లాండ్ విలీనం - రాష్ట్ర హోదా’ పేరుతో బిల్లు ప్రవేశపెట్డాడు. ఈ బిల్లుతో ఆ ద్వీపాన్ని అమెరికాలో విలీనం చేసుకోవడానికి ట్రంప్ చర్యలు చేపట్టేందుకు అవకాశం లభిస్తుందని రాండీ అభిప్రాయపడ్డాడు.  అమెరికా విరోధులు ఆర్కిటిక్‌లో పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారని, తాము అలా జరగనివ్వబోమ్నారు. ఆర్కిటిక్‌లో రష్యా, చైనాలను ఎదుర్కోవడానికి ఈ చర్యలు కీలకమని వ్యాఖ్యానించారు. వెనిజులా మాజీ అధ్యక్షుడు మదురో నిర్బంధం తర్వాత అమెరకా అధ్యక్షుడు ట్రంప్ గ్రీన్‌లాండ్‌పై కన్నేశారు. ఆ ద్వీపాన్ని డెన్మార్ నుంచి దూరం చేయడానికి అక్కడి ప్రజలకు డబ్బును ఎరగా వేయడానికి ప్రయత్నించారని ప్రచారం జరిగింది.   అయితే యూఎస్ ప్రతిపాదనను గ్రీన్‌లాండ్ నాయకులు తిరస్కరించారు. తమ ప్రాంత భవిష్యత్తును విదేశాలు నిర్ణయించలేవని గ్రీన్‌లాండ్ ప్రధాని జెన్స్ ఫ్రెడరిక్ నీల్సన్  స్పష్టం చేశారు. నాటో దేశాలు సైతం యూఎస్ ప్రణాళికపై ఆందోళన వ్యక్తం చేశాయి. అయినా వెనకడుగు వేయని ట్రంప్ గ్రీన్‌లాండ్ స్వాధీనానికి పావులు కదుపుతూనే ఉండటం చర్చనీయాంశంగా మారింది.  

ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది : ఆర్మీ చీఫ్ ద్వివేది

  పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలు లక్ష్యంగా గత ఏడాది చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్'  కొనసాగుతోందని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది అన్నారు. పాకిస్థాన్ ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా సమర్థవంతంగా తిప్పికొడతామని హెచ్చరించారు. 2026లో తొలిసారి ద్వివేది మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పాకిస్థాన్ ఎలాంటి పొరపాట్లు చేసిన ఆపరేషన్ సిందూర్ సమయంలో ఇండియన్ ఆర్మీ మోహరించిన బలగాలు భూతల దాడులు చేసేందుకు కూడా సన్నద్ధంగా ఉన్నాయని తెలిపారు.  జమ్మూకశ్మీర్‌లోని నౌషెరా-రాజౌరి సెక్టార్‌లో తాజాగా పాకిస్థాన్ వైపు నుంచి వచ్చిన డ్రోన్‌ల సంచారాన్ని గుర్తించడంపై మాట్లాడుతూ, ఈ అంశం మంగళవారం నాడు పాకిస్థాన్‌తో డీజీఎంఓ స్థాయిలో ప్రస్తావనకు వచ్చిందని, పాక్‌ను కంట్రోల్‌లో ఉండాల్సిందిగా చెప్పామని అన్నారు. ఎలాంటి పరిస్థితులైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు క్షిపణి, రాకెట్ ఫోర్స్‌ను ఇండియన్ ఆర్మీ సిద్ధం చేస్తోందన్నారు.  జమ్మూకశ్మీర్‌లో జనవరి 10న సుమారు ఆరు డ్రోన్‌లు, జనవరి 11,12 తేదీల్లో రెండు నుంచి మూడు డ్రోన్‌లు కనిపించాయని చెప్పారు. అవి చాలా చిన్న డ్రోన్‌లని, లైట్లు వెలుగుతూ తక్కువ ఎత్తులో ఎగురుతున్నాయని, డిఫెన్సివ్ డ్రోన్‌లు కావచ్చని అన్నారు. పాక్‌లో ఎనిమిది ఉగ్రవాద శిబిరాలు ఇప్పటికీ చురుకుగా ఉన్నాయని,  వీటిలో రెండు అంతర్జాతీయ సరిహద్దుకు ఎదురుగా, ఆరు నియంత్రణ రేఖ వెంబడి ఉన్నాయని ద్వివేదీ పేర్కొన్నారు.  ఎలాంటి కదలికలు కానీ శిక్షణా కార్యకలాపాలు కానీ ఉన్నట్టు గుర్తించినట్లయితే అవసరమైన ఏ చర్యనైనా తీసుకుంమని స్పష్టం చేశారు. కవ్వింపు చర్చలకు దిగితే కచ్చితంగా పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని పాక్‌ను హెచ్చరించారు.

ఏపీలో బార్లు, వైన్ షాపుల్లో ఇకపై ఒకే ధరకు మద్యం

  ఏపీ ఎక్సైజ్ పాలసీలోరాష్ట్ర ప్రభుత్వం పలు ముఖ్యమైన మార్పులు చేసింది. బార్ల వ్యాపారులకు,  బార్ల వినియోగదారులకు ఊరటనిచ్చేలా బార్లపై విధించిన అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్‌ను పూర్తిగా రద్దు చేసింది. 2019 నవంబర్ నుంచి బార్లపై ఉన్న ప్రత్యేక అలర్ట్‌నీ తొలగిస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం.. ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేశ్ కుమార్ మీనా.. జీఓ ఎంఎస్ నంబర్ 24ను జారీ చేశారు.  వైసీపీ ప్రభుత్వ హయాంలో వైన్ షాపుల్లో ధరల కంటే బార్లలో ప్రతి క్వార్టర్ మందుపై రూ.50 నుంచి రూ.60 వరకు ఎక్కువ ట్యాక్స్ వసూలు చేశారు. ఇకపై రిటైల్ షాపులు, బార్ల మధ్య ఒకే మద్యానికి రెండు ధరలు ఉండవు. వైన్‌షాపుల్లో, బార్లలో ధరలు ఒకేలా ఉండేలా చర్యలు తీసుకుంటారు. ఏపీఎస్‌బీసీఎల్ డిపోల నుంచి బార్లకు సరఫరా చేసే ఐఎంఎఫ్‌ఎల్, ఎఫ్‌ఎల్‌పై అదనపు పన్ను విధింపు ఉండకూడదని ఆదేశాలు జారీ చేశారు.   ఎక్సైజ్ చట్టాల ప్రకారం కొత్త నోటిఫికేషన్ జారీ చేస్తూ, 2025 బార్ లైసెన్స్ నిబంధనల్లో సవరణలు చేస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం బార్ల వ్యాపారులకు, బారులకు వెళ్లే మందుబాబులకు పెద్ద ఊరటగా మారనుంది. ఇలాంటి మార్పులతో బార్ల వ్యాపారులకు గణనీయంగా ఖర్చులు తగ్గే అవకాశం ఉంది.  డైరెక్టర్ ఆఫ్ ఎక్సైజ్, డిస్టిలరీస్ కమిషనర్, APSBCL అధికారులు ఈ మార్పుల అమలుకు బాధ్యత వహించనున్నారు. ఈ ఉత్తర్వులు మంగళవారం నుంచి (2026 జనవరి 13) నుంచి అమలులోకి వస్తాయి. గతంలో బార్లకు రిటైల్ షాపుల కంటే ఎక్కువ ధరకు మద్యం సరఫరా అవుతుండటం వల్ల వ్యాపారంలో ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితి తలెత్తేది. ఇప్పుడు ధరల సమానత్వంతో బార్లకు బిగ్ రిలీఫ్‌ అనే చెప్పుకోవచ్చు.