తెలుగు రాష్ట్రాలలో ఘనంగా భోగి వేడుకలు

ఉభయ తెలుగు రాష్ట్రాలలో  భోగి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. మకర సంక్రాంతి సంబరాలకు నాందిగా భోగి పండుగను ప్రజలు ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. బుధవారం (జనవరి 14) తెల్లవారు జామునే ఇళ్ల ముందు భోగి మంటలు వేసి, భోగి పాటలు పాడుతూ సందడి చేశారు.  గ్రామాలు, పట్టణాలు, నగరాలలో యువతీ యువకులు, పిల్లలు, పెద్దలు అన్న తేడా లేకుండా అందరూ భోగి సంబరాల్లో మునిగిపోయారు.  ఒకరికొకరు భోగి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఉత్తరాయణ పుణ్యకాలానికి స్వాగతం పలుకుతున్నారు.

వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన భోగి వేడుకల్లో ప్రజా ప్రతినిధులు, నేతలు పాల్గొని ప్రజలకు భోగి శుభాకాంక్షలు తెలిపారు. విశాఖ ఆర్కే బీచ్ రోడ్డులో ఏర్పాటు చేసిన భోగి మంటల కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.   అలాగే ఉదయాన్నే భక్తులు ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజల్లో పాల్గొంటుండటంతో తెలుగు రాష్ట్రాలలో  ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.  ఉమ్మడి నెల్లూరు జిల్లాలో భోగి వేడుకలు సందడిగా జరిగాయి. పలు ప్రాంతాల్లో భోగి వేడుకల్లో ఏపీ మంత్రి నారాయణ పాల్గొన్నారు. ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం వెంప గ్రామంలో  జరిగిన భోగి సంబరాల్లో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ పాల్గొని సందడి చేశారు. 

 

నారావారిపల్లెలో చంద్ర‘క్రాంతి’.. జనంలో, జనంతో బాబు కుటుంబం వేడుకలు

రాష్ట్రంలో, ఆ మాటకొస్తే దేశంలో ప్ర‌ముఖ రాజ‌కీయ నాయ‌కులు చాలా మందే ఉన్నారు. వారిలో ఆంధ్రప్రదేశ్ చంద్ర‌బాబు అత్యంత ప్ర‌ముఖుడు. సంప్రదాయాలను ఆచరించడంలో, ప్రజలలో మమేకం కావడంలో, అందులో కుటుంబాన్ని భాగస్వామ్యం చేయడంలో ఆయన స్టైలే వేరు. ప్రతి సంక్రాంతి పండుగను స్వస్థలంలో ప్రజల మధ్య జరుపుకుంటారు. ఆయ‌న స్వ‌స్థలం నారావారిప‌ల్లె. ఈ ప‌ల్లె అదృష్టం ఎలాంటిదంటే ప్ర‌తి సంక్రాంతి స‌మ‌యంలో ఈ ప‌ల్లె పేరు మారు మోగుతుంది. అంతే కాదు.. నారావారి పల్లెలో జ‌రిపే సంక్రాంతి వేడుక‌ల్లో నారా, నంద‌మూరి కుటుంబసభ్యులందరూ క‌ల‌సి  పాల్గొంటారు. దీంతో ఈ ఊరు క‌ళ‌క‌ళ‌లాడిపోతుంది. ఊరు ఊరంతా  జాత‌రలాంటి వాతావ‌ర‌ణం ఏర్పడుతుంది. సంక్రాంతి సందర్భంగా   ఒకే సారి నారా వారి కుటుంబానికి చెందిన మూడు త‌రాల‌ వారిని చూసి నారావారి పల్లె పులకించి పోతుంది. ఔను నారాచంద్రబాబు, భువనేశ్వరి దంపతులు, నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులు, వారి వారసుడు దేవాన్ష్ లు సంక్రాంతి సందర్భంగా నారావారి పల్లెలో  చేసే సందడే సందడి. గ్రామస్తులతో మమేకమై పండుగ జరుపుకుంటారు. దీంతో తాతా, తండ్రి, మనవడు ముగ్గురినీ ఒకే ఫ్రేమ్ లో ఒకే సారి కనిపించే అరుదైన, అపురూపమైన దృశ్యం నారావారి పల్లె వాసులకు దక్కుతుంది.   ఇక ఈ ఏడాది నారావారి పల్లె సంక్రాంతి సంబరాల్లో  నారా దేవాంశ్ ఆట పాట‌ల‌తో దేవాన్ష్ తల్లిదండ్రులు, తాతా నానమ్మలు మురిసిపోయారు. వారి మురిపెం చూసి నారావారిపల్లె పులకరించిపోయింది. అదలా ఉంటే  వైయ‌స్ స్వ‌స్త‌లం  పులివెందుల‌, ఇక కేసీఆర్ స్వ‌స్థలం చింత‌ మ‌డ‌క ఇంకా ఎంద‌రో నాయ‌కుల స్వ‌స్థలాలు ఉన్నాయి. అయితే అక్కడెక్కడా కనిపించని సంక్రాంతి సందడి, శోభ  ఒక్క నారావారి ప‌ల్లెలో మాత్ర‌మే క‌నిపిస్తుంది. దీంతో ఈ ఊరి భాగ్య‌మే భాగ్యం క‌దా? అనిపిస్తుంది. ఈ ఏడాది నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలకు హిందూపురం ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణ రాలేదు కానీ,  కానీ ఆయ‌న స‌తీమ‌ణి, కుమార్తె తెజస్విని, అల్లుడు, ఎంపీ శ్రీభరత్ వచ్చారు.   ఇక్కడ ఒక విషయం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అదేంటంటే.. నారావారి పల్లెలో చంద్రబాబు సకుటుంబ సపరివార సమేతంగా సంక్రాంతి పండుగ జరుపుకోవడం అధికారంలో ఉన్న‌పుడు మాత్ర‌మే కాదు, అధికారంలో లేనప్పుడు కూడా జరుపుకుంటారు. స్వగ్రామంలో ప్రజలలో మమేకమై పండుగ జరుపుకోవడం ఆయన ఎప్పటి నుంచో పాటిస్తున్న ఆచారం. ఆనవాయితీ.     జ‌ననీ జ‌న్మ‌భూమిశ్చ స్వ‌ర్గాద‌పీ గ‌రీయ‌సీ   అంటారు.  అలా సొంతూరికి ఇంత‌టి పేరు ప్ర‌ఖ్యాతులు తీసుకురావ‌డం కూడా ఒక ఘ‌న‌తే. అలాంటి ఘ‌న‌త సాధించిన చంద్ర‌బాబు  స్వ‌స్థ‌లం నారావారిప‌ల్లె అదృష్ట‌మే అదృష్టం క‌దా? అన్న మాట వినిపిస్తోంది.

శబరిమలలో మకర జ్యోతి దర్శనం.. పులకించిన భక్త జనం

ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో బుధవారం ( జనవరి 14) సాయంత్రం మకరజ్యోతి దర్శనం కనువిందు చేసంది. అశేష భక్తజన సందోహం మధ్య అయ్యప్ప భక్తులు ప్రత్యక్షంగా మకర జ్యోతి దర్శనం చేసుకున్నారు. పొన్నాంబలమేడు కొండపై మకరజ్యోతి మూడుసార్లు భక్తులకు దర్శన మిచ్చింది. ఈ అపురూప దృశ్యాన్ని తిలకించిన లక్షలాది మంది భక్తజనం స్వామియే శరణం అయ్యప్ప అంటూ తన్మయత్వంలో మునిగిపోయారు.  అంతకుముందు.. పందళం రాజప్రాసాదం నుంచి తీసుకొచ్చిన పవిత్రమైన తిరువాభరణాలను అయ్యప్ప స్వామికి  అలంకరించారు. అనంతరం, ఆలయ పూజారులు స్వామివారికి ప్రత్యేక దీపా రాధన నిర్వహించారు. ఆ వెంటనే పొన్నాంబలమేడు కొండపై దివ్యజ్యోతి కనిపించడంతో శబరిగిరులు అయ్యప్ప నామ స్మరణతో మార్మోగిపోయాయి. అయ్యప్ప భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.  మకరజ్యోతి దర్శనం సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో ట్రావెన్‌కోర్‌ దేవస్ధానం  బోర్డు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది.  

పండుగ వేళ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఆనందహేల

సంక్రాంతి పండుగ  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డబుల్ ఆనందం తీసుకువచ్చింది.  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వోద్యుగులు, పెన్షనర్స డీఏ, డీఆర్ బకాయిలను వారి ఖాతాలో జమ చేసింది. వీరితో పాటు కాంట్రాక్టర్ల బిల్లులు కూడా చెల్లించింది. ఇందు కోసం 26 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా 5.7 లక్షల మందికి లబ్ధి చేకూరింది. ఉద్యోగులు, పెన్షనర్ల బకాయిలను వారి వారి ఖాతాలలో జమచేయడం వల్ల ఒక్కొక్కరి ఖాతాలో 30 నుంచి 60 వేల వరకూ జమ అయ్యాయి. ప్రభుత్వం ఈ బకాయిలను సరిగ్గా భోగి పండుగ రోజున విడుదల చేయడంతో ఏపీ ప్రభుత్వోద్యోగులు, పెన్షనర్ల కుటుంబాలలో  సంక్రాంతి సంతోషం రెట్టింపైంది.   దాదాపు ఆరేళ్ల తరువాత ఈ బకాయిలు విడుదలయ్యాయి.    అలాగే పోలీసులకు రావాల్సిన సరెండర్ లీవులు, డీఏ ఎరియర్లను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. న  పండగ పూట బకాయిలు జమ కావడంతో ఉద్యోగులతోపాటు రిటైర్డ్ ఉద్యోగుల కుటుంబాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. 

మహిళలను కించపరచడం అమానుషం : సీపీ సజ్జనార్

  ప్రజా జీవితంలో మహిళలను కించపరచడం అమానుషమని హైదరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. మహిళలపై వ్యక్తిగత దాడులు, చరిత్ర హననం, అసభ్య వ్యాఖ్యలు సమాజ పురోగతికి గొడ్డలిపెట్టు అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగి అయినా, ప్రైవేట్ ఉద్యోగి అయినా, గృహిణి అయినా మహిళ గౌరవం అపరిమితం అని ఎక్స్ వేదికగా సీపీ పేర్కొన్నారు.  టీవీ చర్చలు, సోషల్ మీడియా పోస్టులు, వార్త కథనాల పేరుతో మహిళలపై దూషణలు ఖండించాలని పిలుపునిచ్చారు. వ్యక్తిగతంగా దెబ్బతీయడం, ప్రతిష్ఠను నాశనం చేయడం ఏమాత్రం ఆమోద యోగ్యం కాదని తెలిపారు. మహిళలను గౌరవించని సమాజం భవిష్యత్తును కోల్పోతుందని పేర్కొన్నారు. మహిళలపై అవమానం, వివక్ష, చరిత్ర హననం ఇక సహించమని సజ్జనార్ హెచ్చరించారు.  మన పురాతన ధర్మం "యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః" (ఎక్కడ మహిళలు పూజించబడతారో, అక్కడ దేవతలు కొలువై ఉంటారు) అని చెబుతోంది. కానీ నేటి కాలంలో మహిళా అధికారులపై ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న వ్యక్తిత్వ హననం  మన నాగరికతనే ప్రశ్నిస్తోందన్నారు. ది ఫ్యూచర్ ఈజ్ ఫీమేల్ అని భవిష్యత్ అంతా మహిళలదే అని సీపీ సజ్జనార్ తెలిపారు. ఐఏఎస్ అధికారిణిపై అవాస్తవాలను ప్రచారం చేసిన కేసులో తెలంగాణలో వరుస అరెస్టులు జరగడం సంచలనంగా మారింది.

ములుగు జిల్లా రద్దు కాదు...మంత్రి సీతక్క క్లారిటీ

  జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ములుగు జిల్లా రద్దవుతుందంటూ జరుగుతున్న ప్రచారాన్ని మంత్రి సీతక్క ఖండించారు. జిల్లా కోసం పోరాడి ఇప్పుడు ఎందుకు రద్దు చేస్తామన్నారు. కొత్త జిల్లాలు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అశాస్త్రీయంగా ఏర్పాటు చేసిందని, శాస్త్రీయ పద్దతిలో స్వల్ప మార్పులు ఉంటాయని ముఖ్యమంత్రి తెలిపారు. ములుగు జిల్లాకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ. వందల కోట్లు ఖర్చు చేస్తోందని ప్రజలు ఆందోళన పడొద్దని సీతక్క సూచించారు.  పలు యూట్యూబ్‌ ఛానెళ్ల ద్వారా జిల్లాపై తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం, కాంగ్రెస్‌ పార్టీపై బురదజల్లేందుకే ఈ విధంగా ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ములుగు జిల్లాలో ఒక మండలం ఉంటుంది.. అందులోని ఐదు గ్రామాలు పక్కన భూపాలపల్లి జిల్లాలో ఉంటాయిని మంత్రి తెలిపారు. అలాంటప్పుడు ప్రజలకు పాలనా ఫలాలు ఎలా అందుతాయి... రెవిన్యూ, పోలీసు సరిహద్దులు ఒకే లాగా ఉండాలని తెలిపారు. దీంతో జిల్లాల సరిహద్దు గ్రామాల ప్రజలు రెండు జిల్లాల కలెక్టరేట్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది .అందుకే శాస్త్రీయ పద్ధతిలో జిల్లాల సరిహద్దు విషయంలో స్వల్ప మార్పులు ఉంటాయని సీఎం చెప్పారని ఆమె తెలిపారు. 

మహిళ ఐఏఎస్‌లపై అసత్య కథనాలు...పలువురిపై కేసు నమోదు

  ఒక మహిళ ఐఏఎస్ అధికారిని కించపరిచేలా వార్తలు, కథనాలు ప్రసారం చేసిన ఘటనలో సిటీ సెంట్రల్ క్రైమ్ స్టేషన్  పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఈ కేసులో దర్యాప్తును వేగవంతం చేసిన సిసిఎస్ పోలీసులు ఇప్పటికే కీలక అరెస్టులు చేశారు. ఓ న్యూస్ ఛానల్‌కు చెందిన ఇన్‌పుట్ ఎడిటర్‌తో పాటు ఇద్దరు రిపోర్టర్లను అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. మహిళ ఐఏఎస్ అధికారిని వ్యక్తిగ తంగా కించపరిచే విధంగా, ఆమె ప్రతిష్టకు భంగం కలిగిం చేలా అసత్యాలు, అవమా నకర వ్యాఖ్యలతో కూడిన కథనాలను ఉద్దేశపూర్వ కంగా ప్రసారం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇది కేవలం మీడియా నైతికత ఉల్లంఘన మాత్రమే కాకుండా, చట్టపరమైన నేరంగా కూడా పరిగణిం చబడుతుందని సిసిఎస్ అధికారులు స్పష్టం చేశారు. 44 యూట్యూబ్ చానల్స్‌పై కేసులు ఈ వ్యవహారంలో టెలివిజన్ ఛానల్స్‌తో పాటు 44 యూట్యూబ్ చానల్స్ కూడా మహిళ ఐఏఎస్ అధికారిని కించపరిచే విధంగా వీడి యోలు, చర్చలు, అభ్యంత రకర కంటెంట్ ప్రసారం చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ నేపథ్యంలోనే ఆయా యూట్యూబ్ చానల్స్‌ పై చట్టపరమైన చర్యలకు సిసిఎస్ పోలీసులు రంగం సిద్ధం చేశారు.సోషల్ మీడియా వేదిక ద్వారా తప్పుడు ప్రచారం, దుష్ప్ర చారం చేయడం ద్వారా పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ... అధికారిని అవమా నించే ప్రయత్నం చేసిన వారి ని గుర్తించే పనిలో  నిమగ్న మయ్యారు. ఇప్పటికే పలు వురు యూట్యూబ్ చానల్స్ నిర్వాహకులను గుర్తించి నట్లు అధికారులు వెల్లడించారు.  సాంకేతిక ఆధారాలు, డిజిటల్ ఫుట్‌ప్రింట్స్ ఆధారంగా యూట్యూబ్ చానల్స్ నిర్వాహకుల వివరాలను సేకరించే పనిలో పడ్డ సిసిఎస్ పోలీసులు, వారిని త్వరలోనే అరెస్ట్ చేసే అవకాశముందని స్పష్టం వ్యక్తం చేశారు. కేసుకు సంబంధించిన ఆధారాలు పటిష్టంగా ఉన్నాయని, ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని పోలీసులు హెచ్చ రించారు. ఈ ఘటనపై సిసిఎస్ పోలీసుల దూకు డుతో పలువురు యూట్యూబ్ చానల్స్ నిర్వాహకులు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. కొందరు వీడియోలను తొలగించగా, మరికొందరు తమ చానల్స్‌ను తాత్కా లికంగా మూసివేసినట్లు తెలుస్తోంది. అయితే డిలీట్ చేసిన కంటెంట్ కూడా డిజిటల్ ఆధారాల రూపంలో తమ వద్ద ఉందని పోలీ సులు చెబుతున్నారు. మీడియాకు సిసిఎస్ హెచ్చరిక ఈ సందర్భంగా సిసిఎస్ పోలీసులు మీడియా సంస్థ లకు కీలక హెచ్చరికలు చేశారు. వ్యక్తుల గౌరవం, ముఖ్యంగా మహిళా అధి కారుల ప్రతిష్టను దెబ్బ తీసేలా అసత్య కథనాలు ప్రసారం చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. మీడియా స్వేచ్ఛ పేరుతో చట్టాలను ఉల్లంఘిస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు.ఈ కేసు తెలుగు రాష్ట్రాల్లో మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రానున్న రోజుల్లో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. జర్నలిస్టుల అక్రమ అరెస్టును టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఖండించారు.జర్నలిస్టులను అర్ధరాత్రి అక్రమ అరెస్ట్ చేయడం కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి మంచిది కాదని ఆయన సుచించారు.జర్నలిస్టుల అరెస్ట్‌ను వెంటనే ఆపాలంటూ సీపీ సజ్జనార్, డీజీపీ శివధర్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.మహిళా ఐఏఎస్ అధికారిపై అసభ్యకర కథనాలు ప్రసారం చేసిన కేసులో ఓ వార్తా సంస్థ ఇన్ పుట్ ఎడిటర్, ఇద్దరు జర్నలిస్టులను సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.  మరోవైపు ప్రముఖ న్యూస్ ఛానల్‌పై  సిట్ అధికారులు తనిఖీలు నిర్వహించి ఆఫీసులో సర్వర్లు లాగేసి, కంప్యూటర్లు సీజ్ చేశారు.

డబ్ల్యూపీఎల్‌‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ సరికొత్త రికార్డు

  డబ్ల్యూపీఎల్‌ 2026లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ సరికొత్త చరిత్ర సృష్టించింది. మంగళవారం గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అజేయంగా 71 పరుగులు చేసి జట్టును ఏడు వికెట్ల తేడాతో విజయతీరాలకు చేర్చింది. ఈ ఇన్నింగ్స్‌తో డబ్ల్యూపీఎల్ చరిత్రలో 1000 పరుగులు పూర్తి చేసిన తొలి భారత బ్యాటర్‌గా హర్మన్‌ప్రీత్ రికార్డులకెక్కింది.  మొత్తంగా ఈ ఘనత సాధించిన ప్లేయర్లలో హర్మన్(1016 పరుగులు) రెండో స్థానంలో ఉంది. అగ్రస్థానంలో ముంబై ఇండియన్స్‌కే చెందిన నాట్ సీవర్ బ్రంట్(1101పరుగులు) కొనసాగుతోంది. గుజరాత్‌తో మ్యాచులో 193 పరుగుల లక్ష్యంతో ఛేదనకి దిగిన ముంబైకి ఆరంభంలో ఎదురుదెబ్బ తగిలినా, హర్మన్‌ప్రీత్ క్రీజులోకి వచ్చాక మ్యాచ్ దిశ పూర్తిగా మారిపోయింది. హర్మన్ విధ్వంసానికి గుజరాత్ బౌలర్లు పూర్తిగా చేతులెత్తేశారు. హర్మన్‌కు నికోల్ కేరీ (23 బంతుల్లో 38*) చక్కటి సహకారం అందించింది.  

అమలాపురంలో వెయ్యి అడుగులు భారీ పిడకల దండ

  తెలుగువారు మూడు రోజుల పాటు జరుపుకునే సంక్రాంతి ఉత్సవాల్లో  మొదటి రోజు నిర్వహించే భోగి ప్రత్యేకమనే చెప్పుకోవాలి. తెల్లవారుజామునే అభ్యంగ స్నానమాచరించి.. ఆవు పేడతో చేసే పిడకలను భోగి మంటల్లో వేస్తారు. ఇంట్లోని పాత, ఉపయోగంలో లేని వస్తువులను భోగి మంటల్లో వేస్తే శుభం కలుగుతుందని ప్రజలు విశ్వసిస్తారు. ఇదిలా ఉండగా.. భోగి పండుగను పురస్కరించుకుని అంబేడ్కర్ కోనసీమలో రూపొందించిన భారీ భోగి దండ అందరినీ ఆకట్టుకుంటోంది.  అమలాపురంలోని రంగాపురం గ్రామస్థులు ఈ భోగి మాలతో సంక్రాంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. దాదాపు 20 వేల పిడకలతో 1000 అడుగుల భారీ భోగి దండను తయారు చేశారు గ్రామస్థులు. ఆ ఊళ్లోని విశ్వనాథ రాజు కుటుంబం.. స్థానికులతో కలిసి ఆవు పేడతో 20 రోజుల పాటు శ్రమించి ఈ హారాన్ని తయారు చేసింది. తెలుగు ప్రజల సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేసేందుకు గత ఆరేళ్లుగా భారీ భోగి దండలను గ్రామస్థులు తయారు చేస్తున్నారు. ఆరేళ్ల క్రితం 400 అడుగులతో మొదలైన భోగి దండ తయారీ నేడు 1000 అడుగులకు చేరిందని ఆ ఊరి ప్రజలు వివరించారు.  సుమారు అర కిలోమీటర్ మేర ఉన్న ఈ భారీ భోగి మాలను గ్రామస్థులతో కలిసి విశ్వనాథరాజు కుటుంబ సభ్యులు భోగి మంటలో వేశారు.  ప్రస్తుతం ఈ భారీ భోగి దండ జిలాల్లో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు.. కాకినాడ జిల్లా పిఠాపురం జై గణేశ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో 14 వేల ఆవు పిడకలతో భోగిమంట వేశారు. ఆలయం నుంచి మేళ తాళాలు, తప్పెడు గూళ్లు, గంగిరెద్దులు, హరిదాసుల సంకీర్తనలతో కోటగుమ్మం సెంటర్ వద్ద భోగి మంట వేశారు. ఆలయ అర్చకులు మైలవరపు రామకృష్ణ భోగి మంట వద్ద ప్రత్యేక పూజలు చేశారు.

పొంగల్ వండిన ప్రధాని మోదీ

  ఢిల్లీలోని కేంద్రమంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పొంగల్‌ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.  తొలుత ప్రత్యేక పూజా కార్యక్రమాలను ప్రధాని నిర్వహించారు. అనంతరం ఆయనే స్వయంగా పొంగల్‌ వండారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ గోవులకు పూజ చేశారు. ఈ సందర్బంగా ప్రధాని మోదీ మాట్లాడుతు  వెయ్యి సంవత్సరాల పురాతనమైన గంగైకొండ చోళపురం ఆలయ సందర్శన, పంబన్ వంతెన ప్రారంభోత్సవ సమయాల్లో తమిళుల చరిత్ర గొప్పతనాన్ని తెలుసుకున్నట్లు పేర్కొన్నారు.  కొన్ని నెలల క్రితం సహజ వ్యవసాయంపై తమిళనాడులో జరిగిన ఓ సమావేశానికి తాను హాజరైనట్లు ప్రధాని తెలిపారు. అక్కడ లాభదాయకమైన వృత్తులను వదిలి వ్యవసాయం వైపు మళ్లిన యువతను కలిశానని,   వ్యవసాయ రంగంలో విప్లవాన్ని తీసుకురావడానికి వారు చేస్తున్న కృషిని మరింత విస్తరించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. పొంగల్ వేడుకల్లో కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, రామ్మోహన్‌నాయుడు, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పాల్గొన్నారు. మరోవైపు ఈ పొంగల్ వేడుకను పలువురు ప్రముఖులు ఘనంగా జరుపుకుంటున్నారు. అలానే దేశ వ్యాప్తంగా ప్రజలు వివిధ రకాల వంటకాలు చేసుకుని, ఇళ్లను అలకరించుకుని పండగను ఘనంగా జరుపుకుంటున్నారు.