ఏపీలో బార్లు, వైన్ షాపుల్లో ఇకపై ఒకే ధరకు మద్యం
posted on Jan 13, 2026 @ 4:15PM
ఏపీ ఎక్సైజ్ పాలసీలోరాష్ట్ర ప్రభుత్వం పలు ముఖ్యమైన మార్పులు చేసింది. బార్ల వ్యాపారులకు, బార్ల వినియోగదారులకు ఊరటనిచ్చేలా బార్లపై విధించిన అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ను పూర్తిగా రద్దు చేసింది. 2019 నవంబర్ నుంచి బార్లపై ఉన్న ప్రత్యేక అలర్ట్నీ తొలగిస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం.. ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేశ్ కుమార్ మీనా.. జీఓ ఎంఎస్ నంబర్ 24ను జారీ చేశారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో వైన్ షాపుల్లో ధరల కంటే బార్లలో ప్రతి క్వార్టర్ మందుపై రూ.50 నుంచి రూ.60 వరకు ఎక్కువ ట్యాక్స్ వసూలు చేశారు. ఇకపై రిటైల్ షాపులు, బార్ల మధ్య ఒకే మద్యానికి రెండు ధరలు ఉండవు. వైన్షాపుల్లో, బార్లలో ధరలు ఒకేలా ఉండేలా చర్యలు తీసుకుంటారు. ఏపీఎస్బీసీఎల్ డిపోల నుంచి బార్లకు సరఫరా చేసే ఐఎంఎఫ్ఎల్, ఎఫ్ఎల్పై అదనపు పన్ను విధింపు ఉండకూడదని ఆదేశాలు జారీ చేశారు.
ఎక్సైజ్ చట్టాల ప్రకారం కొత్త నోటిఫికేషన్ జారీ చేస్తూ, 2025 బార్ లైసెన్స్ నిబంధనల్లో సవరణలు చేస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం బార్ల వ్యాపారులకు, బారులకు వెళ్లే మందుబాబులకు పెద్ద ఊరటగా మారనుంది. ఇలాంటి మార్పులతో బార్ల వ్యాపారులకు గణనీయంగా ఖర్చులు తగ్గే అవకాశం ఉంది.
డైరెక్టర్ ఆఫ్ ఎక్సైజ్, డిస్టిలరీస్ కమిషనర్, APSBCL అధికారులు ఈ మార్పుల అమలుకు బాధ్యత వహించనున్నారు. ఈ ఉత్తర్వులు మంగళవారం నుంచి (2026 జనవరి 13) నుంచి అమలులోకి వస్తాయి. గతంలో బార్లకు రిటైల్ షాపుల కంటే ఎక్కువ ధరకు మద్యం సరఫరా అవుతుండటం వల్ల వ్యాపారంలో ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితి తలెత్తేది. ఇప్పుడు ధరల సమానత్వంతో బార్లకు బిగ్ రిలీఫ్ అనే చెప్పుకోవచ్చు.