ఉమ్మడి పౌర స్మృతికి పచ్చజెండా ?
posted on Jul 9, 2021 @ 8:10PM
ఉమ్మడి పౌర స్మృతి, ఎప్పటినుంచో వినవస్తున్న మాట. ఒక రాజకీయ వివాదం. బీజేపీఎన్నికల వాగ్దానాలలో, ఇది కూడా ఒకటి. అయితే, ఇప్పడు కాగల కార్యం కోర్టులే కానిచేస్తున్నాయా, అంటే అవుననే అనవలసి వస్తోంది. ఇందుకు సంబదించి 2020 మార్చిలో సుప్రీంకోర్టు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది. మతంతో సంబంధం లేకుండా వారసత్వ చట్టాల రూపకల్పనపై అభిప్రాయం చెప్పాలని కోరింది. దీనికి సంబంధించిన ఐదు పిటిషన్లను విచారణకు చేపట్టింది. దీంతో అప్పుడే దేశంలో ఉమ్మడి పౌర స్మృతికి బాటలు పడుతున్నాయనే అభిప్రాయం ఏర్పడింది.
జూలై 7 న ఢిల్లీ హైకోర్టు ఏకంగా భారత దేశంలో ఉమ్మడి పౌర స్మృతి అవసరం చాలా ఉందని పేర్కొంది. అంతే కాదు ఉమ్మడి పౌర స్మృతి అమలుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. దేశంలో క్రమంగా కులాలు మతాల మధ్య అంతరాలు తొలిగి పోతున్నాయని, సజాతీయం, ఏకజాతిగా మారుతోందని, పేర్కొంది. ఈ మారుతున్న పరిణామాల నేపథ్యంలో ఉమ్మడి పౌర స్మృతి అవసరమని న్యాయస్థానం అభిప్రాయ పడింది. మీన కమ్యూనిటీకి చెందిన వ్యక్తులకు హిందూ వివాహ చట్టం, 1955 వర్తించడానికి సంబంధించిన కేసులో ఇచ్చిన తీర్పులో జస్టిస్ ప్రతిభ ఎం సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
వ్యక్తిగత చట్టాల వల్ల ఉత్పన్నమవుతున్న వైరుద్ధ్యాలు న్యాయస్థానానికి పదే పదే వస్తున్నాయని జస్టిస్ ప్రతిభ పేర్కొన్నారు. ఇటువంటి వైరుద్ధ్యాల వల్ల వివాహ బంధంలో ప్రవేశించిన వివిధ కమ్యూనిటీలు, కులాలు, మతాలకు చెందినవారు సంఘర్షణకు గురవుతున్నట్లు తెలిపారు. వేర్వేరు కమ్యూనిటీలు, తెగలు, కులాలు లేదా మతాలకు చెందిన భారతీయ యువత తమ పెళ్లిళ్ల విషయంలో వివిధ వ్యక్తిగత చట్టాల్లోని వైరుద్ధ్యాల వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలతో పోరాడవలసిన తప్పనిసరి పరిస్థితిని కల్పించకూడదన్నారు. మరీ ముఖ్యంగా పెళ్లి, విడాకుల విషయంలో యువత పోరాడవలసిన పరిస్థితు ఉండకూడదన్నారు.
భారత రాజ్యాంగంలోని అదికరణ 44 ఆశించినట్లుగా ఉమ్మడి పౌర స్మృతి (యూనిఫాం సివిల్ కోడ్) అవసరాన్ని సుప్రీంకోర్టు ఎప్పటికప్పుడు చెప్తోందన్నారు. ఇటువంటి పౌర స్మృతి అందరికీ సార్వజనీనంగా వర్తిస్తుందన్నారు. పెళ్లి, విడాకులు, వారసత్వం వంటి విషయాల్లో ఏకరీతి సిద్ధాంతాల వర్తింపునకు దోహదపడుతుందన్నారు. వివిధ వ్యక్తిగత చట్టాల వల్ల ఉత్పన్నమయ్యే వైరుద్ధ్యాలు, అసంగతాలను ఉమ్మడి పౌర స్మృతి తగ్గిస్తుందన్నారు.
పెళ్లి, విడాకులు, దత్తత, వారసత్వం వంటి విషయాలకు వర్తించే చట్టాలు ప్రస్తుతం మన దేశంలో వేర్వేరు మతాలకు వేర్వేరుగా ఉన్నాయి. హిందూ వివాహ చట్టం, హిందూ వారసత్వ చట్టం, ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజెస్ యాక్ట్, ఇండియన్ డైవోర్స్ యాక్ట్, పార్శీ మ్యారేజ్ అండ్ డైవోర్స్ యాక్ట్ వంటివి అమల్లో ఉన్నాయి. అయితే ముస్లిం పర్సనల్ చట్టాన్ని క్రోడీకరించలేదు. ముస్లింల మతపరమైన గ్రంథాలే వీటికి ఆధారం. ఈ వ్యక్తిగత చట్టాల వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలను పరిష్కరిస్తూ, అన్ని మతాల వారికీ ఒకే విధమైన నిబంధనలు వర్తించేలా చేయడానికి ఉమ్మడి పౌర స్మృతి అవసరమని చాలా మంది చెప్తున్నారు. ఇప్పటికే ట్రిపుల్ తలాక్ చట్టం చేసిన ప్రభుత్వం, ఇప్పుడు ఉమ్మడి పౌర స్మృతి చట్టం చేయడానికి కూడా వెనకాడదు. నిజానికి, జమ్మూ కశ్మీర్’కు ప్రత్యేక ప్రతిపత్తిని కలిపించే ఆర్టికల్ 370 రద్దు, అయోధ్యలో రామాలయం నిర్మాణంతో పాటుగా ఉమ్మడి పౌర స్మృతి అంశం కూడా బీజేపీ ప్రకటిత లక్ష్యాలలో ఒకటిగా వుంది.