తెల్ల కార్డుల సంఖ్య ఎంత తగ్గితే ప్రభుత్వం పై అంత భారం తగ్గుతుంది


 

ఏపీలో తెల్లకార్డుల కోతకు రంగం సిద్ధమైంది. ఏకంగా ఇరవై లక్షల కార్డుల తొలగించాలనీ వైసీపీ ప్రభుత్వం దాదాపు నిర్ణయానికి వచ్చింది. ఈ నెల పదిహేను నుంచి కొత్త బియ్యం కార్డులు పంపిణీ చేసి మార్చి నుంచి వాటి ఆధారంగానే సరుకులు ఇవ్వనున్నారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాల గుర్తింపునకు నిర్దేశించిన నిబంధనలను ప్రామాణికంగా తీసుకుని చేపట్టిన సర్వేలో పధ్ధెనిమిది లక్షల మంది తెల్లకార్డు కలిగివుండేందుకు అర్హులు కాదని ఏపీలో క్షేత్ర స్థాయిలో తేల్చారు. అయితే ఇది ప్రాథమిక అంచనా మాత్రమేనని ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని పౌరసరఫరాల శాఖ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఇప్పుడే వివరాలు బహిర్గతం చేస్తే ఒక్కసారిగా వ్యతిరేకత వస్తుందని అందువల్ల పూర్తిగా వడపోత చేసే వరకూ బయటపెట్టకూడదని ఆ శాఖ భావిస్తోంది. ఈ నెల పదిహేను నుంచి కొత్త బియ్యం కార్డులు పంపిణీ చేసి మార్చి నుంచి వీటి ఆధారంగానే సరుకులను అందిస్తారు. వేలి ముద్రల ఆధారంగా సరుకుల పంపిణీ జరుగుతున్నందున కొత్త కార్డులు చేతికి వచ్చినా, రాకపోయినా అర్హుల జాబితాలో పేరు ఉండడమే ప్రధానం కానుంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించిన అర్హుల జాబితాలో పేర్లు లేని రెండు లక్షల కుటుంబాలకు పైగా అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో వాటి పరిశీలన పూర్తి చేసిన తరవాత బియ్యం కార్డులు పంపిణీ చేయాలని పౌరసరఫరాల శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.

 వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కార్డుల వడపోత కార్యక్రమం ప్రారంభమైంది. అందరికీ నాణ్యమైన బియ్యం పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం ఇంతమందికి కార్డులెలా ఉన్నాయనే దానిపై దృష్టి సారించింది. రేషన్ తోపాటు ఇతర సంక్షేమ పథకాలకు ప్రామాణికంగా భావిస్తున్న తెల్లకార్డుల సంఖ్య ఎంత తగ్గితే ప్రభుత్వంపై అంత భారం తగ్గుతుందని భావించింది. అందుకే కార్డుల ఏరివేతకు శ్రీకారం చుట్టింది, ప్రజా సాధికార సర్వే సమాచారం, వాలంటీర్ల సర్వే నిర్వహించి కార్డులు వడపోసింది. అంతకుముందే ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న 1.38 లక్షల కార్డులను ఒక నెల నిలుపుదల చేసింది. దానిపై విమర్శలు రావడంతో అది సాంకేతిక సమస్య అని చెప్పి తిరిగి పునరుద్ధరించింది. అన్నింటికీ రేషన్ కార్డే ప్రామాణికం అనే విధానం పోతే కార్డుల సంఖ్య తగ్గుతోందని ప్రభుత్వం ఆలోచన చేసింది. ఆరోగ్యశ్రీ కి ప్రత్యేక కార్డులు జారీ చేస్తామని ఇతర పథకాలకు వేర్వేరు కార్డులు ఇస్తామని ప్రకటించింది కానీ, పేదలకు పంపిణీ చేస్తున్న ఇళ్ళ స్ధలాలు అమ్మఒడి పథకాలకు మళ్లీ బియ్యం కార్డులనే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. 

గ్రామీణ ప్రాంతాల్లో నెలకు పది వేలు, పట్టణ ప్రాంతాల్లో నెలకు పన్నెండు వేల ఆదాయం కంటే ఎక్కువ ఉంటే బియ్యం కార్డుకు అనర్హులు. అయితే స్వీపర్ లు, శానిటరీ వర్కర్ లు, సఫాయి కర్మచారి వర్కర్ లుగా పని చేస్తూ ఎంత వేతనం పొందుతున్నప్పటికీ వారికి ఆదాయం, నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చారు. అలాగే పది ఎకరాల కంటే ఎక్కువ భూమి కలిగిన వారు అర్హులు కారు, అందులో మాగాణి మూడెకరాల కంటే ఎక్కువ ఉండకూడదు. మొత్తం పది ఎకరాలు మెట్ట కానీ మూడెకరాలు మాగాణి దాటకుండా మిగిలింది మెట్టభూమి గానీ ఉండాలి. నాలుగు చక్రాల వాహనం ఉన్నా అనర్హులే, అయితే ట్యాక్సీ, ఆటో, ట్రాక్టర్ లు కలిగివున్న కుటుంబాలకు మినహాయింపు ఉంది. రెసిడెన్షియల్ కేటగిరీలో విద్యుత్ వినియోగం నెలకు మూడు వందల యూనిట్ లు దాటకూడదు. సొంతిల్లు అయినా అద్దిల్లైనా ఇదే నిబంధన వర్తిస్తుంది, అయితే ప్రభుత్వం విధించిన పది ఎకరాల పొలం నిబంధనపై కార్డుదారుల్లో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. రాయలసీమలో పది ఎకరాల దాటి పొలం ఉన్న వారు కూడా అత్యంత దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నారని సాగునీటి వసతులు ఉన్న డెల్టా ప్రాంతం లోనూ అదే నిబంధన పెట్టారనే వాదన వినిపిస్తుంది. వెనకబడిన ప్రాంతాలు, కరువు ప్రాంతాలకు ప్రత్యేక నిబంధనలు ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే వాహనాల నిబంధనపైనా విమర్శలు వస్తున్నాయి.

Teluguone gnews banner