తెలంగాణా ఇంటర్ పరీక్షలపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖమంత్రి...
posted on Feb 8, 2020 @ 10:38AM
తెలంగాణలో ఇంటర్ పరీక్షలకు సమయం దగ్గర పడుతోంది. అయితే గతేడాది జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా ఈ సారి స్వయంగా విద్యాశాఖమంత్రి పరీక్షల ఏర్పాట్లపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. వచ్చే నెల నాలుగు నుంచి ఇరవై మూడు వరకు (మార్చి 4-23) ఇంటర్ పరీక్షలు జరుగనున్నాయి. ఈ పరీక్షలకు 9,65,840 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. 1339 సెంటర్ లలో 24,740 మంది ఇన్విజిలేటర్ లను నియమించింది.
గతేడాది ఇంటర్ పేపర్ వాల్యుయేషన్ పై చెలరేగిన వివాదంతో రాష్ట్రం అట్టుడికింది. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు తెలంగాణ విద్యా వ్యవస్థను కుదిపేశాయి. దీంతో ఈ సారి ఇంటర్ పరీక్షల నిర్వహణలో జాగ్రత్తలు తీసుకుంటోంది ప్రభుత్వం. పేపర్ వ్యాల్యూషన్ పై గతేడాది జరిగిన పొరపాట్లు మరలా పునరావృతం కాకుండా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి కలెక్టర్ అధ్యక్షతన హై పవర్ కమిటీ ఏర్పాటు చేశారు.
జిల్లా కలెక్టర్ లు, ఎస్పీ లు, విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి సబితా ఇంద్రా రెడ్డి పరీక్షల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు జరగొద్దని ఆదేశించారు. రెవిన్యూ పోలీస్, ఆర్టీసీ, వైద్య, విద్యుత్తు శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని కలెక్టర్ లను కోరారు. పరీక్షల సమయంలో ఏ చిన్న సమస్య వచ్చినా ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నంబర్ ను కూడా ఏర్పాటు చేశారు. విద్యార్థులు, తల్లితండ్రులు పరీక్షల నిర్వహణ ఫలితాలపై ఆందోళన చెందొద్దని కోరారు. విద్యార్థుల ఎన్ రోల్ మెంట్ నుంచి పరీక్ష ఫీజు చెల్లింపు, పరీక్షల ప్రారంభానికి ముందు చేయాల్సిన మిగతా అన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది తెలంగాణ సర్కార్.