14 ఎమ్మెల్సీలకు త్వరలో షెడ్యూల్.. మర్రి, ఆమంచి, కుప్పం భరత్ కు బెర్త్?
posted on Oct 12, 2021 @ 2:35PM
కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నిక తర్వాత ఏపీలో మరో ఎన్నికకు రంగం సిద్ధమవుతోంది. శాసనమండలిలో ఖాళీల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ రాబోతోందని తెలుస్తోంది. ఏపీ శాసనమండలిలో ప్రస్తుతం వైసీపీకి 12 స్థానాలు, టీడీపీకి 15, బీజేపీకి ఒక స్థానం ఉన్నాయి. నలుగురేసి చొప్పున పీడీఎఫ్, ఇండిపెండెంట్ ఎమ్మెల్సీలు ఉన్నారు. గవర్నర్ కోటా నామినేటెడ్ సభ్యులు 8 మంది ఉన్నారు. మొత్తం 58 మంది సభ్యులకు గాను 14 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి.అందులో స్థానిక సంస్థల కోటా నుంచి 11 స్థానాలు..ఎమ్మెల్యే కోటా నుంచి మూడు స్థానాలు భర్తీ కావాల్సి ఉంది. చాలా రోజులుగా ఖాళీలు ఉన్నా.. స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యం కావడంతో వాయిదా పడుతూ వచ్చింది. కరోనా కారణంగా ఎన్నికల సంఘం సైతం ఎమ్మెల్సీల ఎన్నికలను వాయిదా వేస్తూ వచ్చింది. ఇప్పుడు పెండింగ్ లో ఉన్న అన్ని ఎన్నికలను వరుసగా నిర్వహిస్తున్న ఎన్నికల సంఘం.. త్వరలోనే ఏపీ శాసనమండలి ఖాళీల భర్తీకి షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
శాసనమండలి ఎన్నికల షెడ్యూల్ వస్తుందన్న సంకేతంతో పెద్దల సభకు కొత్త ఎంపిక అయ్యేది ఎవరు.. ఎవరికి అవకాశం దక్కనుంది అనే చర్చ సాగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని జిల్లాల్లోనూ వైసీపీనే మెజార్టీ సాధించటంతో ఆ 11 స్థానాలు వైసీపీ ఖాతాలోనే జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎమ్మెల్యేల సంఖ్యా పరంగానూ వైసీపీకే మిగిలిన మూడు స్థానాలు దక్కనున్నాయి. మొత్తంగా 14 స్థానాలు వైసీపీకే దక్కనుండటంతో ..ఈ పదవుల కోసం అధికార పార్టీలో ఆశావాహుల సంఖ్య పెరుగుతోంది. త్వరలో కేబినెట్ విస్తరణ ఉంటుందనే సమాచారంతో..ఇప్పుడు ప్రత్యేకంగా ఎంపిక చేసిన ఎమ్మెల్సీలుగా కేబినెట్ లో స్థానం దక్కుతుందనే ప్రచారం సాగుతోంది.
శాసనమండలి 14 స్థానాల కోసం సీఎం జగన్ మోహన్ రెడ్డి కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది. ఎమ్మెల్సీ అభ్యర్థులపై ఆయన ఇప్పటికే నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం. సామాజిక సమీకరణాల, 2024 సార్వత్రిక ఎన్నికలకు ఉపయోగపడేలా అభ్యర్థులను ఖరారుచేయాలని సీఎం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. గతంలో సీఎం జగన్ హామీ ఇచ్చిన వారికి ఈ సారి ఖాయంగా అవకాశం దక్కుతుందని చెబుతున్నారు. ఇందులో మొదటగా గుంటూరు జిల్లా చిలకూలురు పేట మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ కు ఈసారి మండలి బెర్త్ ఖాయమని అంటున్నారు. వైసీపీలో మొదటి నుంచి యాక్టివ్ గా ఉన్న మర్రికి గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదు జగన్. అయితే ఎన్నికల ప్రచారంలో మాత్రం మర్రిని మంత్రిని చేస్తానని ప్రకటించారు. దీంతో ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకుంటారని భావించారు. కాని రెండున్నర ఏండ్లు అవుతున్నా మర్రికి మాత్రం న్యాయం జరగలేదు. ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన ప్రతిసారి మర్రికి ఖాయమని ప్రచారం జరగడం.. చివరకు ఆయనకు షాక్ తగలడం వస్తూ ఉంది. ఈసారి మాత్రం మర్రి రాజశేఖర్ కు సీటు ఖాయమైందని అంటున్నారు.
గుంటూరు జిల్లాకే చెందిన పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కూడా రేసులో ముందున్నారని అంటున్నారు. వైసీపీ నుంచి గతంలోనూ ఎమ్మెల్సీగా చేశారు ఉమ్మారెడ్డి. మండలిలో వైసీపీఎల్పీ నేతగా వ్యవహరించారు. నెల్లూరు జిల్లాకు చెందిన బీద మస్తాన్ రావుకు ఎమ్మెల్సీ ఖాయమని చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. చిత్తూరు జిల్లా కుప్పం వైసీపీ ఇంచార్జ్ గా ఉన్న భరత్ కు మండలి సీటు కన్మామ్ అయిందంటున్నారు. కుప్పంపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వైసీపీ మంచి ఫలితాలు సాధించింది. దీంతో వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబుకు చెక్ పెట్టడానికి భరత్ కు ఎమ్మెల్సీ ఇస్తు్న్నారని అంటున్నారు.
పార్టీలో మొదటి నుంచి చురుకుగా పని చేసిన విశాఖపట్నం జిల్లాకు చెందిన వరుదు కళ్యాణి.. సీఎం జగన్ హామీ ఇచ్చారని తెలుస్తోంది. కృష్ణా జిల్లా గన్నవరం నేత యార్లగడ్డ వెంకట్రావుకు ఎమ్మెల్సీ ఖరారైందని సమాచారం. గన్నవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలిచిన వంశీ.. ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. గత ఎన్నికల్లో గన్నవరం నుంచి వైసీపీ అభ్యర్థిగా యార్లగడ్డ పోటీ చేశారు. వంశీ చేరిక తర్వాత నియోజకవర్గంలో రెండు వర్గాల ఆదిపత్య పోరు సాగుతోంది. దీంతో యార్గగడ్డను మండలికి పంపించి వంశీకి లైన్ క్లియర్ చేయాలని జగన్ భావిస్తున్నారని సమాచారం.
ప్రకాశం జిల్లా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కు శాసనమండలి బెర్త్ ఖాయమైందని తెలుస్తోంది. ఆమంచి గత ఎన్నికల్లో చీరాలలో ఓడిపోయారు. తర్వాత ఆమంచిపై గెలిచిన కరణం బలరాం వైసీపీలో చేరారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య కోల్డ్ వార్ సాగుతోంది. దీంతో ఇద్దరి మధ్య సయోద్య కుదిర్చిన జగన్.. ఆమంచిని శాసనమండలికి పంపించి కరణంకు చీరాలలో ఇబ్బంది రాకుండా చూస్తున్నారని చెబుతున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన హరిప్రసాద్ రెడ్డి, అనంతపురం జిల్లా ఉరవకొండకు చెందిన సీనియర్ నేత వై లక్ష్మీదేవి మండలి రేసులో ముందున్నారని చెబుతున్నారు.