వివాదంగా మారిన వివాహ చట్టం.. అశోక్ గెహ్లోట్ కు గండం?
posted on Oct 12, 2021 @ 2:52PM
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కుర్చీ తుమ్మితే ఊడిపోయే ముక్కులా ఉంది. సచిన పైలట్ కట్టి గెహ్లోట్ మెడ మీద అలా వెళ్ళాడుతూనే ఉంది. అయితే దినదినగందం నూరేళ్ళ ఆయుషు అన్నట్లుగా, ఎప్పటికప్పుడు వేటు నుంచి తప్పించుకుంటూనే ఉన్నారు. తాజాగా పంజాబ్ ముఖ్యమంత్రి పదవి నుంచి కెప్టెన్ అమరీందర్ సింగ్’ను కాంగ్రెస్ నాయకత్వం తొలిగించిన సమయంలో మళ్ళీ మరో మారు రాజస్థాన్ అదికార మార్పిడి తప్పదనే పుకార్లు వినిపించాయి. అదే సమయంలో, సచిన్ పైలట్ పక్షం రోజులకు పైగా ఢిల్లీలో మకాం వేయడంతో రాజస్థాన్ లోనూ ముఖ్యమంత్రి మార్పు తధ్యమన్న వ్యుహాకథనాలు వచ్చాయి కానీ, అవేవీ కార్య రూపం దాల్చలేదు.
రాష్ట్రంలో జరిగే అన్ని వివాహాలను తప్పనిసరిగా రిజిస్టర్ చేసేలా ఇటీవల రాజస్థాన్ ప్రభుత్వం కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజీ(సవరణ) బిల్లును రూపొందించింది. సెప్టెంబరు 17న ఈ బిల్లును అక్కడి శాసనసభలో ప్రవేశపెట్టగా ఆమోదముద్ర కూడా పడింది. అయితే ఇంకా చట్టరూపం దాల్చలేదు. ఇంతలోనే, ఈ బిల్లులోని ఓ క్లాజ్ ప్రకారం.. ‘‘వధువు వయసు 18ఏళ్లు లోపు, వరుడి వయసు 21 ఏళ్ల లోపు ఉంటే వారి తల్లిదండ్రులు 30 రోజుల లోగా తమ పిల్లల పెళ్లిని తప్పనిసరిగా నమోదు చేయాలి’’ అని ఉంది.అంటే.. బాల్య వివాహామైనా కూడా తల్లిదండ్రుల అనుమతి ఉంటే వాటిని చట్టబద్ధం చేయొచ్చన్నమాట. దీంతో ఇది కాస్తా తీవ్ర వివాదానికి తెరతీసింది.ఈ బిల్లు బాల్య వివాహాలను చట్టబద్ధం చేసేందుకు అవకాశమిచ్చేలా ఉందని విపక్షాలు విరుచుకు పడ్డాయి. దీంతో వెనక్కి తగ్గిన ఆ రాష్ట్ర ప్రభుత్వం బిల్లును ఉపసంహరించుకుంది.
ఈ బిల్లుపై ప్రతిపక్ష భాజపా సహా హక్కుల కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓ వైపు బాల్య వివాహాలను అరికట్టాలని దేశమంతా ఉద్యమాలు జరుగుతుంటే.. రాజస్థాన్ ప్రభుత్వం మాత్రం వాటికి చట్టపరంగా అనుమతి కల్పిస్తోందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ బిల్లు బాల్య వివాహాలను ప్రోత్సహించేలా ఉందంటూ పలువురు మండిపడుతున్నారు. దీనిని ఓ స్వచ్ఛంద సంస్థ హైకోర్టులో సవాల్ కూడా చేసింది. దీంతో ఈ వివాదాస్పద బిల్లుపై రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ‘‘వివాహాలను చట్టబద్ధం చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే ఈ సవరణ బిల్లును తీసుకొచ్చాం. అయితే ఇందులోని కొన్ని నిబంధలను బాల్య వివాహాలను సమర్థించేలా ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అందుకే బిల్లును వెనక్కి పంపాలని గవర్నర్ను కోరాం. దీనిపై న్యాయపరమైన సంప్రదింపులు జరిపి తదుపరి కార్యాచరణ చేపడతాం. బాల్య వివాహాలపై మా ప్రభుత్వం ఎన్నడూ రాజీ పడదు. వాటిని నిర్మూలించేందుకు గట్టిగా కృషి చేస్తున్నాం’’ అని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ వెల్లడించారు.