కాంగ్రెస్ లో కేసీఆర్ కలకలం.. భట్టి టీమ్ కు బ్యాండేనా!
posted on Jun 26, 2021 @ 4:58PM
తెలంగాణలో కాంగ్రెస్ కొత్త చిచ్చు సెగలు రేపుతోంది. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్తో సీఎల్పీ నేతలు సమావేశం కావడం హస్తం పార్టీలో తీవ్ర దుమారం రేపుతోంది. కేసీఆర్ ను కలిసిన నేతలపై కొందరు హైకమాండ్ కు ఫిర్యాదు చేయగా... అటు నుంచి కూడా వెంటనే రియాక్షన్ వచ్చిందని తెలుస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసిఆర్ ను కలవడంపై అధిష్టానం సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. పార్టీలో చర్చించకుండా ముఖ్యమంత్రిని కలవడం ఏంటని ప్రశ్నించిన తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మనిక్కం ఠాగూర్.. సీఎంతో జరిగిన సమావేశంపై వివరణ ఇవ్వాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను ఆదేశించినట్లు తెలుస్తోంది.
ఇటీవల కాలంలో కాంగ్రెస్ నేతలకు కేసీఆర్ ఒక్క సారి కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు కూడా ఛాన్స్ ఇవ్వలేదు. సీనియర్ నేత వీహెచ్ కొన్ని రోజుల క్రితమే కేసీఆర్ ను కలవాలని ప్రగతి భవన్ దగ్గరకు వెళ్లినా... లోపలికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో ఆయన అక్కడే ఆందోళన చేశారు. అలాంటిది శుక్రవారం సడెన్ గా భట్టీ టీమ్ కు అపాయింట్ మెంట్ వచ్చింది. సీఎల్పీ నేతలు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు సీఎం క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్తో ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిశారు. యాదాద్రి జిల్లా అడ్డగూడురు పోలీసు స్టేషన్లో లాకప్డెత్కు గురై మరియమ్మ అంశం గురించి మాట్లాడేందుకు మాత్రమే సీఏంను కలిసామని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్తున్నారు.
అయితే కేసీఆర్ ను భట్టీ టీమ్ కలవడం కాంగ్రెస్ లో దుమారం రేపుతోంది. తెలంగాణ రాజకీయాలన్ని ప్రస్తుతం హుజురాబాద్ ఉప ఎన్నిక చుట్టే తిరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో కేసీఆర్ ను కలిస్తే రాజకీయంగా పార్టీకి నష్టం జరిగిందని కొందరు కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ నేతలు కేసీఆర్తో భేటీ అవ్వడం వల్ల తప్పుడు సంకేతాలు జనాలలోకి వెళ్లాయని పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భట్టి తీరుపై కొందరు హస్తం నేతలు బహిరంగంగానే ఆరోపణలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి పీసీసీ ఖరారు అయిందనే వార్తల నేపథ్యంలో భట్టి అండ్ టీం కేసిఆర్ను కలవడం మరో చర్చకు దారితీస్తోంది. కావాలనే పార్టీని నష్టపరిచేందుకు సీఏంను కలిసారని రేవంత్ రెడ్డి అండ్ టీం నేతలు చెపుతున్నారు. ఈ విషయంలో హైకమాండ్ సీరియస్ యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నారు.
మరోవైపు బీజేపీ కూడా ఈ అంశాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటోంది. సీఎల్పీ నేతలను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్పై దుమ్మెత్తిపోస్తున్నారు. కమలం నేతలు. కాంగ్రెస్ ఓట్లను టీఆర్ఎస్కు బదలాయింపు చేయడానికే భేటీ జరిగిందని బీజేపీకి చెందిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. కేసీఆర్ ను కలవడం వల్ల కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ చేసుకుందా అనే చర్చ రాజకీయ వర్గాల్లో కూడా జరుగుతోంది. తాజా ఘటనతో సొంత పార్టీ నేతలను ఏమీ అనలేక.. బయటకు మాట్లాడలేక తెగ ఇబ్బంది పడిపోతున్నారట సీఎల్పీ లీడర్లు. మొత్తంగా కేసిఆర్ వ్యూహాత్మకంగా కొట్టిన దెబ్బకు కాంగ్రెస్ నేతలకు దిమ్మతిరిగి పోయిందని అంటున్నారు.