విద్యార్థులకు ఇంటివద్దే పరీక్షలు..
posted on May 24, 2021 8:44AM
దేశంలో కరోనా విజృంభణలో చాలా రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమలవుతోంది. కరోనా కల్లోలంతో కేంద్ర ప్రభుత్వ పరిధిలోని విద్యా సంస్థలతో పాటు రాష్ట్రాల్లోనూ పరీక్షలు వాయిదా పడ్డాయి. కేంద్ర సర్కార్ సీబీఎస్ఈ, జేఈఈ, నీట్ పరీక్షలను వాయిదా వేసింది. చాలా రాష్ట్రాల్లో టెన్త్, ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను రద్దు చేసి విద్యార్థులంతా పాస్ అయినట్లు ప్రకటించాయి. ఇంటర్ సెకండియర్ పరీక్షలను మాత్రం వాయిదా వేశాయి. అయితే తాజాగా కేంద్ర సర్కార్ వాయిదా పడిన పరీక్షలను నిర్వహించేందుకు కసరత్తు ప్రారంభించింది. ఆదివారం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రుల సమావేశం వర్చువల్ గా జరిగింది. ఇందులోనూ వాయిదా పడిన పరీక్షలను నిర్వహించాలనే ఆలోచనకు అన్ని రాష్ట్రాలు వచ్చాయి.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో విద్యాసంస్థల నిర్వహణ, పరీక్షలు చేపట్టేందుకు వీల్లేకపోవడంతో చత్తీస్ గఢ్ ప్రభుత్వం ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. 12వ తరగతి విద్యార్థులకు ఇంటివద్ద నుంచే పరీక్షలు రాసే వెసులుబాటు కల్పించింది. రాష్ట్రంలో 2.90 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఈ ఓపెన్ బుక్ పరీక్ష విధానానికి సంబంధించిన మార్గదర్శకాలను చత్తీస్ గఢ్ ప్రభుత్వం నేడు విడుదల చేసింది
చత్తీస్ గఢ్ సర్కార్ పరీక్షలు మార్గదర్శకాలు ఇవి..
ఓపెన్ బుక్ విధానంలో విద్యార్థి పరీక్ష రాయాల్సి ఉంటుంది.
విద్యార్థి జూన్ 1 నుంచి 5వ తేదీ లోపు పరీక్ష పత్రాన్ని తీసుకెళ్లవచ్చు.
పరీక్ష రాసిన 5 రోజులకు జవాబు పత్రాలను ఇన్విజిలేటర్ కు సమర్పించాలి.
ఉదాహరణకు జూన్ 1న ప్రశ్నాపత్నం తీసుకెళ్లిన విద్యార్థి సమాధాన పత్రాలను జూన్ 6న సమర్పించాల్సి ఉంటుంది.
సమాధాన పత్రాలను స్వయంగా తీసుకెళ్లి తమ స్కూళ్లలోని ఇన్విజిలేటర్ కు అందించాలి. పోస్టులో పంపడం నిషిద్ధం.
జూన్ 1 నుంచి 5వ తేదీ మధ్యలో ఆన్సర్ కీని కూడా పొందవచ్చు.