జగన్పై చంద్రబాబు విమర్శల జడివాన
posted on Mar 29, 2011 @ 5:00PM
హైదరాబాద్: భూకేటాయింపులపై శాసనసభలో చర్చ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వైయస్సార్ కాంగ్రెసు నేత వైయస్ జగన్పై విమర్శల జడివాన కురిపించారు. చంద్రబాబు తమ నాయకుడిని పేరును ప్రస్తావించినప్పుడు వైయస్ జగన్ వర్గం శాసనసభ్యులు అడ్డుకున్నారు. చంద్రబాబు ప్రసంగానికి అభ్యంతరాలు వ్యక్తం చేశారు. తెలుగుదేశం, వైయస్ వర్గం శాసనసభ్యులు పోటాపోటీగా నినాదాలు చేశారు. జగన్ వర్గం ఎమ్మెల్యేలపై చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హసన్ అలీ మీ డబ్బులను ప్రపంచమంతా ఎలా తిప్పుతున్నాడో అందరికీ తెలుసునని ఆయన వ్యాఖ్యానించారు. నీతి, నిజాయితీ, నైతిక విలువలు లేని మనుషులు తన గురించి మాట్లాడుతున్నారని ఆయన విరుచుకుపడ్డారు. వారికి తాను బెదిరిపోనని ఆయన అన్నారు. వారికి మాట్లాడే అర్హత లేదని ఆయన అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్కో ఎంపిటిసిని 15 లక్షల రూపాయలకు కొనుగోలు చేశారని ఆయన ఆరోపించారు. ప్రజా ధనాన్ని దోచుకునే హక్కు లేదని ఆయన అన్నారు. ఈ సమయంలో జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యురాలు కొండా సురేఖ పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తుతూ - వైయస్ జగన్కు భయపడి చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. సభలో లేని వ్యక్తుల గురించి ప్రస్తావించడం సరి కాదని ఆమె అన్నారు. పత్రిక ఉందని చెప్పి తనపై ఆరోపణలు చేస్తున్నారని బాబు మండిపడ్డారు.
జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రజల సొమ్ము దోచుకున్నారని ఆయన విరుచుకు పడ్డారు. ప్రజల సొమ్ము దోచుకోవడానికి వీరికి హక్కులు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ హయాంలో ఏమైనా అక్రమాలు జరిగినాయని అనుమానాలు ఉంటే విచారణకు సిద్ధమని సవాల్ చేశారు. నాటి వైయస్ ప్రభుత్వం కర్ణాటకలో ఒకరికి రాష్ట్రంలో భూములు కట్టబెట్టి బెంగుళూరు కమర్షియల్ బిల్డింగ్ జగన్ సొంతం చేసిందని ఆరోపించారు. బ్రాహ్మిణీ స్టీల్స్ ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగాన్ని కేటాయించక పోవడమే కాకుండా అసలు ఒక్క పైసా పెట్టుబడి పెట్టలేదన్నారు. ఎన్నికలకు ముందు బ్రాహ్మిణితో పాటు మరో రెండు కంపెనీలకు సుమారు 750 ఎకరాల భూములు కేటాయించారని అన్నారు. జగతి పబ్లికేషన్లో పది రూపాయల ముఖ విలువ గల షేరును ఎలా 350 రూపాయలకు కొన్నారని ప్రశ్నించారు. పేదల భూములను పెట్టుబడి దారులకు దోచిపెట్టి వారి సొంత వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. జగతి పబ్లికేషన్లో షేర్లన్నీ బూటకమని ఆదాయపన్ను శాఖ నిర్ధారించిందని చంద్రబాబు చెప్పారు. జగతిలో పెట్టుబడులు పెట్టిన వారందరికీ ఐటి నోటీసులు పంపించిందన్నారు. జగన్ కంపెనీల్లో నల్లధనం ఉందని చంద్రబాబు ఆరోపించారు. పేదల భూములు కొని సొంత లబ్ధి పొందారని ఆరోపించారు.
టిడిపి పెట్టుబడులకు వ్యతిరేకం కాదన్నారు. అభివృద్ధి జరగాలని అన్నారు. అయితే పేదలకు ఇచ్చిన అసైన్డ్భూములు, పట్టాభూములు అభివృద్ధి పేరుతో ప్రభుత్వం తీసుకోవడాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. డికెటి పట్టాలు రద్దు చేసి పేదల భూములకు పెద్దలకు కట్టబెట్టడాన్ని చంద్రబాబు ప్రశ్నించారు. సెజ్ల పేరుతో రైతులనుండి వేల రూపాయలకు భూములను తీసుకొని వాటిని కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. సెజ్ల పేరుతో భూస్వామ్య వ్యవస్థను ప్రోత్సహిస్తున్నారని అన్నారు. రైతుల పొట్టకొట్టే విధంగా సాగుభూములు స్వాధీనం చేసుకుంటున్నారన్నారు. సెజ్ల పేరుతో అవసరానికన్నా ఎక్కువ మేర భూములు తీసుకొని అధికారికంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయవచ్చునని అనుమతి ఇచ్చారని అన్నారు. బడా సంస్థలకు వేల ఎకరాలు కట్టబెట్టడం సరికాదన్నారు. ప్రభుత్వం గుడ్డిగా కళ్లు మూసుకొని భూములు కేటాయించడానికి బ్రాహ్మిణి ఇన్పోటెక్ ఓ ఉదాహరణ అన్నారు. వైయస్ హయాంలోని అవినీతిపై చాలాసార్లు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకు వచ్చినప్పటికీ ఆయా ప్రభుత్వాలు స్పందించలేదన్నారు. తనపై వైయస్ రాజశేఖరరెడ్డి 22 కమిటీలు వేసి ఏమీ చేయలేక పోయారన్నారు. తనపై అవసరమైతే వంద కమిటీలు వేసుకొని విచారణ జరిపించుకోవచ్చునని అన్నారు. అవినీతిపై తాను యుద్ధం చేస్తున్నందుకే తనపై బురద జల్లుతున్నారని అన్నారు.