మమతపై మోదీ గుర్రు.. సీఎస్ రీకాల్.. బెంగాల్ దంగల్..
posted on May 29, 2021 @ 11:19AM
బెంగాల్ దంగల్ మరింత ముదురుతోంది. ప్రధాని మోదీని అరగంట పాటు వెయిట్ చేయించిన పాపానికి.. ఆ రాష్ట్రానికి పెద్ద శిక్షే విధించింది కేంద్రం. బెంగాల్ చీఫ్ సెక్రటరీ ఆలపన్ బందోపాధ్యాయ ని రీకాల్ చేసింది. ఉన్నట్టుండి ఆయన సీఎస్ పదవి నుంచి వెనక్కి వచ్చేసి.. ఈ నెల 31 న అయన ఢిల్లీలోని నార్త్ బ్లాక్ కార్యాలయం లో గల పర్సనల్ అండ్ ట్రెయినింగ్ విభాగంలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. కేంద్ర ఆదేశాలపై సీఎం మమతా బెనర్జీ భగ్గుమంటోంది.
యాస్ తుఫాను వల్ల కలిగిన నష్టంపై చర్చించేందుకు శుక్రవారం ప్రధాని మోదీ నిర్వహించిన సమీక్షా సమావేశానికి సీఎం మమతా వెళ్లకుండా బెట్టు చేశారు. ప్రధాని అరగంట వరకూ నిరీక్షించినా ఆమె మీటింగ్కు అటెండ్ అవలేదు. దీంతో మోదీ.. మమత కోసం చాలా సేపు వెయిట్ చేశారు. చివరాఖరికి సీఎం మమత.. ప్రధాని చేపట్టిన రివ్యూకి అటెండ్ అయి.. కాసేపు ఉండి.. తుఫాను నష్టంపై నివేదిక అందజేసి.. వెంటనే వెళ్లిపోవడం కలకలంగా మారింది. ప్రధానిని, కేంద్రాన్ని అవమానించే విధంగా జరిగిన ఈ ఘటనపై పీఎంవో వర్గాలు సీరియస్గా స్పందించాయి.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారికంగా జరిగిన సమీక్ష సమావేశానికి ముఖ్యమంత్ర మమతా బెనర్జీ ఆలస్యంగా రావడం, మధ్యలోనే వెళ్లిపోవడాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించింది. అందుకు, ప్రతీకారంగా కేంద్ర పరిధిలో ఉండే ఐఏఎస్ అధికారి అయిన.. బెంగాల్ సీఎస్ బందోపాధ్యాయను వెనక్కి పిలిపించింది. 1987 కేడర్ ఐఏఎస్ అధికారి బందోపాధ్యాయను కేంద్రం.. గతంలో బెంగాల్ రాష్ట్రానికి డిప్యూటేషన్ మీద పంపించింది. ఇటీవలే ఆయన పదవీ కాలాన్ని మరో మూడు నెలలు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 24 న నోటిఫికేషన్ జారీ చేసి ఇందుకు అనుమతి కోసం ఈ ప్రతిపాదనను ప్రధానమంత్రి కార్యాలయానికి పంపింది. తాజాగా.. ఆయనను వెనక్కి పిలిపించి.. సీఎం మమతకు ఝలక్ ఇచ్చింది కేంద్రం.
శుక్రవారం అంతా.. బెంగాల్లో హైడ్రామా నడిచింది. ప్రధాని నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్ లో యాస్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేశారు. కలైకుంద ఎయిర్ బేస్ వద్ద మమతా బెనర్జీ కోసం ప్రధాని మోదీ, రాష్ట్ర గవర్నర్ జగ్దీప్ ధంకర్ దాదాపు 30 నిమిషాల సేపు వేచి చూడాల్సి వచ్చిందని కేంద్ర వర్గాలు వెల్లడించాయి. తుపాను సమీక్ష కోసం ప్రధాని వస్తే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నుంచి ఒక్కరూ రాలేదని ఆరోపించాయి.
దేశ చరిత్రలో ప్రధానితో ఇలా ప్రవర్తించిన సీఎం మరొకరు లేరని.. ముఖ్యమంత్రి అహంకారి అంటూ బీజేపీ శ్రేణులు విమర్శించాయి. అయితే, దీనిపై మమత వాదన మరోలా ఉంది. వాస్తవానికి ప్రధానిని తాము ధిఘా దగ్గర కలుస్తామని సీఎం మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వానికి తెలిపారు. అయితే, ప్రధానిని కలైకుంద ఎయిర్ బేస్ దగ్గర కలవాలని కేంద్ర ప్రభుత్వం మమతకు సూచించింది. దీంతో మమత ఫీల్ అయ్యారని అంటున్నారు. మరో వాదన కూడా ప్రచారంలో ఉంది. మమతకు బద్ధ విరోధిగా మారిన సువేందు అధికారి ప్రధాని పక్కనే ఉండడంతో మమత తీవ్ర అసంతృప్తికి గురయ్యారని తెలుస్తోంది.
ప్రధాని మోదీ మీటింగ్కు మమత ఆలస్యంగా వెళ్లడం.. వెంటనే తిరిగి రావడంపై బెంగాల్ ప్రభుత్వ వర్గాలు వివరణ ఇచ్చాయి. సీఎం మమతా బెనర్జీకి అనేక కార్యక్రమాలు ఉండడంతో ఆమె ప్రధానితో భేటీకి కూడా కొంత సమయం కేటాయించారని, ముందు నిర్ణయించిన షెడ్యూల్ మేరకే అమె వచ్చారని, ఇక ప్రధానిని ఎందుకు వేచిచూసేలా చేస్తారంటూ ప్రశ్నించాయి. కారణమేదైనా.. బెంగాల్ సీఎస్ను రిలీవ్ కావాలంటూ తాజాగా కేంద్రం ఆదేశించడంతో వివాదం మరింత ముదిరినట్టే. మోదీ వర్సెస్ మమతా వార్ ఎక్కడి వరకూ వెళుతుందో...