ప్రగతి భవన్ కు వీహెచ్.. ఏం జరుగుతోంది?
posted on May 29, 2021 @ 11:59AM
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు స్టైలే వేరు. తన వ్యాఖ్యలు, కార్యక్రమాలతో ఎప్పుడూ వార్తల్లో ఉంటారు వీహెచ్. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలపై ఆయన ఘాటు విమర్శలు చేస్తుంటారు. కొవిడ్ కట్టడి విషయంలోనూ ప్రధాని నరేంద్ర మోడీని కడిగి పారేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పైనా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. కరోనా కల్లోల సమయంలోనూ రాజకీ కాక రేపుతున్న వీహెచ్.. సడెన్ గా ప్రగతి భవన్ కు రావడం కలకలం రేపింది. తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా నిలిచింది.
కేసీఆర్ ను టార్గెట్ చేసే హనుమంతరావు ప్రగతి భవన్ కు ఎందుకు వెళ్లారని ఆశ్చర్యపోతున్నారా.. వీహెచ్ ప్రగతి భవన్ కు వెళ్లింది నిజమే.. కాని ఆయన కేసీఆర్ తో ములాఖత్ కోసం వెళ్లలేదు. నిరసన తెలిపేందుకే వెళ్లారు. కొవిడ్ తో చనిపోయిన మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున రెండు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రగతి భవన్ కు వెళ్లారు వీహెచ్. అయితే పోలీసులు అడ్డుకోవడంతో బయటే నిలిచిపోయారు.
కేసీఆర్ను కలుద్దామంటే ఆయన అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని మండిపడ్డారు హనుమంతరావు. తెలంగాణలో కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారికి రెండు లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజల సమస్యలపై కేసీఆర్కు తాము ఎన్ని లేఖలు రాసినప్పటికీ స్పందన రావట్లేదని విమర్శించారు. అయినప్పటికీ తాను సమస్యలపై పోరాడుతూనే ఉంటానని చెప్పారు.