ఆ పదం వాడితే జైలే.. నెటిజన్లకు కేంద్రం వార్నింగ్
posted on May 22, 2021 9:23AM
దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. రోజువారి కేసుల సంఖ్య కొంత తగ్గినా.. మరణాలు మాత్రం ఆందోళన కల్గిస్తున్నాయి. కరోనాపై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతోంది. కొందరు నెటిజన్లు అత్యుత్సాహం చూపిస్తున్నారు. తామే డాక్టర్లలా ఫీలైపోతే... నెటిజన్లకు సలహాలు, సూచనలూ ఇస్తున్నారు. తమకు ఇష్టం వచ్చినట్లుగా పోస్టులు పెడుతున్నారు ఇలాంటి వారికి కేంద్రం తాజాగా చేసిన హెచ్చరిక జారీ చేసింది. అతిక్రమిస్తే సీరియస్ యాక్షన్ ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది.
"ఇండియన్ వేరియంట్" అనే పదంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ పదాన్ని ఉపయోగిస్తూ... సోషల్ మీడియాలో చాలా మంది దేశ పరువు తీస్తున్నారని కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార టెక్నాలజీ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. కరోనా వైరస్లోని డబుల్ మ్యూటెంట్ అయిన B.1.617ను చాలా మంది సోషల్ మీడియాలో... ఇండియన్ వేరియంట్ అని చెబుతున్నారు. ఇది ఇండియన్ వేరియంట్ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఎక్కడా చెప్పలేదు. దీన్ని వేరియబుల్ ఆఫ్ కన్సర్న్ అని మాత్రమే చెప్పింది. అంటే... ఈ వైరస్ వేర్వేరు దేశాల్లో విస్తరిస్తోందని అర్థం. అంతే తప్ప... దీనికీ ఇండియాకీ సంబంధం ఉంది అని WHO చెప్పలేదు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ క్లారిటీ ఇచ్చినా చాలా మంది సోషల్ మీడియాలో. దీన్ని ఇండియన్ వేరియంట్ అని అసత్య ప్రచారం చేస్తున్నారు. దీనిపైనే కేంద్ర సమాచార శాఖ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఎవరైనా ఈ పదాన్ని వాడి ఉంటే వెంటనే తొలగించాల్సిందిగా నోటీస్ జారీ చేసింది. తప్పుడు సమాచారాన్ని అరికట్టేందుకే తామూ ఈ చర్య తీసుకుంటున్నట్లు తెలిపింది. ఇండియాలో పుట్టిన B.1.617... ప్రపంచ దేశాలకు పాకుతోందని అసత్య ప్రచారం చేస్తున్నారనీ... ఇలాంటి వాటిని సహించే ప్రసక్తే లేదని కేంద్ర సమాచార శాఖ తెలిపింది. WHO అలా చెప్పనప్పుడు... సోషల్ మీడియాలో నెటిజన్లు అలా ఎందుకు తప్పుడు సమాచారం చేరవేస్తున్నారని కేంద్రం ప్రశ్నిస్తోంది. దీనిపై మే 12నే స్పష్టత ఇచ్చామనీ... ఇందుకు సంబంధించిన ప్రెస్ రిలీజ్ని ఈ లింక్ ద్వారా చూడవచ్చని కేంద్రం లింక్ ఇచ్చింది.
కేంద్రం హెచ్చరికతో నెటిజన్లు ఇప్పుడే ఇండియన్ వేరియంట్ అనే పదాన్ని వెతికి... దాన్ని అర్జెంటుగా తొలగించాల్సి ఉంది. ఎప్పుడు రాశామో, ఎక్కడ రాశామో గుర్తు లేదు అంటే కుదరదు. కేంద్రం గనక అలాంటి పదాన్ని ఎవరైనా రాసినట్లు గుర్తిస్తే... వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది. కేసు నమోదు చేస్తుంది. ఇది దేశ ప్రతిష్టకు సంబంధించిన అంశం కాబట్టి... చర్యలు కఠినంగానే ఉంటాయి.