భయపెడుతున్న ఒమిక్రాన్.. రాత్రి కర్ఫ్యూపై రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్
posted on Dec 11, 2021 @ 7:36PM
కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దేశంలో వేగంగా విస్తరిస్తోంది. శనివారం సాయంత్రానికి దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 39కి చేరింది. మహారాష్ట్రలోనే ఇప్పటివరకు 17 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా.. రాజస్థాన్ లో తొమ్మిది కేసులు నమోదయ్యాయి. గుజరాత్, కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాల్లోనూ ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కట్టడిలోనే ఉన్నప్పటికీ.. కొత్తగా పుట్టుకొచ్చిన ‘ఒమిక్రాన్’ వేరియంట్ చాప కింద నీరులా విస్తరిస్తుండటం ఆందోళనకు గురిచేస్తోంది.
కొత్త వేరియంట్ కేసులు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కొవిడ్ నిబంధనలపై నిర్లక్ష్యంగా ఉండొద్దని, వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న జిల్లాలపై మరింత దృష్టిపెట్టాలని ఆదేశించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల సీఎస్లకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ లేఖ రాశారు. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 27 జిల్లాల్లో గత రెండు వారాలుగా పాజిటివిటీ రేటు పెరుగుతోందని, వాటిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కేంద్రం లేఖలో పేర్కొంది. కేరళ, మిజోరం, సిక్కిం రాష్ట్రాల్లోని 8 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 10శాతం కంటే ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. మిగతా 7 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 19 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5 నుంచి 10శాతంగా నమోదైనట్లు పేర్కొంది.
‘‘ఏ జిల్లాలోనైనా కేసులు, పాజిటివిటీ రేటు పెరిగినట్లు కన్పిస్తే.. వెంటనే అక్కడి స్థానిక యంత్రాంగం వ్యూహాత్మక చర్యలు ప్రారంభించాలి. ఆ ప్రాంతాల్లో పరీక్షలు, వ్యాక్సినేషన్ పెంచాలి. కంటైన్మెంట్ జోన్లుగా పరిగణించి.. అవసరమైతే రాత్రి కర్ఫ్యూ విధించాలి. జనసమూహాలు, పెళ్లిళ్లు, అంత్యక్రియల్లో పాల్గొనేవారిపై పరిమితులు విధించాలి’’ అని రాజేశ్ భూషణ్ ఆ లేఖలో పేర్కొన్నారు.