ఐక్యతా భావాన్ని పెంచే వినాయకచవితి
posted on Aug 28, 2025 6:26AM
విజయవాడలోని సీతార సెంటర్లో డూండీ గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 72 అడుగుల మహాగణపతిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకముందు మండపం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రికి కమిటీ సభ్యులు, నేతలు స్వాగతం పలికారు.
గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మాట్లాడిన చంద్రబాబు..విఘ్ననాయకుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనీ, ఏపీ అభివృద్ధికి ఆటంకం రాకూడదని ప్రార్థించానని చెప్పారు. వినాయకచవితిని అందరిలో ఐక్యాతా భావాన్ని పెంచే పండుగగా అభివర్ణించిన ఆయన గణేశ్ మండపాలకు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నామన్నారు.
గణేష్ చతుర్థతి అంటే తనకు నాకు చాలా ఇష్టమని, చిన్నతనం నుంచి ఈ పండుగను బాగా చేసుకునే వాళ్లమని గుర్తు చేసుకున్నారు. గత ప్రభుత్వంలో గణేశ్ ఉత్సవాలు చేసుకోవాలంటే అన్నీ విఘ్నాలే. పండుగ చేసుకోవాలన్నా, మైక్ పెట్టాలన్నా సవాలక్ష ఆంక్షలు పెట్టారు. ప్రతి దానికీ అనుమతులు తీసుకోవాలని ఇబ్బందులు పెట్టారు. కానీ మన ప్రజా ప్రభుత్వంలో అలాంటి ఇబ్బందులు లేకుండా గణేశ్ మండపాలను ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. దీనివల్ల ప్రభుత్వంపై రూ.30 కోట్ల భారం పడుతుంది. అయినప్పటికీ భక్తుల సౌలభ్యం కోసం ఉచిత విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు.
సూపర్ సిక్స్ను సూపర్ హిట్ చేసి వాడవాడలా బ్రహ్మాండంగా గణేశ్ ఉత్సవాలు జరుపుకుంటున్నామన్నారు. 72 అడుగుల అతిపెద్ద మట్టి గణపతిని ఏర్పాటు చేసిన డూండీ సేవా సమితి సభ్యులను మనస్పూర్తిగా అభినందిస్తున్నాననీ, విగ్రహం ఏర్పాటు చేసిన చోటే నిమజ్జన ఏర్పాట్లు చేయడం చాలామంచి కార్యక్రమమనీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.