జడ్జీలపై అనుచిత వ్యాఖ్యల కేసు.. హైకోర్టుకు సీబీఐ సీల్డ్ కవర్ రిపోర్టు.. పంచ్ పడినట్టేనా!
posted on Nov 23, 2021 @ 10:20AM
ఆంధ్రప్రదేశ్ తీవ్ర దుమారం రేపిన న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యల కేసులో సీబీఐ కీలక పురోగతి సాధించింది. కేసు వివరాలతో కూడిన నివేదికను సీబీఐ డైరెక్టర్ హైకోర్టుకు సమర్పించారు. న్యాయవ్యవస్థ, హైకోర్టు న్యాయమూర్తుల ప్రతిష్ఠను దిగజార్చుతూ అనుచిత పోస్టులు పెట్టిన కేసులో దర్యాప్తు వివరాలను అందులో పొందు పరిచి సీల్డ్ కవర్ లో అందించారు. ఆ నివేదికను పిటిషనర్కు (రిజిస్ట్రార్ జనరల్) అందజేయాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబరు 13వ తేదీకి వాయిదావేసింది.
ఈ కేసు విచారణ ప్రారంభమైన దగ్గర నుంచి ఏమి చేశారో తెలియజేస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని సీబీఐ డైరెక్టర్ను ఆదేశించింది. ఈ వ్యాజ్యాలు మరోసారి విచారణకు రాగా.. ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ తరఫున న్యాయవాది ఎన్.అశ్వనీకుమార్ వాదనలు వినిపిస్తూ... ‘‘న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులకు సంబంధించిన వీడియోల యూఆర్ఎల్ వివరాలను సామాజిక మాధ్యమాల గ్రీవెన్స్ అధికారులకు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ అందజేస్తున్నారు. రిజిస్ట్రార్ జనరల్ ఇచ్చిన యూఆర్ఎల్ వివరాల ఆధారంగా సామాజిక మాధ్యమాలు ఎప్పటికప్పుడు వీడియోలను తొలగిస్తున్నాయి. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా కేసు దర్యాప్తు పురోగతిపై సీబీఐ డైరెక్టర్ అఫిడవిట్ దాఖలు చేశారు. సీల్డ్ కవర్లో ఉన్న ఆ రిపోర్టును పరిశీలించకుండా వాదనలు కొనసాగించడం సాధ్యం కాదు.’ అని అన్నారు.
సీబీఐ తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు స్పందిస్తూ.. కేసుపై దర్యాప్తు కొనసాగుతుందన్నారు. ఈ దశలో వివరాలను నిందితులకు అందజేస్తే దర్యాప్తుపై ప్రభావం పడుతుందని, కోర్టు ఆదేశిస్తే వివరాలను పిటిషనర్కు అందజేస్తామన్నారు. సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, వాట్సప్ తరఫున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ.. వీడియోలను తొలగించాలని సీబీఐ నేరుగా సామాజిక మాధ్యమాలను కోరలేదన్నారు.
రిజిస్ట్రార్ జనరల్ ద్వారా వివరాలు అందజేస్తే వీడియోలు తొలగించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. న్యాయవ్యవస్థను దూషిస్తూ పెట్టిన పోస్టులకు సంబంధించిన యూఆర్ఎల్ను అందజేస్తే సంబంధిత వీడియోను తొలగిస్తామని చెప్పారు. అయితే, సంబంధిత వ్యక్తి ప్రొఫైల్ను పూర్తిగా రద్దు చేయడం సాధ్యం కాదన్నారు.