ఏటి సేస్తాం!

పీసీసీ అధ్యక్షుడు సత్తిబాబు ప్రస్తుతం పీకల్లోతు వైరాగ్యంలో మునిగితేలుతున్నారు. పదవి ఉంటుందో, ఊడుతుందో తెలీని పరిస్థితిలో తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కుంటున్నారు. ఈ విషయమై ఎవరు కదిలించినా చిర్రుబుర్రులాడుతున్నారు.
చివరికి ఏమౌతుందోనన్న ఉత్కంఠను స్వయంగా బొత్సకూడా భరించలేకపోతున్నారు. తనకీ దుస్థితి కలగడానికి పూర్తిగా ముఖ్యమంత్రే కారణమంటూ కనిపించినవాళ్లదగ్గరల్లా బొత్స బాధను వెళ్లబోసుకుంటున్నారన్న వార్తలు హస్తిన వీధుల్లో చక్కర్లు కొడుతున్నాయి. అసలు తనకు పీసీసీ అధ్యక్షపీఠం దక్కుతుందని కలలో కూడా ఎప్పుడూ ఊహించలేదని, కాబట్టి ఇప్పుడది ఉన్నా, ఊడినా పెద్ద తేడాయేం లేదని బొత్స అందరితో చెప్పుకుంటున్నట్టు సమాచారం. రేపు పదవిపోతే తలెత్తుకుని ఎలా
తిరగాలా అని తెగ ఆలోచించి బొత్స ఈ ట్రెండ్ ని ఫాలో అవుతున్నారని కొందరు సీనియర్లు గుసగుసలాడుకుంటున్నారు. సత్తిబాబుకి
ఎలా అయినా కాస్త ముందు చూపు ఎక్కువే మరి.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.