బాబు పాదయాత్ర పై బొత్స సెటైర్

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పాదయాత్ర మీ కోసం కంటే 'నాకోసం' అనే పేరు పెట్టుకుంటే బాగుండేదని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. పదవిలో ఉన్నప్పుడు ఓ మాట, పదవి పోయిన తర్వాత మరోపాట మాట్లాడటం బాబుకు అలవాటేనని ఆయన అన్నారు. ప్రభుత్వంపై బాబు చేస్తున్నవి ఆరోపణలు మాత్రమేనని...సంక్షేమ పథకాల అమలులో బాబుతో చర్చకు సిద్ధమేనని బొత్స సవాల్ విసిరారు. రాజకీయ లబ్ధి కోసం బాబు యాత్రను చేపట్టారని, అలాంటి యాత్రను అడ్డుకోవాల్సిన అవసరం కాంగ్రెస్కు లేదన్నారు. రాష్ట్ర విభజనపై హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని బొత్స స్పష్టం చేశారు. తెలంగాణ ప్రాంత నేతలు ముఖ్యమంత్రిపై చేసిన విమర్శలను ఆయన ఈ సందర్భంగా ఖండించారు. సీఎంపై తెలంగాణ మంత్రులు అసంతృప్తిగా లేరని, తెలంగాణ అంశంపైనే ఆవేదన చెందుతున్నారని బొత్స అన్నారు.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.