నాంపల్లికోర్టుకు బాంబు బెదిరింపు
posted on May 28, 2024 @ 6:00PM
హైదరాబాద్ లో ఒకే రోజు రెండు ఫేక్ కాల్స్ వచ్చాయి. ఉపముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క నివాసముండే ప్రజా భవన్ కు ఉదయం ఉత్తుత్తి బాంబు బెదిరింపు వస్తే సాయంత్రం నాంపల్లిక్రిమినల్ కోర్టుకు ఇదే తరహా కాల్ వచ్చింది. తెలంగాణలో వరుస బాంబు బెదిరింపు ఫోన్ కాల్స్ కలకలం సృష్టిస్తున్నాయి. ఇవాళ ఒకే రోజు ప్రజాభవన్, నాంపల్లి కోర్టుకు ఇలా బాంబ్ బెదిరింపు ఫోన్ కాల్స్ రావడం గమనార్హం. మొదట ప్రజాభవన్లో బాంబ్ పెట్టామంటూ గుర్తు తెలియని వ్యక్తి మంగళవారం ఉదయం పోలీస్ కంట్రోల్ రూమ్కు ఫోన్ చేశాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు బాంబ్ స్క్వాడ్ సాయంతో విస్తృతంగా సోదాలు నిర్వహించారు. కానీ, ఎలాంటి బాంబ్ లేకపోవడంతో అందరూ ఊపీరి పీల్చుకున్నారు. దాంతో ఈ ఫేక్ కాల్ చేసిన వ్యక్తి కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై ఒకవైపు విచారణ జరుగుతుండగానే తాజాగా నాంపల్లిలోని కోర్టుకు బాంబ్ బెదిరింపు కాల్ రావడం కలకలం రేపింది. నాంపల్లి కోర్టులో బాంబు పెట్టామని, మరి కాసేపట్లో కూల్చేస్తామని ఆగంతకుడు పోలీసులకు ఫోన్ చేశాడు. దీంతో వెంటనే అలర్ట్ అయిన పోలీసులు హైకోర్టులో బాంబ్ స్క్వాడ్ బృందాలతో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. కానీ, ఎలాంటి బాంబ్ ఆనవాళ్లు లభ్యం కాకపోవడంతో ఫేక్ కాల్గా పోలీసులు నిర్ధారించుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.