‘యూ ఇడియట్’.. కేటీఆర్ పై బీజేపీ నేత ఫైర్
posted on Jun 8, 2021 9:15AM
కొవిడ్ వ్యాక్సినేషన్ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య యుద్దమే సాగింది. కేంద్ర వ్యాక్సిన్ పాలసీపై కాంగ్రెస్ తో పాటు పలు ప్రాంతీయ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కూడా కేంద్రం వైఫల్యం వల్లే దేశంలో టీకాల కొరత ఏర్పడిందని ఆరోపించారు. కొవిడ్ విషయంలో మంత్రి కేటీఆర్ పదేపదే కేంద్రాన్ని టార్గెట్ చేశారు. ఈ నేపథ్యంలో ఓ బీజేపీ జాతీయ నేత ఆయనపై ఫైరయ్యారు. సహనం కోల్పోయి మంత్రి కేటీఆర్ ను దూషించారు. ట్విట్టర్ వేదికగా జరిగిన ఈ ఘటన వైరల్ గా మారింది.
మంత్రి కేటీఆర్ ఆదివారం సాయంత్రం ట్విట్టర్లో ‘లెట్స్ టాక్ వ్యాక్సినేషన్’ హ్యాష్టాగ్తో చిట్చాట్ నిర్వహించారు. కొవిడ్ కట్టడి, వ్యాక్సినేషన్ పాలసీపై నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా వ్యాక్సిన్ల విషయంలో కేంద్ర విధానాలను కేటీఆర్ తప్పుబట్టారు. భారత్ వ్యాక్సిన్ల హబ్గా ఉన్నప్పుడు డిమాండుకు, సరఫరాకు మధ్య ఇంత వ్యత్యాసం ఎందుకని ప్రశ్నించారు. మిగతా దేశాలన్నీ గతేడాది మొదట్లోనే టీకాలకు ఆర్డర్లు ఇచ్చాయని, కేంద్రం మాత్రం ఇప్పుడు కళ్లు తెరిచిందని విమర్శించారు.
కేటీఆర్ విమర్శలపై బీజేపీ అధికార ప్రతినిధి ఖేమ్ చంద్ర శర్మ కొవిడ్ విషయంలో కేటీఆర్ అసత్య ప్రచారం చేస్తున్నారంటూ ఫైరయ్యారు. సహనం కోల్పోయి మంత్రిని యూ ఇడియట్’ అంటూ విరుచుకుపడ్డారు. టీకాల విషయంలో అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీకాల విషయంలో మనమే ముందున్నామని, ఇప్పటి వరకు 17.5 కోట్ల మందికి తొలి డోసు ఇచ్చామని పేర్కొన్నారు. మొత్తంగా 22.37 కోట్ల మందికి టీకాలు ఇచ్చినట్టు గుర్తు చేశారు.
బీజేపీ నేత ఖేమ్ చంద్ వ్యాఖ్యలపై కేటీఆర్ సౌమ్యంగా స్పందించారు. తాను కూడా మీలాగే మాట్లాడగలను కానీ, అది తమ సంస్కృతి కాదని బదులిచ్చారు. ఇజ్రాయెల్లో 60 శాతం మందికి, అమెరికాలో 40 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తయిందని చెప్పారు. దీనిని బట్టి మనం ఎక్కడున్నామో అర్థం చేసుకోవచ్చని కౌంటర్ ఇచ్చారు. వాస్తవాలను జీర్ణించుకోలేని మీలాంటి వారికి ఇలాంటి విషయాలు కఠినంగానే ఉంటాయని చెప్పారు కేటీఆర్.