వరుణ్గాంధీ వరుస ట్వీట్లు.. మేనకాగాంధీపై బీజేపీ వేటు..
posted on Oct 7, 2021 @ 3:00PM
ఒకప్పటి సైద్ధాంతిక పరమైన బీజేపీ ఎప్పుడో చచ్చిపోయిందంటారు. ఇప్పుడంతా మోదీ-అమిత్షాల బీజేపీనే అంటుంటారు. కార్పొరేట్ స్టైల్లో పార్టీని నడిపిస్తున్నారు ఆ ఇద్దరు. పార్టీ కమిటీలన్నిటినీ తమ అనుచరులతో నింపేశారనే ఆరోపణ ఉంది. అధికారాన్ని ఎరగా చూపించి, సీఏఏ, రామమందిరం, ఆర్టికల్ 370 రద్దు తదితర చర్యలతో సంఘ్ పరివార్ను సంతృప్తి పరుస్తూ బీజేపీని తమ గుప్పిట్లో పెట్టుకున్నారు నరేంద్ర మోదీ. అందుకే, ఆయన ఆడిందే ఆట.. పాడిందే పాట. పెద్ద నోట్ల రద్దు, రఫెల్ మరకలు, కరోనా కట్టడిలో వైఫల్యాలు తదితర ఎన్ని అపవాదులు మూటగట్టుకున్నా.. ఇప్పటికీ మోదీనే సుప్రీం లీడర్గా చెలామని అవుతున్నారు. క్రమక్రమంగా నియంత పోకడలు పోతున్నారు. తప్పైనా.. ఒప్పైనా.. పార్టీకి వ్యతిరేకంగా నోరు విప్పితే.. ఎంతటి నేతపైనైనా వేటు వేసేందుకు ఏమాత్రం వెనకాడటం లేదు. అద్వానీ, జోషిల కథ ఇప్పటికే కాశీకి చేరగా.. తాజాగా, పార్టీలో సీనియర్ మోస్ట్ లీడర్ మేనకాగాంధీపై చర్యలు షురూ అయ్యాయి. ఇంతకీ ఆమె చేసిన తప్పేమీ లేదు.. మేనక తనయుడు వరుణ్గాంధీ చేస్తున్న వరుస ట్వీట్లే మేనకాగాంధీపై వేటుకు కారణమైంది.
కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీని భారతీయ జనతా పార్టీ కేంద్ర కమిటీ నుంచి తొలగించారు. ఆమె కుమారుడు, ఎంపీ వరుణ్ గాంధీ రైతు ఆందోళనపై ట్వీట్లు చేయడంతో మేనకాపై వేటు వేశారు. ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్లో ఆదివారం జరిగిన ఘటనలో నలుగురు రైతులు సహా ఎనిమిది మంది చనిపోయారు. ఆ ఘటనలో రైతులకు మద్దతుగా వరుణ్ గాంధీ వరుస ట్వీట్లు చేస్తుండటం కలకలం రేపుతోంది.
‘‘తన మనసును కలచివేసింది’’ అంటూ మొదట వరుణ్ ట్వీట్ చేశారు. ఆ తర్వాత ప్రమాదానికి సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ.. ‘‘వీడియోలో చాలా క్లియర్గా కనిపిస్తోంది. రైతులు రక్తం ధారపోశారు. ఆ రక్తానికి బాధ్యత ఎవరిది? రైతులు తీవ్ర ఆగ్రహానికి లోను కాకముందే న్యాయం లభించాలి’’ అని ట్వీట్ చేశారు.
గతంలో కూడా రైతు ఆందోళనపై వరుణ్ ఇలానే ట్వీట్ చేశారు. రైతులకు కనీస మద్దతు ధరతో పాటు వారికి కల్పించాల్సిన వసతులపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు లేఖ రాశారు. కొంత కాలంగా వరుణ్ గాంధీ వ్యవహారశైలిపై ఆగ్రహంగా ఉన్న బీజేపీ అధిష్టానం.. తాజాగా ఆయనపై కాకుండా వరుణ్గాంధీ తల్లి మేనకాగాంధీని బీజేపీ కేంద్ర కమిటీ నుంచి తొలగించి ప్రతీకార చర్యలకు పాల్పడిందని అంటున్నారు. మరి, బీజేపీలో ఉన్న ఈ గాంధీ కుటుంబం.. నెక్ట్స్ స్టెప్ ఎలా ఉంటుందో చూడాలి...