రాజధాని రైతులకు న్యాయం జరిగేనా?
posted on Dec 26, 2019 @ 10:30AM
రాజధాని పై తమకు న్యాయం జరగాలంటూ ధర్నాకి దిగిన రైతులలో కలవరం రేకెత్తుతోంది. రాజధాని మార్పుపై జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చించి నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్రమంత్రి వర్గం రేపు సమావేశమవుతుంది. క్యాబినెట్ సమావేశం నిర్ణయాన్ని ప్రభావితం చేసే విధంగా ఆందోళనను మరింత ఉధృతం చేసేందుకు రాజధాని రైతులు సమాయత్తమవుతున్నారు. ఇందుకోసం గురువారం నాడు పెద్ద ఎత్తున ఆందోళన చేసేందుకు ప్రణాళిక రూపొందించుకున్నారు. వామపక్ష నాయకులు కూడా గురువారం రాజధాని ప్రాంతంలో పర్యటించనున్నారు. కేబినెట్ భేటీ దృష్ట్యా ఆందోళనకారులను కట్టడి చేసేందుకు పోలీస్ యంత్రాంగం సర్వసన్నద్ధమవుతోంది. ఇందు కోసం గ్రామగ్రామాన పోలీసులు మోహరిస్తున్నారు. మరోవైపు తమ ఆందోళనను ఆవేదననూ రాష్ట్ర గవర్నర్ దృష్టికి తీసుకెళ్లేందుకు రైతులు సమయం కోరారు. రైతుల మొరను వినేందుకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ సమయాన్ని కేటాయించారు. రాజ్ భవన్ లో ఉదయం వారిని కలుసుకునేందుకు అపాయింట్ మెంట్ ఇచ్చారు. రాజధానిని మూడు ముక్కలు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ యోచనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా రాజధాని రైతుల గోడును తెలుపుకునేందుకు అవకాశం ఇవ్వాలని అభ్యర్థిస్తూ అమరావతి రాజధాని రైతు సమీకరణ సమాఖ్య కన్వీనర్ మాదల రాజేంద్ర తదితరులు చేసిన వినతిని గవర్నర్ మన్నించారు.
దీంతో ఏ ఏ కారణాల రీత్యా నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటునామో ఆయనకు వివరించేందుకు సమాఖ్య సమాయత్తమవుతుంది. రాజధాని లోని 29 గ్రామాల నుంచి అన్ని వర్గాలకు చెందిన ఒకరిద్దరు రైతులతో కూడిన బృందంగా గవర్నర్ ను కలవాలని నిర్ణయించింది. రాజధాని నగరంగా అమరావతిని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కొనసాగిస్తుందా లేక ఇప్పటికే ప్రకటించిన మూడు ముక్కల రాజధానికే ఓటేస్తుందా అనే విషయాన్ని తేల్చే రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం శుక్రవారం జరగనుంది.దీంతో తమ ఆందోళన కార్యక్రమాల్లో మరింత ముమ్మరం చేసేందుకు రాజధాని రైతులు సన్నద్ధమవుతున్నారు. సంయుక్త కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ లో జరిగే ధర్నాలో రాజధాని రైతులు పెద్ద ఎత్తున పాల్గొనబోతున్నట్లు సమాచారం.ఒక పక్క రైతుల ఆందోళన,మరో పక్క పోలీసుల ఆంక్షలతో రాష్ట్రం మొత్తంఏం జరగబోతోందా అన్న టెన్షన్ వాతావరణం నెలకొన్నది.