ఐదు రోజులు ఇంజక్షన్ ఇస్తే కరోనా ఖతం..
posted on May 20, 2021 @ 11:07AM
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి కట్టడిలో మరో కీలక ముందడుగు పడింది. కరోనా వ్యాక్సిన్ కోసం జరుగుతున్న పరిశోధనల్లో గొప్ప పరిణామం చోటు చేసుకుంది. కేవలం ఒకే ఒక్క ఔషధంతో కరోనాను ఖతం చేసేందుకు ఆస్ట్రేలియా-అమెరికా శాస్త్రవేత్తల బృందం జరిపిన పరిశోధనల్లో సానుకూల ఫలితాలు వచ్చాయి. గ్రిఫిత్ యూనివర్సిటీకి చెందిన మెంజీస్ హెల్త్ ఇనిస్టిట్యూట్ నేతృత్వంలో అభివృద్ధి చేసిన ఔషధాన్ని ఎలుకలపై ప్రయోగించగా సానుకూల ఫలితాలు వచ్చినట్టు పరిశోధకులు తెలిపారు.
శరీరంలోకి ప్రవేశించిన వైరస్ తన సంతతిని వృద్ధి చేసుకోకుండా ఈ ఔషధం నిలువరిస్తున్నట్టు తేలింది. ఎలుకల్లో వైరస్ కణాలు 99.9శాతం మేర క్షీణించినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎలుకల్లో వచ్చిన ఫలితాలే మనుషుల్లోనూ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. కరోనా బాధితులకు ఐదు రోజులపాటు ప్రతి రోజూ దీనిని ఇంజక్షన్ రూపంలో ఇవ్వడం ద్వారా కరోనాకు అడ్డుకోవచ్చని ఆస్ట్రేలియా-అమెరికా శాస్త్రవేత్తల బృందం తెలిపింది. అయితే మనుషులపై ప్రయోగ పరీక్షలు పూర్తి కావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉందని వెల్లడించింది.
ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే అవన్ని కరోనా వైరస్ నిలువరించేలా శరీరంలో ఇమ్యూనిటీ పెంచేందుకు దోహదపడేవే ఎక్కువగా ఉన్నాయి. కరోనా వచ్చిన రోగుల కోసం ఇచ్చే వ్యాక్సిన్లు లేవు. తాజాగా ఆస్ట్రేలియా-అమెరికా శాస్త్రవేత్తల బృందం పరిశోధనలతో వైరస్ మందుకు ఊరట లభించిందని చెబుతున్నారు.