Read more!

ఏపీ సర్కార్ కు ఎస్సీలే టార్గెట్.. ఎన్హెచ్చార్సీ ముందుకు దళిత నేత

ఆంధ్రప్రదేశ్ లో దళితులపై దమనకాండ జరుగుతోంది. దళితులను దారుణంగా చంపేస్తున్నారు. రక్షణ కల్పించాలి అంటూ అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య కేంద్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ)కి  లేఖ రాశారు.  ఈ లేఖను  ఆయన  ఈమెయిల్  ఎన్హెచ్ఆర్సీకి పంపారు. ఆ  లేఖ వివరాలనుమంగళవారం (మార్చి 28)  మీడియాకు వెల్లడించారు.

 45 నెలల వైకాపా పాలనలో తొలి బాధితులు దళితులే.  మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ ను, మాస్క్ పెట్టుకోనందుకు చీరాల కిరణ్ కుమార్ ను చంపేశారు.  ఎమ్మెల్సీ అనంతబాబు    డ్రైవర్ సుబ్రహ్మణ్యంను దారుణంగా చంపేసి శవాన్ని ఇంటికి డోర్ డెలివరీ చేశారు. దళితుడిని అత్యంత కిరాతకంగా హత్య చేసి మృతదేహాన్ని ఇంటికి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ పై విడుదలైన సందర్భంగా  గజమాలలతో సత్కరించారు. భారీ ర్యాలీ నిర్వహించి సంబరాలు జరుపుకున్నారు.  

అలాగే కృష్ణాయపాలెంలో ఎస్సీలపై ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టి దళిత రైతులను 24 రోజులు జైల్లో పెట్టారు.  బేడీలు వేసి బస్సులో తిప్పారు. కడప పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ గా పని చేస్తున్న డాక్టర్ అచ్చెన్న ను హత్య చేశారు. ఆయన కుమారుడు చక్రవర్తి అనుమానితుల పేర్లు  ముందుగానే ఇచ్చినా పోలీసులు విచారించలేదు.  తాటికొండ దళిత మహిళా ఎమ్మెల్యే ఉండవల్లి  శ్రీదేవి తన నియోజకవర్గానికి వెళ్లేందుకు భయంగా ఉందని, తనకు ప్రాణభయం ఉందనీ, సాక్షాత్తూ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి నుంచే ప్రాణభయం ఉందనీ సొంత ఊరు వదిలేసి హైదరాబాద్ లో తలదాచుకుంటున్నారు.  

కాకినాడలో గిరీష్ బాబు అనే దళిత యువకుడు కాళ్లలో రాడ్లు ఉన్నాయని చెప్పినా, ఎస్సై కనికరించలేదన్నారు. రాడ్లు చూపమని లాఠీకి రబ్బరు తగిలించి కొట్టారు. ఇసుక ట్రాక్టర్ ను అడ్డుకున్నాడని ఇందుగుమిల్లి వరప్రసాద్ కు శిరోముండనం చేశారు. పులివెందుల నాగమ్మ, నంద్యాల మహాలక్ష్మిలపై అత్యాచారాలు జరిగాయి. పేరేచర్లలో  మహిళపై జరిగిన అత్యాచారం కేసులో  80 మందిని అనుమానితులుగా  పోలీసులు  ఎఫ్ఐఆర్  నమోదు చేశారు. తప్పులను ప్రశ్నిస్తే దాడి చేస్తున్నారు. అన్యాయం పై తిరగబడితే హత్య చేస్తున్నారు.

అణచి వేతలపై  గొంతు ఎత్తితే  దౌర్జన్యం చేస్తున్నారు. దళితులపై దాడులు జరగని జిల్లా కానీ, నియోజకవర్గం కానీ,  గ్రామం కానీ ఏపీలో లేదు.  తెలుగు నేల చరిత్రలో గతంలో ఎన్నడూ కనీ వినీ ఎరుగని రీతిలో దళితులపై దమనకాండ జరుగుతోంది. గతంలో ఢిల్లీలో  హెచ్ఆర్సీని స్వయంగా కలిసి లిఖిత పూర్వక ఫిర్యాదు ఇచ్చామన్నారు. హెచ్చార్సీ,  ఏపీ సిఎస్ కు లేఖ పంపి నెలలు గడిచినా ఇప్పటివరకు  తనకు సమాచారం కూడా ఇవ్వలేదు.   ఈ మొత్తం సంఘటనలపై కేంద్రంలోని హెచ్ఆర్సీ ఆధ్వర్యంలో పూర్తి విచారణ జరిపించాలని బాలకోటయ్య లేఖలో డిమాండ్ చేశారు.