ఎపీపీఎస్సీలో అంతా గందరగోళం

 

ఏపీలో చదువుకున్న కుర్రాళ్లకు గవర్నమెంట్ కొలువులు భారీగా ఇస్తామంటూ ప్రభుత్వం ఊదరగొట్టింది. లక్షల్లో ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ అవుతున్నాయంటూ ప్రచారం జోరుగా సాగింది. ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లమీద నోటిఫికేషన్లు జారీ చేస్తూ యమా స్పీడ్ తో పరీక్షలు నిర్వహించింది. తర్వాత ఉన్నట్టుండి ఏపీపీఎస్సీ స్పీడ్ జీరోకి పడిపోయింది. కారణం.. పరీక్షల నిర్వహణలో దొర్లిన పొరపాట్లే.. బోర్డ్ తాను చేసిన తప్పుల తడకల్ని సరిదిద్దుకుని మళ్లీ లేచ్చి గట్టిగా నిలబడే ప్రయత్నంలో ఉన్నట్టు గట్టి సమాచారం. పరీక్షల్లో జరిగిన అవకతవకలపై అభ్యర్ధులు ట్రిబ్యునల్ ని ఆశ్రయిస్తుండడంతో బోర్డ్ మెంబర్ల పరిస్థితి దారుణంగా తయారయ్యింది. నిర్వహించిన పరీక్షలన్నింటికీ బోర్డ్ మెంబర్లు ట్రిబ్యునల్ ముందు చేతులుకట్టుకుని నిలబడక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఏపీపీఎస్సీ బోర్డ్ నిర్వహిస్తున్న ఇంటర్వూల్లో పూర్తి స్థాయిలో అవినీతి రాజ్యమేలుతోందని విస్తృతస్థాయిలో ప్రచారం జరుగడంతో ప్రభుత్వం ఇంటర్వూలను పూర్తిగా రద్దుచేసింది. ఈ పరిణామం బోర్డ్ మెంబర్లకు పూర్తిగా తలవంపులు తెచ్చినట్టే.. చైర్ పర్సన్ రేచల్ చటర్జీ పదవీకాలం డిసెంబర్ తో పూర్తవుతుంది. కార్యదర్శి పూనం మాలకొండయ్ సెలవులో వెళ్లడంతో ప్రస్తుతం ఏపీపీఎస్సీ పరిస్థితి గాల్లో దీపంలో కనిపిస్తోందని అభ్యర్ధులు అంటున్నారు.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.