మా విధుల్లో ప్రభుత్వ జోక్యాన్ని ఆపండి.. హైకోర్టులో నిమ్మగడ్డ పిటిషన్
posted on Sep 3, 2020 @ 10:29AM
కొద్ది రోజుల క్రితం రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా నిమ్మగడ్డ తిరిగి బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం విధుల్లో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటోందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్కుమార్ ఆరోపించారు. అంతేకాకుండా తమ స్వతంత్రతను అణచివేసేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఇదే సమయంలో తమ సిబ్బందిపై సీఐడీ ఫైల్ చేసిన కేసును కూడా రాజ్యాంగ విరుద్ధం గా ప్రకటించాలని, అంతేకాకుండా ఈ మొత్తం వ్యవహారం పై సీబీఐతో దర్యాప్తునకు ఆదేశించాలని పిటిషన్ దాఖలు చేశారు. ఎస్ఈసీ సహాయ కార్యదర్శి సాంబమూర్తి ఉపయోగించిన కంప్యూటర్ను, అందులోని డేటాను సీఐడీ అధికారులు తీసుకెళ్లారని.. వారు స్వాధీనం చేసుకున్న వస్తువులన్నిటినీ తమకు తిరిగి అప్పగించేలా ఆదేశాలివ్వాలని ఆ పిటిషన్ లో నిమ్మగడ్డ కోరారు. గతంలో తాను కేంద్రానికి రాసిన ఒక లేఖ వ్యవహారానికి సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు వచ్చిన సీఐడీ అధికారులు.. ఆ విషయాన్ని పూర్తిగా పక్కనబెట్టి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు మాత్రమే ఆసక్తి చూపారన్నారు.
అప్పటికే పని చేయని ఒక కంప్యూటర్ను ఫార్మాట్ చేసినందుకు తన సహాయ కార్యదర్శి సాంబమూర్తిని సీఐడీ అధికారులు వేధించడమే గాక.. సాక్ష్యాలను ధ్వంసం చేశారంటూ ఆయనపై తప్పుడు కేసు పెట్టారని అయన తెలిపారు. కేవలం ఎన్నికల కమిషన్ను, ఉద్యోగులను వేధించేందుకే ప్రభుత్వం ఆ కేసు పెట్టిందన్నారు. హోం శాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, సీఐడీ అదనపు డీజీ, కేంద్ర హోం శాఖ కార్యదర్సులను ఈ పిటిషన్లో ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఇదిలా ఉండగా సీఐడీ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ ఎస్ఈసీ సహాయ కార్యదర్శి సాంబమూర్తి కూడా హైకోర్టును ఆశ్రయించడంతో.. ఈ రెండు పిటిషన్లను కలిపి విచారించేలా వీటిపై తరువాతి విచారణను ఈ నెల 7కి వాయిదా వేస్తూ న్యాయమూర్తి జస్టిస్ డి.రమేశ్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా.. తనకు భద్రత కల్పించాలని గతంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ కేంద్రానికి రాసిన లేఖపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అనుమానం వ్యక్తం చేస్తూ.. దీనిపై విచారణ జరిపించాలని డీజీపీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.