రెండేళ్ల అరాచ‌కం.. మ‌రో మూడేళ్లు భ‌రించాల్సిందేనా?

జ‌గ‌న్‌రెడ్డి గ‌ద్దె నెక్కి స‌రిగ్గా రెండేళ్లు. మిగిలింది మ‌రో మూడేళ్లు. ఈ రెండేళ్ల‌లోనే ర‌చ్చ రంబోలా చేశాడు. వామ్మో.. ఇంకో మూడేళ్లు భ‌రించాలా? అని జ‌నం బెంబేలెత్తిపోతున్నారు. జ‌గ‌న్ అన్నా.. ఆయ‌న పాల‌న‌న్నా.. జ‌నాలు అంత‌గా భ‌య‌ప‌డుతున్నారు. ఈ రెండేళ్ల‌లో జ‌గ‌న్ ఏం సాధించారో చెప్ప‌డం క‌ష్ట‌మే కానీ.. జ‌గ‌న్ ఏం నాశ‌నం చేశారో చెప్ప‌డం మాత్రం చాలా సులువు. పాల‌న‌ను ఎలా భ్ర‌ష్టు ప‌ట్టించారో చెప్ప‌డానికి అనేక ఉదాహ‌ర‌ణ‌లు...

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని ఏది? ఈ ప్ర‌శ్న ఏ సివిల్ స‌ర్వీస్ ఇంట‌ర్వ్యూలో అడిగినా ట‌క్కుమ‌ని స‌మాధానం చెప్ప‌లేని ప‌రిస్థితి?  దేశంలోకే క‌ఠినమైన‌ ప్ర‌శ్న ఇది. చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాజ‌ధాని అమ‌రావ‌తి అని.. ఆంధ్రులంతా స‌గ‌ర్వంగా.. చాతి విరుచుకు మ‌రీ చెప్పుకునే వారు. మా రాజ‌ధాని.. సింగ‌పూర్ త‌ర‌హాలో ఉంటుంద‌ని.. మాది అంత‌ర్జాతీయ స్థాయి రాజ‌ధాని అని.. మా రాజ‌ధానికి దేశంలో మ‌రే ప్రాంతం సాటికాద‌ని.. ఇలా ఆంధ్రులంతా గొప్ప‌లు పోయేవారు. సీమ ప్ర‌జ‌లు సైతం అమ‌రావ‌తిని అదృష్టంగా భావించారు. ఉత్త‌రాంధ్ర వాసులు సైతం మా అమ‌రావ‌తి అని మురిసిపోయారు. ఒక్క ఛాన్స్ అంటూ అంద‌ల‌మెక్కిన జ‌గ‌న‌న్న‌.. ఒక్క మాట‌తో అమ‌రావ‌తిని మూడు ముక్కలు చేశాడు. ఆ ముక్క‌ల‌నైనా చ‌క్క‌గా చేశాడా? అంటే అదీ లేదు. క‌ర్నూలు అలానే కునారిల్లుతోంది. త‌మ ప్రాంతానాకి న్యాయం జ‌ర‌గ‌డం కోసం ఇంకా ఎదురు చూస్తూనే ఉంది. జ‌గ‌న్‌రెడ్డి తీరును చూసి విశాఖ విస్తుబోతోంది. స‌ముద్ర‌తీరంలో జ‌రుగుతున్న‌ భూదందాల‌తో బెదిరిపోతోంది. జ‌గ‌న్‌రెడ్డి రెండేళ్ల పాల‌న ఎంత అరాచ‌కంగా సాగిందో చెప్ప‌డానికి.. అమ‌రావ‌తినే బెస్ట్ ఎగ్జాంపుల్ అంటున్నారు.

500 రోజుల‌కు పైబ‌డి అమ‌రావ‌తి రైతులు దీక్ష‌లు చేస్తున్నా.. ఈ స‌ర్కారులో ఉలుకూప‌లుకూ లేకుండా పోయింది. రైతుల చేతికి సంకెళ్లు వేసి అక్క‌సు తీర్చుకున్న ఘ‌న‌త జ‌గ‌న్‌రెడ్డి పాల‌న‌దే అనే విమ‌ర్శ‌. అసైన్డ్ భూములంటూ.. ఏకంగా ప్ర‌తిప‌క్ష నేత‌పైనే కేసుల కుట్ర చేస్తుండ‌టం ఈ రెండేళ్ల పాల‌న ఫ‌లితం. 

న‌వ్యాంధ్ర మొద‌టి ముఖ్య‌మంత్రిగా.. ఏపీపై చంద్ర‌బాబు చేసిన అంద‌మైన‌ సంత‌కాన్ని.. విధ్వంసంతో చెరిపేసే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంద‌నేది అంద‌రి అభిప్రాయం. చంద్ర‌బాబు ల‌క్ష్యంగానే జ‌గ‌న్ పాల‌న కొన‌సాగుతోంద‌ని అంటున్నారు. గ‌ద్దె నెక్కిన తొలినాళ్ల‌లోనే.. 'ప్ర‌జా వేదిక' కూల్చేసి.. ప్ర‌తీకారం తీర్చుకున్నార‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. అప్పటి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ.. ఐఏఎస్‌, ఐపీఎస్‌ల స‌మావేశం పెట్టాలంటే.. ఏపీలో ఒక మంచి వేదికంటూ లేకుండా పోయింది. ప్రజా వేదిక కూల‌గొట్టి ఏం సాధించారో జ‌గ‌న్‌కే తెలియాలి అంటున్నారు. ఇక‌, అక్ర‌మ నిర్మాణ‌మంటూ చంద్ర‌బాబు నివాసానికి ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చారో.. వారికే తెలీదు. మ‌రి, ఈ రెండేళ్ల‌లో క‌ర‌క‌ట్ట‌పై అక్ర‌మ నిర్మాణాల తొల‌గింపు ఎంత వ‌ర‌కు వ‌చ్చింది ముఖ్య‌మంత్రి గారు?  

మ‌రింత దారుణ‌మైన విష‌యం ఏంటంటే.. పేద‌ల నోటి కాడి.. కూడు చెద‌ర‌గొడుతూ.. అన్న క్యాంటీన్ల‌ను అర్థాంత‌రంగా మూసేయ‌డం. ప్ర‌భుత్వం మారింది.. పేద‌ల నిత్యాన్న‌ప‌థ‌కం మూత‌బ‌డింది. రాజ‌న్న క్యాంటీన్లు పెడ‌తామ‌న్నారు.. రెండేళ్లు అవుతోంది ఏవి?  పేద‌ల‌కు ప‌ట్టెడు అన్నం పెట్ట‌డానికి కూడా ఇంత రాజ‌కీయం చేయాలా జ‌గ‌న్‌? అని క‌డుపు కాలుతున్న వాళ్లంతా క‌డుపుమంట‌తో నిల‌దీస్తున్నారు. 

న‌వ‌రత్నాల పాల‌నంటూ జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వం మురిసిపోతోంది. ఆ న‌వ‌ర‌త్నాల వెనుక ఉన్న‌.. అప్పుల కుప్ప‌ల సంగ‌తి సామాన్యుల‌కు తెలీద‌ని అనుకుంటోంది. ఈ రెండేళ్ల‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను.. అప్పుల‌ప్ర‌దేశ్‌గా మార్చేశారు. ఇక అప్పు ముట్ట‌డం క‌ష్ట‌మ‌వుతుండ‌టంతో.. ఏకంగా ప్ర‌భుత్వ భూముల‌ను అడ్డంగా అమ్మేసుకునేందుకు తెగ‌బ‌డుతున్నారు. బంగారంలాంటి విశాఖ భూముల‌ను అంగ‌ట్లో వేలానికి పెట్టారు. అప్పులు, అమ్మేసుకోవ‌డాలే.. రెండేళ్ల విశిష్ట‌త‌. 

ఇక‌, అభివృద్ధి అనే ప‌దం ఏపీలో అడ్ర‌స్ లేకుండా పోయింది. ఈ రెండేళ్ల‌లో ఒక్క‌టంటే ఒక్క కంపెనీ అయినా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు వ‌చ్చిందా? ఒక్క‌టంటే ఒక్క భారీ పెట్టుబ‌డి అయినా ఏపీలో పెట్టారా?  చంద్ర‌బాబు సీఎంగా ఉన్న‌ప్పుడు.. కియాలాంటి ఎన్నో కంపెనీలు ఏపీకి క్యూ క‌డితే.. జగ‌న్‌రెడ్డి సీఎం అయ్యాక‌.. ఉన్న కంపెనీలే త‌ట్టాబుట్టా స‌దురుకొని రాష్ట్రం నుంచి చెక్కేసే ప‌రిస్థితి దాపురించిందని వ్యాపార వ‌ర్గాలు గ‌గ్గోలు పెడుతున్నా.. ఈ ముఖ్య‌మంత్రి చెవికి సోకితేగా?  విశాఖ స్టీల్ ప్లాంట్ మ‌న‌ది కాకుండా పోతున్నా.. ప‌ట్టించుకుంటేగా?
    
ఇక‌, లిక్క‌ర్‌, ఇసుక పాల‌సీల గురించి ఎంత త‌క్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. దేశ ప్ర‌జ‌ల‌కు తెలిసిన‌.. ఏ బ్రాండ్ మ‌ద్యం కూడా ఏపీలో అమ్మ‌రు. మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్ర‌భుత్వప‌రం చేసి.. ఊరూ-పేరు లేని బ్రాండ్లు తీసుకొచ్చి.. భారీగా రేట్లు బాదేసి.. జ‌నాల‌తో బ‌ల‌వంతంగా మందు తాగిస్తున్నారు. మ‌ద్యం మాన‌లేక‌.. ఆ మందు గొంతు దిగ‌క‌.. బుక్క బుక్క‌కీ.. జ‌గ‌న్‌రెడ్డికి శాప‌నార్థాలు పెడుతున్నారు మందుబాబులు. వివిధ సంక్షేమ ప‌థకాల పేరుతో మ‌హిళ‌ల‌కు ఇస్తున్న డ‌బ్బంతా.. ఆ ఇంటాయ‌న తాగే మ‌ద్యం రూపంలో మ‌ళ్లీ ప్ర‌భుత్వ ఖ‌జానాకే చేరుతుంద‌నేది జ‌నం మాట‌. ఒక చేత్తో 10 రూపాయ‌లు ఇచ్చి.. మ‌రో చేత్తో వంద లాగేసుకుంటున్నార‌నే విమ‌ర్శ‌. ఆ మ‌ద్యం బ్రాండుల‌తో జ‌గ‌న్‌రెడ్డి జేబులోకి వేల కోట్ల రూపాయ‌లు క‌మిష‌న్‌గా వ‌చ్చి ప‌డుతోంద‌నేది ప్ర‌తిప‌క్షాల‌ ఆరోప‌ణ‌. ఇక‌, ఉచిత‌ ఇసుక హామీ ఎప్పుడు గంగ‌లో క‌లిసిపోయింది. ఏపీలోని ఇసుక రీచుల‌ను వేలం పాట‌లో అయిన వారికి అమ్మేసుకున్నారు. ఇసుక నుంచి కాసుల తైలంబు పిండుకుంటున్నారు. 

అభివృద్ధితో పాటు పాల‌న ఇలా ప‌డ‌కేస్తే.. క‌క్ష్య సాధింపు చ‌ర్య‌లు, కుట్ర రాజ‌కీయాల్లో మాత్రం ఈ రెండేళ్ల‌లో జ‌గ‌న్‌రెడ్డి భారీ విజ‌య‌మే సాధించార‌ని చెప్పొచ్చు. ప్ర‌తిప‌క్ష నేత‌ చంద్ర‌బాబు మొద‌లు.. అచ్చెన్నాయుడు, జేసీ ఫ్యామిలీ, దేవినేని ఉమా, ధూళిపాళ్ల న‌రేంద్ర‌, కొల్లు ర‌వీంద్ర‌, కూన ర‌వికుమార్‌.. ఇలా ఏ జిల్లాలో ఎవ‌రినీ వ‌ద‌ల‌కుండా.. కుట్ర‌లు, కేసుల‌తో ఏపీలో ప్ర‌తిప‌క్ష‌మే లేకుండా చేయాల‌నే ప్ర‌య‌త్నాల్లో ఈ రెండేళ్లూ బిజీగా ఉన్నారు సీఎం జ‌గ‌న్‌రెడ్డి. ఇందులో ఏ కేసులో బ‌లం లేకుండా.. టీడీపీని భ‌య పెట్ట‌డానికే ఇలా కేసుల‌తో బెదిరిస్తున్నార‌నే విమ‌ర్శ వినిపిస్తోంది. ప్ర‌తిప‌క్షమ‌నే కాదు.. స్వ‌ప‌క్షంలో విప‌క్షంగా మారిన న‌ర్సాపురం ఎంపీ ర‌ఘురామ‌ను ఎంత‌గా ఇబ్బంది పెట్టాలో అంత‌కంటే ఎక్కువే ఇబ్బంది పెట్టింది ఏపీ స‌ర్కారు. ఇలాంటి క‌క్ష్య సాధింపు చ‌ర్య‌లో గ‌తంలో ఏ ప్ర‌భుత్వ‌మూ చేప‌ట్ట‌లేద‌ని.. ఇది జ‌గ‌న్ పైశాచిక ఆనందానికి నిద‌ర్శ‌న‌మ‌ని.. ప్ర‌తిప‌క్ష టీడీపీ ప్ర‌తినిత్యం విమ‌ర్శిస్తూనే ఉంది. 

కేవ‌లం పార్టీలు, నేత‌ల‌నే కాదు.. రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌ల‌నూ జ‌గ‌న్‌రెడ్డి వ‌ద‌ల‌డం లేదంటూ జ‌నాలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. మాజీ ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్‌కు.. జ‌గ‌న్‌రెడ్డికి జ‌రిగిన.. టామ్ అండ్ జెర్రీ వార్‌ను చూసి జ‌నాలే చీద‌రించుకున్నారు. ఎన్నిక‌లు వ‌ద్దంటూ.. జ‌గ‌న్ స‌ర్కారు చేసిన కుట్ర‌లు.. మ‌ధ్య‌లో ఆర్డినెన్స్ తీసుకొచ్చి.. ర‌మేశ్‌కుమార్‌ను తొల‌గించి.. జ‌స్టిస్ క‌న‌క‌రాజ్‌ను ఎస్ఈసీగా చేసి.. కోర్టు మెట్టికాయ‌ల‌తో త‌ల‌బొప్పిక‌ట్టి.. అబ్బో.. స్టేట్ వ‌ర్సెస్ ఎస్ఈసీ ఎపిసోడ్‌.. ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్‌రెడ్డి అనుభ‌వ‌రాహిత్యానికి నిద‌ర్శ‌నం అంటున్నారు. ఇక‌, వ‌రుస‌గా జ‌రిగిన స్థానిక సంస్థ‌లు, కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో అధికార ప‌క్షం చేసిన ఆగ‌డాల‌కు అడ్డూఅదుపు లేకుండా పోయింది. తిరుప‌తి ఉప ఎన్నిక‌లో దొంగ ఓట్లు పోటెత్తిన వైనం చూసి అంతా నివ్వెర్ర‌పోయారు. 

ఇలా చెప్పుకుంటూ పోతే.. ఇంకా చాల‌నే ఉన్నాయి జ‌గ‌న్‌రెడ్డి య‌వ్వారాలు. ఈ రెండేళ్లు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ఓ పీడ‌క‌లగా మారిందంటున్నారు. జ‌గ‌న్‌రెడ్డి పాల‌న‌లో అభివృద్ధిలో ఏపీ రెండు ద‌శాబ్దాలు వెన‌కబ‌డింద‌ని వాపోతున్నారు. అరాచ‌కాల్లో మాత్రం అంద‌నంత ఎత్తులో.. అంద‌రిక‌న్నా ముందున్నార‌ని అంటున్నారు. ఇలాంటి అధ్వాహ్న‌, అడ్డ‌గోలు పాల‌న‌ను ఏపీ ప్ర‌జ‌లు మ‌రో మూడేళ్లు భ‌రించాలా? అని భ‌య‌ప‌డిపోతున్నారు. జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు చేయాలంటూ ఎంపీ ర‌ఘురామ సీబీఐ కోర్టులో వేసిన పిటిష‌న్‌పై వేగంగా విచార‌ణ జ‌రుగుతుండ‌టం ఒక్క‌టే కాస్త ఊర‌ట‌నిచ్చే అంశం.. అప్ప‌టి దాకా త‌ప్ప‌దు ఈ దారుణం అంటున్నారు. జ‌గ‌న్‌రెడ్డి రెండేళ్ల అరాచ‌క పాల‌న‌పై ఓ పుస్త‌కం రిలీజ్ చేయాల్సిన అవ‌స‌రం ఉందంటున్నారు ప్ర‌జాస్వామ్య‌వాదులు.

వైసీపీ బాటలోనే బీఆర్ఎస్?.. అసెంబ్లీ బహిష్కరణకు నిర్ణయం

  పదేళ్ల పాటు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. ఒక్క ఓటమితో కుదేలైపోయిందా? అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని దీటుగా ఎదుర్కోలేక పలాయన మంత్రం పఠిస్తోందా? అంటే ఔననే అంటున్నారు విశ్లేషకులు. ఆ పార్టీ అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయం అందులో భాగమేనని అంటున్నారు. ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఇప్పటికే అసెంబ్లీని బహిష్కరించి ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. ఇప్పుడు పార్టీ సభ్యులు కూడా అసెంబ్లీని బాయ్ కాట్ చేయాలని బీఆర్ఎస్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.  దీంతో రాజకీయ వర్గాలలో బీఆర్ఎస్  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ అడుగుజాడలలో నడుస్తోందని అంటున్నారు. ఏపీలో వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో ప్రజలు తమకు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తే.. తెలంగాణలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులను దీటుగా ఎదుర్కోవడంలో వైఫల్యం కారణంగా బాయ్ కాట్ చేస్తున్నారన్న చర్చ జరుగుతోంంది.   సోమవారం (జనవరి 5)న సభకు హాజరై.. మంగళవారం (జనవరి 6) నుంచి అంటే సభలో కృష్ణ, గోదావరి జలాలపై చర్చ జరిగే సమయానికి అసెంబ్లీని బాయ్ కాట్ చేయాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే పరిశీలకులు మాత్రం సభలో కాంగ్రెస్ ను దీటుగా ఎదుర్కోనేందుకు సభాపక్ష ఉప నేతల నియామకం తరువాత బీఆర్ఎస్ బాయ్ కాట్ నిర్ణయం తీసుకోవడం ఏమిటన్న ప్రశ్నకు ఆ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి హారీశ్‌రావుకి క్రెడిట్ దక్కే చాన్స్ ఇవ్వవద్దన్య వ్యూహంతోనే బీఆర్ఎస్ ఈ బాయ్ కాట్ నిర్ణయానికి వచ్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఒక విధంగా అసెంబ్లీలో నదీ జలాలపై చర్చను బీఆర్ఎస్ బాయ్ కాట్ చేయడమంటే.. పలాయన మంత్రం పఠించడమేనని పరిశీలకులు భావిస్తున్నారు.   అయితే నిన్న మొన్నటి వరకూ నదీ జలాల అంశంలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం, ఎండగడతాం అంటూ బీరాలు పలికిన బీఆర్ఎస్ ఇంత హఠాత్తుగా బహిష్కరణ నిర్ణయం తీసుకోవడంపై రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఒక వేళ కేసీఆర్ సభకు హాజరైతే.. జల వివాదాలకు ఆయనే సమాధానం చెబుతారు. అయితే కేసీఆర్ గైర్హాజరౌతున్న నేపథ్యంలో ఇటీవల శాసనసభాపక్ష ఉప నేతగా నియమితులైన హరీష్ రావు సభలో బీఆర్ఎస్ తరఫున ప్రసంగించాల్సి ఉంది. అదే జరిగితే సభ సీఎం రేవంత్ వర్సెస్ హరీష్ రావు అన్నట్లుగా మారిపోతుంది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ డమ్మీ అయిపోతారు. ఇప్పటికే శాసనసభాపక్ష ఉప నేతగా హరీష్ రావు నియామకం కేటీఆర్ ను ఒకింత తక్కువ చేసినట్లుగానే పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ తరుణంలో ఇక జలవివాదాలపై హరీష్ రావు గట్టిగా గళం విప్పితే కేటీఆర్ పరిస్థితి పార్టీలో మరింత దిగజారుతుందన్న భావనతోనే బీఆర్ఎస్ ఆకస్మికంగా అసెంబ్లీ బాయ్ కాట్ నిర్ణయం తీసుకుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అన్నిటికీ మించి సీఎం రేవంత్, హరీష్ మధ్య కుమ్మక్కు రాజకీయాలు జరుగుతున్నాయనీ, వారిరువురి మధ్యా అరగంట భేటీ జరిగిందనీ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించిన గంటల వ్యవధిలో బీఆర్ఎస్ అసెంబ్లీ బాయ్ కాట్ నిర్ణయం తీసుకోవడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే పార్టీలో సంక్షోభం ముదిరేలా చేసుకోవడం కంటే.. జనం పలాయనం అనుకున్నా అసెంబ్లీ బాయ్ కాటే మేలని బీఆర్ఎస్ నిర్ణయించుకునట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. విశేషమేంటంటే  పార్టీ అసెంబ్లీ బాయ్ కాట్ నిర్ణయాన్నిస్వయంగా హరీష్ రావే ప్రకటించడం విశేషం.

కేసీఆర్ తోనూ ఢీ అంటే ఢీ.. కవిత మాటల అర్ధం అదేనా?

తెలంగాణ రాష్ట్రంలో ఇక బీఆర్ఎస్ పని ఖతమేనా? ఆ పార్టీ బహిష్కృత నాయకురాలు కవిత ఇదే విషయాన్ని ఒకింత నర్మగర్బంగా చెప్పారా?  అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల ఆరంభం సందర్భంగా సభకు వచ్చి ఓ ఐదారు నిముషాలు సభలో కూర్చున్న బీఆర్ఎస్ అధినేత, బీఆర్ఎస్ ఎల్పీ నాయకుడు కల్వకుంట్ల కేసీఆర్..  ఆ తరువాత  సభ నుంచి బయటకు వెళ్లి పోయారు. అయితే.. ఆ రోజు సభలో ఏ విషయంపైనా చర్చ జరిగే అవకాశం లేనందున ఆయన సభనుంచి వెళ్లిపోయారనీ, కొత్త సంవత్సరం రెండో తేదీ నుంచి కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి రేవంత్ సర్కార్ ను అడుగడుగునా ఇరుకున పెట్టి తన విశ్వ రూపాన్ని చూపిస్తారనీ బీఆర్ఎస్ శ్రేణులు, నేతలు గట్టిగా చెప్పారు. అదే నమ్మారు. అయితే కేసీఆర్ మాత్రం సభలో పార్టీ గొంతు గళంగా వినిపించేందుకు ఉప నాయకులను నియమించడంతో.. ఆయన ఈ శీతాకాల సమావేశాలలో ఇక సభలో కనిపించరని పరిశీలకులు ఆ రోజే చెప్పారు. అందుకు తగ్గట్టుగానే శుక్రవారం సభకు కేసీఆర్ గైర్హాజరయ్యారు.  ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ భవిష్యత్ పై తెలంగాణ జాగృతి అధినేత్రి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీరియస్ వ్యాఖ్యలు చేశారు. సభకు కేసీఆర్ డుమ్మా కొడితే రాష్ట్రంలో బీఆర్ఎస్ పని ఇక ఖతమే అని అన్నారు.  శుక్రవారం (ఫిబ్రవరి 2) శాసనమండలి మీడియా పాయింట్ వద్ద విలేకరులతో  చిట్ చాట్ చేసిన ఆమె.. తన తండ్రి కేసీఆర్ కే  సవాల్ విసిరారు. ఇంత కాలం కల్వకుంట్ల కవిత తన విమర్శలను హరీష్ రావు, సంతోష్, జగదీశ్వరరెడ్డి వంటి నాయకులకే పరిమితం చేసిన కవిత ఇప్పుడు బీఆర్ఎస్ అధినాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు, సవాళ్లు సంధిస్తున్నారు. తాజా చిట్ చాట్ లో ఆమె తన తండ్రి కేసీఆర్ నే నేరుగా నిలదీశారు. కేసీఆర్ అసెంబ్లీకి డుమ్మా కొడితే రాష్ట్రంలో బీఆర్ఎస్ ఇక ఖతమేనన్నారు. అయినా ఎటువంటి తప్పూ చేయకపోతే కేసీఆర్ సభకు ఎందుకు రావడం లేదని నిలదీశారు. తప్పు చేయకుంటే కేసీఆర్ సభకు రావాలని సవాల్ విసిరారు.   అధినాయకుడు అసెంబ్లీకి రాకుండా..  పిల్ల కాకులకు సభాసమయాన్ని వదలడం సరికాదన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు కు ప్యాకేజీలు, అమ్ముకోవడం తప్ప ఏం తెలియదని ఎద్దేవా చేశారు.   హరీష్ రావు, రేవంత్ రెడ్డిల మధ్య రహస్య బాండ్ ఉందని ఆరోపించిన ఆమె హరీష్ సీఎం చాంబర్ లో అరగంట సేపు ముచ్చటించడం నిజం కాదా అని ప్రశ్నించారు.   అసెంబ్లీలో  మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ఆరోపించిన ఆమె..  రేవంత్ వర్సెస్ హరీష్ అన్నట్లుగా అసెంబ్లీ చాలా ప్రమాదకరమన్నారు.  కల్వకుంట్ల కవిత తన తండ్రి కేసీఆర్ పై నేరుగా అటాక్ చేయడం ఆమె పార్టీ నుంచి బయటకు వచ్చిన తరువాత ఇదే ప్రథమం. ఈ సందర్భంగా ఆమె కేసీఆర్ తో తాను మాట్లాడి నాలుగు నెలలు పైనే అయ్యిందన్నారు.  కేటీఆర్, హరీష్ లకు పార్టీని వదిలేయడంపై ఆమె ఈ సందర్భంగా కేసీఆర్ ను తప్పుపట్టారు.  ఇలా మాట్లాడడం ద్వారా ఆమె తాను కేసీఆర్ తో డీ అంటే ఢీ అనడానికి రెడీ అన్న సంకేతాలు ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చేసిన తరువాత తన శాసనమండలి సభ్యత్వానికి కవిత రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె ఇప్పటికీ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. శుక్రవారం (జనవరి 2) కూడా ఆమె శాసనమండలి స్పీకర్ ను తన రాజీనామాను ఆమోదించాల్సిందిగా కోరారు. 

సొంత ఇంటి పంచాయతీ పరిష్కరించలేక చేతులెత్తేశారు.. కేసీఆర్ పై రఘునందన్ విమర్శలు

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. కొత్త సంవత్సరం తొలి రోజున ఆయనపై బీజేపీ ఎంపీ రఘునందనరావు తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. కేసీఆర్ తీరు ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిందన్న చందంలా ఉందన్నట్లుగా ఆయన విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ఇతరుల పంచాయతీలను పరిష్కరించడంలో గొప్ప ఉత్సాహం చూపిస్తారనీ, అయితే సొంత ఇంటి పంచాయతీల పరిష్కాం విషయంలో మాత్రం చేతులెత్తేశారనీ అన్నారు. గత కొంత కాలంగా తన స్వంత కుమారుడు, కుమార్తెల మధ్య పంచాయతీని పరిష్కరించే విషయంలో విఫలమైన ఆయన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య జలపంచాయతీలు, కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. రానున్న రోజులలో బీఆర్ఎస్ కనుమరుగైపోవడం ఖాయమని తాను భావిస్తున్నట్లు చెప్పారు.  ఇక కల్వకుంట్ల కవిత సొంత దారి చూసుకున్నారనీ, నేడో, రేపో ఆమె కొత్త పార్టీ ప్రారంభించడం ఖాయమనీ జోస్యం చెప్పారు.  అసెంబ్లీ శీతాకాల సమావేశాల తొలి రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ వద్దకు వచ్చిన సందర్భంగా బీఆర్ఎస్ కార్యనిర్వాహన అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు. ఆ పార్టీ ఎమ్మెల్యే కౌషిక్ రెడ్డిలు లేచి నిలబడకపోవడం వారి విచక్షణకు సంబంధించిన విషయమన్న రఘునందనరావు.. కేటీఆర్ కు ముఖ్యమంత్రి కావాలన్న యాంబిషన్ ఉందనీ, అయితే అది సాకారం అవ్వాలంటే ఉండాల్సిన మద్దతు కేటీఆర్ కు సొంత పార్టీ నుంచే కరవైందన్నారు.  పార్టీ దాకా ఎందుకు ఆయనకు సొంత కుటుంబంలోనే మద్దతు లేదని చెప్పారు.  ఈ పరిణామాలన్నిటినీ నిశబ్దంగా గమనిస్తున్న హరీష్ రావు సమయం కోసం వేచి చూస్తున్నారని తాను భావిస్తున్నానన్నారు. ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్న రఘునందనరావు.. కావాలంటే ఈ విషయాన్ని తాను రాతపూర్వకంగా కూడా చెబుతానన్నారు.  ఇక రాష్ట్ర బీజేపీలో బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య విభేదాలపై స్పందిస్తూ.. ఏ పార్టీలోనైనా అభిప్రాయబేధాలు సహజమని కొట్టి పారేశారు.  దశాబ్ద కాలం బీఆర్ఎస్ పాలనను.. రెండేళ్ల కాంగ్రెస్ పాలననూ చూసిన తెలంగాణం ఇప్పడు బీజేపీకి పట్టం గట్టాలని ఉవ్విళ్లూరుతున్నారన్నారు.  

బళ్లారిలో గాలి జనార్ధన్ రెడ్డిపై కాల్పులు

కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డిపై కర్నాటకలోని బళ్లారిలో హత్యాయత్నం జరిగింది. ఆయనపై స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు కాల్పులు జరిపి హత్యాయత్నం చేశాడు. ఈ ఘటనతో బళ్లారిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  మహర్షి వాల్మీకి విగ్రహం ఏర్పాటు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీవిషయంలో  తలెత్తిన వివాదం ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది.   ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి  గాలి జనార్ధన్ రెడ్డిపై రెండు రౌండ్లు కాల్పులు జరపగా, ప్రతిగా గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో  కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మరణించాడు. అలాగే తొలుత కాల్పులు జరిపిన సతీష్ రెడ్డి గాయపడ్డాడు.   స్థానిక ఎమ్మెల్యే భరరత్ రెడ్డి, గాలి జనార్థన్ రెడ్డిల మధ్య దీర్ఘకాలంగా రాజకీయ వైరం ఉన్న సంగతి విదితమే.  భరత్ రెడ్డి వర్గం వారు గాలి జనార్ధన్ రెడ్డి నివాసం వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం ఘర్షణకు దారి తీసింది.  కాగా ఈ కాల్పుల ఘటన నేపథ్యంలో బళ్లారిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొడంతో  పోలీసులు 144వ సెక్షన్ విధించారు. బళ్లారిలో ప్రధాన నాయకులు ఎవరు ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఆదేశాలు జారీ చేశారు.  

కొత్త సంవత్సరంలో కవిత వార్ కొత్త పుంతలేనా?

బీఆర్ఎస్ వర్సెస్ కవిత వార్ కొత్త సంవత్సరంలో కొత్త పుంతలు తొక్కబోతున్నది. ఇప్పటి వరకూ ఘాటుగా విమర్శలు చేస్తున్నా కవిత తన విమర్శలను ఒకింత సున్నితంగా చిన్నపాటి సూదిమొన గుచ్చినట్లుగా చేస్తు వచ్చారు. అయితే ఇక ముందు అంటే కొత్త సంవత్సరంలో తాను ఇంకెంత మాత్రం వెనక్కు తగ్గకుండా ముందుకు సాగుతానని.. ఈ ఏడాది చివరి రోజున కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. ఒక పాడ్ కాస్ట్ లో మాట్లాడిన ఆయన ఈ సారి కేటీఆర్ లక్ష్యంగా కూడా సెన్సేషనల్ వ్యాఖ్యలు చేశారు. తనను పార్టీ నుంచి బయటకు గెంటేసిన బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని ఇప్పటికే బాహాటంగా విమర్శలు గుప్పిస్తూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఈ సారి కేటీఆర్ రాజకీయాలను ఎండగట్టారు. తన సోదరుడు కేటీఆర్ కంటే పార్టీ కోసం తానే ఎక్కువగా కష్టపడ్డాన విస్పష్టంగా తేల్చేశారు.  కేటీఆర్ నేరుగా అమెరికా నుంచి వచ్చి పార్టీలో చేరితే.. తాను మాత్రం   2006 లో  సొంతంగా తెలంగాణ జాగృతిని ఏర్పాటు చేశాననీ, తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణ అన్న విషయానికి తెలంగాణ సాధన ఉద్యమంలో అగ్రస్థానం కలిగేలా చేశాననీ చెప్పుకున్నారు. తెలంగాణ ఉద్యమంలోనూ తాను ఇండిపెండెంట్ గానే పాల్గొన్నా నన్నారు.  తెలంగాణ ఆవిర్భవించి పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీ తీరులో మార్పు వచ్చిందని కవిత అన్నారు.  అప్పుడే తన ఎదుగుదలను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న అనుమానం తనకు కలిగిందన్న కవిత..  తన ఫోన్ ను తన భర్త పోన్ ను ట్యాప్ చేశారని ఆరోపించారు. ఈ విషయాన్ని తాను అప్పుడే పార్టీ దృష్టికి తీసుకువచ్చినా తేలికగా తీసుకున్నారని కవిత చెప్పారు. అదే కేటీఆర్ భార్య ఫోన్ ట్యాప్ చేయిస్తే తేలికగా తీసుకుంటారా అని ప్రశ్నించిన ఆమె,  మా ఇంట్లో పని చేస్తున్న ఒకరికి ఫోన్ ట్యాపింగ్ విషయంలో  సిట్ నోటీసులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అప్పుడే తన ఫోన్, తన భర్త ఫోన్లను కూడా ట్యాప్ చేశారన్న విషయం అర్ధమైందన్నారు.  మహిళలకు అవకాశం ఇచ్చే విషయంలో పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సరిగా వ్యవహరించలేదని తండ్రి నిర్ణయాలను సైతం తప్పుపట్టిన కవిత.. కేసీఆర్ హయాంలో 42 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తే.. వారిలో కనీసం ఒక్క మహిళ కూడా లేని విషయాన్ని ఎత్తి చూపారు. ఆ నాడే తాను తన తండ్రిని ప్రశ్నించానని చెప్పుకొచ్చారు.  ఇక హరీష్ రావుపై కూడా ఆమె విమర్శలు గుప్పించారు. హరీష్ రావును తెలంగాణ చంద్రబాబుగా అభివర్ణించారు. ఏడాది ముగుస్తున్న సమయంలో ఆమె పాడ్ కాస్ట్ లో పాల్గొని చేసిన వ్యాఖ్యలు వచ్చే సంవత్సరం కవిత బీఆర్ఎస్ పై ఇప్పటి వరకూ చేస్తున్న యుద్ధం కొత్త పుంతలు తొక్కబోతోందన్న విషయాన్ని తేటతెల్లం చేశాయి. ఇప్పటి వరకూ తన సోదరుడిని హరీష్ ముంచేస్తారు, తన తండ్రిని తప్పుదోవపట్టిస్తారు అంటూ వచ్చిన కవిత.. ఇప్పుడు మొత్తంగా పార్టీ అధినేత కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సహా మొత్తం అందరిపైనా యుద్ధం ప్రకటించేసినట్లైంది. 

మెగా ఫ్యాన్స్ వర్సెస్ నాగబాబు.. జనసైనికులు ఎటువైపు?

జనసేన ఎమ్మెల్సీ, మెగా బ్రదర్ నాగబాబు కొద్ది కాలంగా ఎక్కడా పెద్దగా కనిపించడం లేదు, వినిపించడం లేదు. అటువంటి నాగబాబు.. నటుడు శివాజీ మహిళల వస్త్రధారణపై చేసిన కామెంట్లకు కౌంటర్ ఇవ్వడం ద్వారా ఒక్క సారిగా లైమ్ లైట్ లోకి వచ్చేశారు. జనసేన ఎమ్మెల్సీగా.. ఆ పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు పని చేసుకుంటూ పోతున్న నాగబాబు.. శివాజీ కామెంట్లకు కౌంటర్ ఇచ్చి, మెగా ఫ్యాన్స్ కు టార్గెట్ గా మారారు. శివాజీ చేసిన వివాదాస్పద కామెంట్లపై నాగబాబు  కౌంటర్ ఒకింత ఘాటుగా ఉంది. అందులో సందేహం లేదు. అయితే మామూలుగా అయితే నాగబాబు కౌంటర్ వివాదాస్పదం అయ్యే అవకాశం లేదు. కానీ శివాజీ వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ ఒకింత సానుకూలత వ్యక్తం చేయడంతో నాగబాబును వివాదంలోకి లాగారు. సోషల్ మీడియా వేదికగా నాగబాబుపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.   వాస్తవానికి మెగా కాంపౌడ్ అంత పటిష్ఠంగా ఉండటానికి నాగబాబే కారణమని అంటుంటారు, ఆయన నాగ‌బాబు లేకుండా మెగా కాంపౌండ్ ఇంత స్ట్రాంగా నిల‌బ‌డే ఛాన్స్ లేదనే వారు కూడా చాలా మంది ఉన్నారు. మెగా స్టార్ చిరంజీవి అయినా, మెగాపవర్ స్టార్, జనసేనాని పవన్ కల్యాణ్ అయినా.. తాము మాట్లాడితే ఇబ్బంది అనుకునే విషయాలను నాగబాబు నోట పలికిస్తారని వారిని దగ్గరా తెలిసన వారు చెబుతుంటారు.   ఇందుకు ఉదాహరణగా అల్లు అర్జున్ గత ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్థికి అనుకూలంగా ప్రచారం చేసిన సందర్భంలో కానీ,  ఇండస్ట్రీలో చిరుకు మద్దతుగా గళం విప్పే అంశంలో కానీ నాగబాబు ఎలాంటి శషబిషలూ లేకుండా ముందుకు వచ్చిన సందర్భాలను గుర్తు చేస్తున్నారు. ఇక తన స్వంత కుమార్తె నీహారిక విషయంలో ఆమె పూర్తి స్వేచ్ఛ ఇచ్చి అండగా నిలబడిన ఉదంతాన్నీ గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ నాగబాబును జనసేన నుంచి సస్పెండ్ చేయాలంటూ చేస్తున్న డిమాండ్ ను జనసైనికులు కొట్టి పారేస్తున్నారు. మహాళల వ్యక్తిగత స్వేచ్ఛ విషయంలో నాగబాబు చెప్పిన దాంట్లో తప్పేమీ లేదని ఆయనకు అండగా నిలబడుతున్నారు. మెగా ఫ్యాన్స్ కూడా ఈ అనవసర అంశాన్ని ఇంకా పొడిగించకుండా కామైపోవడం మంచిదని హితవు చెబుతున్నారు.  

గాంధీ నెహ్రూ కుటుంబ వారసుడు రేహాన్ వాధ్రా గాంధీయేనా?

రాహుల్ గాంధీ నెహ్రూ గాంధీ నెహ్రూ కుటుంబ వారసుడు.  కాంగ్రెస్ పార్టీకి ప్ర‌స్తుత‌ం పెద్ద దిక్కు. ద‌శా దిశా దిస్కూచి కూడా రాహుల్ గాంధీయే. కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థి కూడా ఆయనే. అందులో సందేహం లేదు. అయితే.. రాహుల్ తరువాత కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా చూసిన ఆయన సోదరి ప్రియాంక వధేరా గాంధీ కుమారుడు   రేహాన్ వాద్రానే వార‌సుడు. అందుకు కారణం రాహుల్ గాంధీ అవివాహితుడిగా ఉండటమే. ఇక కుటుంబ వారసత్వం రేహాన్ వాద్రాకు అప్పగించడానికి రాహుల్ రెడీ అయిపోయారనడానికి సూచనగా.. రేహాన్ వాద్రా పేరు చివర గాంధీని కూడా ఇటీవలే అధికారికంగా చెర్చారు. ఔను రేహాన్ ఇంటి పేరును వాద్రా గాంధీగా ప్రికాంక వాద్రా అధికారికంగా మార్పించారు.   అదే రాహుల్ గాంధీకి వివాహమై ఉంటే.. ఆయ‌న త‌న‌యులే త‌ర్వాతి  త‌రం వార‌సులు అయి ఉండేవారు. కొద్ది కాలం కిందటి వరకూ రాహుల్ గాంధీ వివాహం అన్నదే వారి కుటుంబంలోనే కాక, రాజకీయవర్గాలలో కూడా హాట్ టాపిక్ గా ఉండేది. అయితే.. రాహుల్ వివాహం పట్ల సుముఖత వ్యక్తం చేయకపోవడంతో ఆ చర్చ క్రమంగా ఆగిపోయింది. ఇప్పుడు రాహుల్ మేనల్లుడు రేహాన్ తాను ప్రేమించిన యువతిని వివాహం చేసుకోవడానికి తల్లిదండ్రుల అనుమతి తీసుకుని పెళ్లి పీటలెక్కుతున్నారు. అయితే రాహుల్ గాంధీకి కూడా ఓ ప్రియురాలు ఉండేదని గట్టిగా వినిపించేది. అయితే ఆయన రేహాన్ లా ధైర్యం చేయలేదు. అందుకు ప్రధాన కారణం సెక్యూరిటీ థ్రేట్ అంటారు.  అప్ప‌ట్లో సోనియా గాంధీ ప్ర‌ధాని  కావ‌ల్సిన  వారు.. ఆమె ప్ర‌ధాని కాలేక పోవ‌డానికి, త‌ర్వాత రాహుల్ పెళ్లాడ‌క పోవ‌డానికి కూడా అదే కారణంగా చెబుతారు.  అప్ప‌ట్లో ఎల్. టీ. టీ. ఈ అనే మిలిటెంట్ గ్రూప్ రాజీవ్ గాంధీని హ‌త‌మార్చిన సంగ‌తి తెలిసిందే. సోనియా ప్ర‌ధాని కాకుండా హెచ్చ‌రిక‌లు జారీ చేసి అడ్డుకున్నది కూడా ఎట్టీటీయే అని అప్పట్లో గట్టిగా వినిపించింది.ఈ నేప‌థ్యంలో రాహుల్ తన త‌ద‌నంత‌ర వార‌సుల‌కు ఈ ప్రాణ‌హాని  సైతం అనువంశికంగా  క‌ల్పించ‌డం ఎందుకు? అన్న కోణంలో ఆలోచించి.. త‌న పెళ్లి ఊసెత్తలేదని అంటారు. అందుకే రేహాన్ పెళ్లి ద్వారా ఆ ఇంట ఇన్నేళ్ల‌కు ఒక శుభ‌కార్యం జ‌రుగుతుండ‌టంతో హ్యాపీ ఫీల‌వుతున్నారు కాంగ్రెస్ కార్య‌ర్త‌లు.

తిరుమలలో రోజా రాజకీయ వ్యాఖ్యలు.. వెల్లువెత్తుతున్న విమర్శలు?

తిరుమలలో రాజకీయ ప్రసంగాలు నిషేధం. తిరుమల పవిత్రతను కాపాడడానికీ, అలాగే తిరుమల క్షేత్రంలో ఆధ్యాత్మిక వాతావరణానికి ఎలాంటి ఇబ్బందులూ ఎదురుకాకుండా ఉండడానికీ టీటీడీ ఈ నిబంధనను అమలు చేస్తున్నది. కోట్లాది మంది భక్తులు కుల, మత, రాజకీయ విభేదాలకు అతీతంగా శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వస్తుంటారు. అలా వచ్చే వారిలో సామాన్యుల నుంచి రాజకీయ, సినీ, వ్యాపార వర్గాలకు చెందిన వారు ఉంటారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చే వారిలో ఎవరి నేపథ్యం ఎలాంటిదైనా.. తిరుమల కొండపై అందరూ శ్రీవారి భక్తులుగా మాత్రమే మెలగాలన్న ఉద్దేశంతో తిరుమల గిరిపై రాజకీయ ప్రసంగాలు, వ్యాఖ్యలపై నిషేధం విధించారు.   టీటీడీ ట్రస్ట్ బోర్డు ఈ విషయాన్ని  స్పష్టంగా పేర్కొంది. ఆలయ ప్రాంగణంలో గానీ, మీడియా ముందు గానీ రాజకీయ వ్యాఖ్యలు చేసే వారిపై, వాటిని ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న హెచ్చరికలు సైతం జారీ చేసింది.  తిరుమలగిరిపై కేవలం “గోవింద నామస్మరణ” మాత్రమే ఉండాలన్నది టీటీడీ భావన.  అయితే మాజీ మంత్రి   రోజా ఆ నిబంధనలనూ, ఆంక్షలనూ తోసి రాజని తిరుమలలో రాజకీయ వ్యాఖ్యలు చేశారు.  జగనన్న మళ్లీ సీఎం కావాలని శ్రీవారిని తాను కోరుకున్నట్లు దర్శనానంతరం మీడియాతో చెప్పారు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తిరుమల కొండపై రోజా తన రాజకీయ ఆకాంక్షను మీడియా ముందు వ్యక్తపరచడం నిబంధనల ఉల్లంఘనేననీ, ఆమెపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది.   తిరుమలలో రాజకీయ వ్యాఖ్యలు చేయడం రోజాకు ఇదే మొదటి సారి కాదంటున్నారు. గతంలో అంటే రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోయిన తొలి రోజులలోనే తిరుమల కొండపై ఆమె చేసిన రాజకీయ వ్యాఖ్యలు దుమారం రేపాయి.  ఘోర పరాజయం తర్వాత కూడా ఆమె తీరులో ఎలాంటి మార్పు లేదని ఇష్టారీతిగా వ్యవహరించినా అడిగేవారు లేరన్న రీతిలో ఆమె తీరు ఉందని అంటున్నారు. టీటీడీ కేవలం హెచ్చరికలకు పరిమితం కాకుండా.. తిరుమలలో రాజకీయ వ్యాఖ్యలు చేసిన రోజాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. 

కేసీఆర్ ఆస్త్రసన్యాసమేనా?

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అస్త్రసన్యాసం చేసేశారా? ఆయన అసెంబ్లీ శీతాకాల సమావేశాల హాజరు ఇక ముగిసిపోయిందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. బీఆర్ఎస్ తరఫున అసెంబ్లీలో గళమెత్తేందుకు అధికారాలు అప్పగిస్తూ ఆయన చేపట్టిన నియామకాలను చూస్తుంటే ఔననే అనాల్సి వస్తోందంటున్నారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా మాజీ మంత్రి హరీష్ రావును కేసీఆర్ నియమించారు. అంతే కాదు.. అసెంబ్లీ, మండలిలో   పార్టీ గళాన్ని బలంగా వినిపించేందుకు  సీనియర్ నేతలకు బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలుగా బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకాల ద్వారా అటు అసెంబ్లీలో, ఇటు మండలిలో అధికార పక్షాన్ని దీటుగా ఎదుర్కోవాలని  దిశానిర్దేశం చేసినట్లయింది. అయితే అలా నియమించిన ఉప నేతలలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు పేరు లేదు.  అసెంబ్లీలో హరీష్ రావు తో పాటు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ లను డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా నియమించారు.   సభా వ్యవహారాలపై పూర్తి అవగాహన ఉన్న హరీష్ రావుతో పాటు, మహిళా, బీసీ సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని సబితా ఇంద్రారెడ్డి, తలాసానిలకు ఈ కీలక బాధ్యతలు అప్పగించారు. వీరు ముగ్గురూ సభలో పార్టీ పక్షాన కీలక అంశాలపై చర్చలలో పాల్గొంటారు. ఇక శాసనమండలిలో ఎల్. రమణ,  పి. సతీష్ రెడ్డిలను ఉప నేతలుగా నియమించారు. పార్టీ విప్ గా దేశపతి శ్రీనివాస్‌ను పార్టీ విప్‌గా నియమించారు. కేటీఆర్ కు ఎటువంటి బాధ్యతలూ అప్పగించకపోవడంపై పార్టీలోనే కాదు, రాజకీయవర్గాలలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అసెంబ్లీ లోపలా, బయటా కూడా అధికార కాంగ్రెస్ ను ఎదుర్కోవడంలో కేటీఆర్ వైఫల్యాల కారణంగానే ఆయనకు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా అవకాశం ఇవ్వకుండా పక్కన పెట్టారా? అన్న చర్చ జోరుగా సాగుతోంది. అది పక్కన పెడితే.. కేసీఆర్ ఇక ఈ సమావేశాలు హాజరయ్యే అవకాశాలు లేవనడానికి ఈ నియామకాలే నిదర్శనమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు నియామకం

  అసెంబ్లీలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలుగా (డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా) మాజీ మంత్రులు హరీష్ రావు, పటోల్ల సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను నియామస్తూ బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. శాసన మండలిలో, బీఆర్ఎస్ పార్టీ శాసనమండలిపక్ష ఉప నేతలుగా (డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా) ఎల్. రమణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిలను నియమించారు. మండలిలో పార్టీ విప్‌గా దేశపతి శ్రీనివాస్‌ని నియమించారు.  విప్ బాధ్యతలు సభలో సభ్యుల హాజరు, అధికార పార్టీ నేతల ప్రతిస్పందనలను సమీక్షించడం, పార్టీ విధానాలను అమలు చేయడం వంటి కీలక అంశాలను కవర్ చేయనున్నారు. కేసీఆర్ తన అసెంబ్లీ నాయకత్వానికి మద్దతుగా మధుసూదనాచారీని బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్‌గా కొనసాగించారు. శాసన పభ సమావేశాల్లో పార్టీ తొలి ప్రతినిధిగా మధుసూదనాచారీని కొనసాగించడం ద్వారా పార్టీ తీసుకునే ముఖ్యమైన నిర్ణయాల అమల్లో కీలకంగా మారనుంది.