అప్పులు కాదు అభివృద్ధి కావాలి!
posted on May 30, 2021 @ 1:24PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనకు రెండేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా వైసీపీ పాలనపై స్పందించారు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు. రెండేళ్లుగా ఏపీలో జరిగిన, జరుగుతున్న పరిణామాలను ఉదహరిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యూజిలాండ్లో టీడీపీ మహానాడు నిర్వహణలో భాగంగా వర్చువల్ పద్ధతిలో మాట్లాడారు చంద్రబాబు. రాజకీయ కక్ష కోసం తాను ఎన్నడూ ప్రయత్నాలు చేయలేదని చెప్పారు. అభివృద్ధి కోసమే నిరంతం తపించానని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం అరాచక పాలన సాగుతుందన్నారు. అభివృద్దినా గాలికొదేలిసి ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ అప్పులమయం చేశారని ఆరోపించారు. ఆర్థిక అసమానతలను తొలగించుకుంటూ పోవాలి.. అంతేగానీ, ఇష్ట ప్రకారం చేసుకుంటూ పోతానంటే అభివృద్ధి జరగదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఇలాంటి పరిస్థితులే కొనసాగుతున్నాయి.. అప్పులు చేసుకుంటూ పోతున్నారని అన్నారు. 'ఇలా చేసుకుంటూ పోతే భవిష్యత్తులో అప్పులు ఇచ్చే వారు కూడా కరవైపోతారు రాష్ట్రం దివాళా తీస్తుంది. ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా సంపద సృష్టించాలి. ఆ సంపదతో పథకాలను కొనసాగించాలి. కానీ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటువంటి పని చేయట్లేదు. అప్పులు చేసుకుంటూ వెళ్తోంది' అని చంద్రబాబు విమర్శల జల్లు కురిపించారు.
ఐటీని ప్రమోట్ చేయాలని ఆనాడు హైటెక్ సిటీకి రూపకల్పన చేశానని చెప్పారు చంద్రబాబు. అమెరికాలో తిరిగి భారత్కు రావాలని ఐటీ కంపెనీలను కోరాను.. మైక్రోసాఫ్ట్ ప్రతినిధులతో మాట్లాడానని చంద్రబాబు తెలిపారు. భారత్ లో ఐటీ రంగ అభివృద్ధికి ఉన్న అవకాశాలను వివరించి.. మైక్రోసాఫ్ట్ బ్రాంచ్ను హైదరాబాద్లో పెట్టాలని కోరానన్నారు. మైక్రోసాఫ్ట్ హైదరాబాద్కు వస్తే ప్రపంచంలోని అనేక ఐటీ కంపెనీలు అక్కడకు వస్తాయని భావించాను... అనంతరం అదే జరిగిందన్నారు చంద్రబాబు. అనేక ఐటీ కంపెనీలు హైదరాబాద్లో ఉన్నాయంటే గతంలో తాను చేసిన ప్రయత్నమే కారణమన్నారు.హైదరాబాద్లో అభివృద్ధిని ఎప్పుడు చూసినా తనకు చాలా సంతృప్తి కలుగుతుందన్నారు చంద్రబాబు. తన విజన్ వల్లే హైదరాబాద్లో ఇంజనీరింగ్ కాలేజీలు పెరిగాయని చెప్పారు.