మా డబ్బులు మాకివ్వరా?.. ఉద్యోగుల తిరుగుబాటు.. సీఎం జగన్కు డెడ్లైన్
posted on Nov 13, 2021 @ 10:37AM
జగన్ సర్కారును ఏపీ ఉద్యోగ సంఘాలు కుమ్మేశాయి. ఇన్నాళ్లూ ప్రభుత్వంపై సాఫ్ట్ వైఖరితో ఉన్నా.. ఎంతగా వేడుకున్నా.. పీఆర్సీ ఇవ్వకపోవడంతో ఉద్యోగులు ఒక్కసారిగా గుర్రుమన్నారు. సచివాలయం ముందు బైఠాయింపు.. కమిటీ మీటింగ్ బైకాట్తో హీట్ పెంచేశారు. తాజాగా మీడియా సమావేశం పెట్టి.. జగన్రెడ్డి ప్రభుత్వంపై ఓ రేంజ్లో మండిపడ్డారు. ఏపీలో మూడేళ్లలో ఉద్యోగుల సమస్యలు ఏ ఒక్కటీ పరిష్కారం కాలేదని ఏపీ ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏ మాత్రం నెరవేరలేదన్నారు.
‘‘మా డబ్బులు మాకు ఇచ్చేందుకు కూడా డబ్బుల్లేవా. మాటలతో కాలయాపనే తప్ప ఒరిగిందేమీ లేదు. పెండింగ్ బిల్లులు కచ్చితంగా ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పలేదు. పీఆర్సీపై ఆశలు పెట్టుకున్న వారికి నిరాశ మిగింది. ఈ నెలాఖరు వరకు ప్రభుత్వానికి సమయం ఇస్తున్నాం. ఆ తర్వాత ఉద్యమ కార్యచరణ ప్రకటిస్తాం’’ అని ఉద్యోగ సంఘ నాయకులు తేల్చి చెప్పారు.
‘‘సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చి మరిచారు. మంత్రుల కమిటీ.. అధికారుల కమిటీ అన్నారు. కమిటీలతోనే సరిపెట్టారు. నివేదికలు రాలేదు. కమిటీ నివేదికనూ ఆలస్యం చేస్తూ వచ్చారు. ఒక్క రోజు ఆలస్యం లేకుండా పీఆర్సీ ఇస్తామని చెప్పారు. 6 నెలల తర్వాత అధికారుల కమిటీ నియమించారు. కమిటీలన్నీ కాలయాపనకే తప్ప చిత్తశుద్ధి లేదు. ఏడు నెలల నుంచి ఏం అధ్యయనం చేశారు? సీఎంవో అధికారులు, సజ్జల ఇచ్చిన హామీలు తక్షణమే తేల్చాలి. హెల్త్ కార్డు అనారోగ్య కార్డుగా మారింది. డబ్బు పెట్టుకుని వైద్యం చేయించుకున్నాక రీయింబర్స్మెంట్ వచ్చే పరిస్థితి లేదు. రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.23కోట్లు ఉన్నాయి’’ అని ఏపీ రెవెన్యూ సేవల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మండిపడ్డారు.