లాయర్ ఫీజు 96 లక్షలా! జగన్ సర్కార్ పై హైకోర్టులో పిటిషన్
posted on Jun 6, 2021 @ 10:33AM
వడ్డించేవాడు మనవాడైతే అడగకుండానే అన్నీ విస్తట్లో పడుతుంటాయి.. ఈ సామెత ఆంధ్రప్రదేశ్ లోని వైపీసీ ప్రభుత్వానికి అతికినట్లు సరిపోయేలా ఉంది. తన అనుకున్న వారందరికి అప్పనంగా ప్రభుత్వ ఖజనా నుంచి డబ్బులు ముట్టచెప్పుతున్నారనే ఆరోపణలు మొదటి నుంచి వస్తున్నాయి. తాజాగా మరో విషయం వెలుగులోనికి వచ్చింది. న్యాయవాది ఫీజు కింద 96 లక్షల రూపాయలు ఇవ్వడం దుమారం రేపుతోంది. రూల్స్ కు విరుద్ధంగా ప్రభుత్వం దుర్వినియోగానికి పాల్పడిందంటూ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది.
సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్రెడ్డికి రూ.96 లక్షలు ఫీజుగా చెల్లించేందుకు పరిపాలన అనుమతి ఇస్తూ ఈ ఏడాది మే 24న ప్రభుత్వం జారీ చేసిన జీవో 239ని సవాలు చేస్తూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. ఏపీ న్యాయవాదుల రుసుముల నిబంధన-43 ఉల్లంఘించేదిగా ఆ జీవో ఉందని హైకోర్టు న్యాయవాది చింతల విజయ్కుమార్ తరఫున న్యాయవాది వై.కమలారాణి ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఆ జీవో చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించి, కొట్టేయాలని కోరారు. పురపాలక పట్టణాభివృద్ధిశాఖ కార్యదర్శి, ఆర్థికశాఖ కార్యదర్శి, అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథార్టీ(ఏఎంఆర్డీఏ) కమిషనర్, అడ్వొకేట్ జనరల్తో పాటు సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్రెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, ఏజీ ఎస్.శ్రీరామ్ను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. చట్టవిరుద్ధంగా ఖర్చుచేసే రూ.96 లక్షలకు ప్రతివాదులను బాధ్యులుగా ప్రకటించాలన్నారు పిటిషనర్. వారి నుంచి సొమ్మును రాబట్టాలన్నారు.
రాజధానిని అమరావతి నుంచి మార్చే శాసనాధికారం ప్రభుత్వానికి లేదంటూ ‘రాజధాని రైతు పరిరక్షణ సమితి’ దాఖలు రిట్ పిటిషన్, హెబియస్ కార్పస్ రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ల విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించినందుకు సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్రెడ్డిని నియమించుకుంది. ఆయనకు ఫీజు కింద రూ.96 లక్షలు చెల్లింపునకు జీవో ఇచ్చింది ప్రభుత్ంవ. అయితే హెబియస్ కార్పస్ రిట్ పిటిషన్ విచారణకు సీనియర్ న్యాయవాది నిరంజన్రెడ్డి హాజరు కాలేదని పిటిషనరు పేర్కొన్నారు. తక్కువ రుసుముకు రాష్ట్రం తరఫున వాదనలు వినిపించేందుకు సీనియర్ న్యాయవాదులు సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని గుర్తించడంలో అధికారులు విఫలమయ్యారన్నారు. ఈనెల 10న ఈ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది.