మందుబాబులకు గుడ్ న్యూస్.. తగ్గనున్న లిక్కర్ ధరలు
posted on Dec 18, 2021 @ 6:33PM
మద్యం విధానానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం పన్ను రేట్లలో మరోసారి మార్పులు చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసిందివ్యాట్, ఎక్సైజ్ పన్ను, ప్రత్యేక మార్జిన్ ల అంశంలో హేతుబద్ధత తీసుకువచ్చింది. పన్నుల హేతుబద్ధత ద్వారా మద్యం ధరలు తగ్గుతాయని ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఆదేశాలు జారీ చేశారు.
ప్రభుత్వ తాజా ఉత్తర్వులతో ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ బ్రాండ్లపై 5 నుంచి 12 శాతం ధరలు తగ్గే అవకాశముంది. ఇతర అన్ని కేటగిరీలపై 20 శాతం వరకు ధరలు తగ్గుతాయని అధికారులు చెబుతున్నారు. అక్రమ మద్యం, నాటుసారా తయారీ అరికట్టేందుకే ధరల తగ్గింపు చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. వచ్చేవారం నుంచి రాష్ట్రంలో ప్రముఖ సంస్థల బ్రాండ్ల మద్యం అమ్మకాలు జరుగుతాయని తెలిపారు. ప్రభుత్వ చర్యల వల్ల రాష్ట్రంలో 37 శాతం మద్యం వినియోగం తగ్గిందని రజత్ భార్గవ వివరించారు. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న అక్రమ మద్యం, నాటుసారా తయారీని అరికట్టేందుకు ధర తగ్గింపునకు నిర్ణయం తీసుకుంది. మద్యం ధరలను తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో మద్యం ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు