ఇద్దరు జడ్జీలను మార్చండి.. అమరావతి కేసుల్లో జగన్ సర్కార్ కిరికిరి
posted on Nov 15, 2021 @ 2:53PM
అమరావతి రాజధానిపై దాఖలైన పిిటిషన్లపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ మొదలైంది. అయితే జగన్ ప్రభుత్వానికి అమరావతి పిటిషన్లపై విచారణ సాగడం ఇష్టం లేనట్లుగా ఉంది. చాలా రోజుల తర్వాత విచారణ ప్రారంభమైతే వెంటనే.. ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తులపై ప్రభుత్వ లాయర్లు వ్యతిరేకత వ్యక్తం చేశారు. చీఫ్ జస్టిస్ కాకుండా ఉన్న ఇద్దరు న్యాయమూర్తుల్ని ధర్మాసనం నుంచి తప్పించాలని వాదనలు వినిపించారు. అయితే చీఫ్ జస్టిస్ మాత్రం రాజధాని పిటిషన్లకు ప్రాధాన్యం ఉందని.. ఆలస్యం కానీయబోమని స్పష్టం చేసి.. వారి విజ్ఞప్తిని తోసి పుచ్చారు.
ప్రభుత్వ లాయర్ల వాదనను చీఫ్ జస్టిస్ తిరస్కరించడంతో విచారణ ప్రారంభమయింది. రాజధాని పిటిషన్లు పరిష్కారం కాకపోవడంతో అభివృద్ధి ఆగిపోయినట్లుగా కనిపిస్తోందని చీఫ్ జస్టిస్ అభిప్రాయపడ్డారు. వేగంగా ఈ పిటిషన్లను పరిష్కరిస్తామన్నారు. హైబ్రిడ్ పద్దతిలో విచారణ జరిగింది. రైతుల తరపున శ్యాందివాన్ వాదనలు వినిపించారు.
ఇద్దరు న్యాయమూర్తులను తప్పించాలంటూ ప్రభుత్వ లాయర్లు వాదించడంపై తీవ్ర అభ్యంతరాలు వస్తున్నాయి. జగన్ ప్రభుత్వ లాయర్లు న్యాయవ్యవస్థను కించ పరుస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. బెంచ్ మార్చాల్సి వస్తే విచారణ వాయిదా వేస్తారని ఆ వ్యూహంతోనే ప్రభుత్వం ఇలా చేస్తోందని.. ఇదంతా న్యాయప్రక్రియపై ప్రజల్లో అనుమానాలను కల్పించే వ్యూహామని రాజధాని రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.