ఢిల్లీ ఎన్నికల ఫలితాలు విడుదల..గెలుపెవరిది..?
posted on Feb 11, 2020 @ 10:01AM
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఈరోజు ఉదయం ప్రారంభం కానుంది. మొత్తం డెబ్బై శాసనసభ స్థానాలకు ఓట్ల లెక్కింపును నిర్వహించనున్నారు ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే అధికారులు పూర్తి చేశారు. హస్తిన ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. శనివారం ఢిల్లీలోని డెబ్బై అసెంబ్లీ నియోజక వర్గాలకు పోలింగ్ జరిగింది, ఈరోజు మొత్తం ఇరవై ఒక్క కేంద్రాల్లో కౌంటింగ్ నిర్వహించేందుకు ఈ సీ పగడ్బందీ ఏర్పాట్లు చేసింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రత ఏర్పాట్లు చేసింది, మొదట బ్యాలెట్ పేపర్ ఓట్లను లెక్కిస్తారు, ఆ తర్వాత ఈవీఎం ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఎన్నికల సంఘం అధికారులు, పోలింగ్ ఏజెంట్ లు మాత్రమే కౌంటింగ్ కేంద్రం లోకి అనుమతిస్తారు. కౌంటింగ్ కు ఒక గంట ముందు అభ్యర్థి, పోలింగ్ ఏజెంట్ మాత్రమే కౌంటింగ్ కేంద్రంలోకి ప్రవేశించటానికి అనుమతిస్తారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద సిసిటివి కెమెరాలను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీలో మొత్తం డెబ్బై స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 672 మంది అభ్యర్ధులు పోటీ పడ్డారు. 58 జనరల్, 12 ఎస్సీ అభ్యర్థులకు కేటాయించారు, సీఎం కేజ్రీవాల్ పోటీ చేస్తున్న న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానానికి 26 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. ప్రధానంగా అధికార ఆమాద్మీ పార్టీ, బీజేపీ మధ్య ద్విముఖ పోరు నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ కూడా గట్టి పోటీ ఇచ్చింది.
2015 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 67 స్థానాల్లో గెలుపొంది చరిత్ర సృష్టించింది. బిజెపి మూడు సీట్లు గెలుచుకుంది, కాంగ్రెస్ ఖాతా తెరవలేదు.2015 లో 67శాతం పోలింగ్ నమోదు కాగా ఈసారి 62శాతానికి తగ్గింది. అత్యల్పంగా ఢిల్లీ కంటోన్మెంట్ లో 45.4శాతం పోలింగ్ నమోదు కాగా అత్యధికంగా బల్లిమారం నియోజకవర్గంలో 71.6 శాతం పోలింగ్ నమోదైంది. కాసేపట్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమై మధ్యాహ్నం లోగా ఫలితాలు వెలువడే అవకాశాలున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో జెండా ఎగరేసింది ఎవరనేది మరి కొన్ని గంటల్లో తేలనుంది. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ విజేత ఎవరో అంచనా వేసినా అధికారిక ఫలితాలొచ్చే వరకూ ఆగాల్సిందే. కేజ్రీవాల్ హ్యాట్రిక్ కొడతారని ఆప్ ధీమా వ్యక్తం చేస్తుంటే సంచలనాలు నమోదవుతాయని బీజేపీ ఆశలు పెట్టుకొంది.