దృష్టంతా పాలనపైనే పెట్టాలని కలెక్టర్ లకు సీఎం కేసీఆర్ ఆదేశాలు...
posted on Feb 11, 2020 @ 10:08AM
రాష్ట్రంలో ఇప్పట్లో ఎన్నికలు లేవు కాబట్టి ఇకపై దృష్టంతా పాలనపైనే పెట్టాలని కలెక్టర్ లకు సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇవ్వబోతున్నారు. అవినీతి లేకుండా ప్రభుత్వ పథకాలు ప్రజలకు సక్రమంగా అందించటమే లక్ష్యంగా పని చేయాలని సూచించనున్నారు. పల్లె ప్రగతిని సమీక్షించి పట్టణ ప్రగతి, వివిధ చట్టాల అమలుపై ఈరోజు ముఖ్యమంత్రి చర్చించనున్నారు. గత ఏడాది అక్టోబరు పదిన (అక్టోబర్ 10) జిల్లా కలెక్టర్ లతో ముఖ్యమంత్రి కేసీఆర్ జరిపిన మీటింగ్ కు ఇప్పటికీ చాలా మార్పులొచ్చాయి. 20 కి పైగా జిల్లాలకు కలెక్టర్ లు మారగా కొత్తగా పన్నెండు మంది కలెక్టర్లయ్యారు. జాయింట్ కలెక్టర్ల స్థానంలో ఎడిషనల్ కలెక్టర్ల వ్యవస్థ వచ్చింది. ఒక్కో జిల్లాకు ఇద్దరు అదనపు కలెక్టర్ లు ఉండనున్నారు, దీంతో సీఎం చేయనున్న మార్గ నిర్దేశనంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పల్లెప్రగతి లాగే త్వరలోనే పట్టణ ప్రగతి చేపడుతామని సీఎం ఇప్పటికే ప్రకటించారు. కాబట్టి కలెక్టర్ల సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగే అవకాశముంది, తేదీలను కూడా ఖరారు చేసే అవకాశముంది.
హరితహారం పైనా రివ్యూ చేసే అవకాశం కనిపిస్తుంది. కొత్తగా తీసుకొచ్చిన పంచాయితీ రాజ్, మున్సిపల్ చట్టాల అమలుపై కలెక్టర్ల సదస్సులో సీఎం మాట్లాడబోతున్నారు. కొత్త రెవెన్యూ చట్టంపై కూడా కలెక్టర్ల అభిప్రాయం తీసుకోనున్నారు. ఎడిషనల్ కలెక్టర్ల బాధ్యతలపై సీఎం స్పష్టత ఇవ్వనున్నారు. రాష్ట్రంలో దాదాపుగా అన్ని రకాల ఎన్నికలు ముగిశాయి కాబట్టి ఇక పూర్తి స్థాయిలో పాలనపై దృష్టి పెట్టాలని కలెక్టర్ లకు కెసిఆర్ సూచించనున్నారు. అక్షరాస్యత శాతం పెంచేందుకు కేసీఆర్ గతంలో ప్రకటించిన ఈచ్ వన్ టీచ్ వన్ పథకం పైన సమావేశంలో చర్చ జరగనున్నట్టు సమాచారం.