ఏపీలో పెరగనున్న విద్యుత్ చార్జీలు..!!


 

ఏపీలో విద్యుత్ ఛార్జీలు పెరగనున్నాయి, నెలలో 500 యూనిట్ లకు మించి విద్యుత్తును వినియోగించే వారికి యూనిట్ కు 90 పైసలు చొప్పున పెంచుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. గతంలో ఈ ధర రూ 9.05 ఉండగా ఇప్పుడు రూ 9.95 గా ట్యారిఫ్ నిర్ణయించింది. ఈ భారం కార్పొరేట్ సంస్థలతో పాటు రాష్ట్రంలోని 1,00,035 గృహ వినియోగదారులపై కూడా పడనుంది. విద్యుత్ పంపిణీ సంస్థలను నష్టాల నుంచి బయట పడేసేందుకు ఆంధ్రపదేశ్ లో కరెంటు చార్జీలు పెంచాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. ఏపీ తూర్పు విద్యుత్ పంపిణీ సంస్థ, దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థలకు 2020-21 సంవత్సరానికి గాను 14,349 కోట్ల ఆదాయం అవసరమవుతుందని అంచనా వేసినట్టు ఏపీఈఆర్ సీ చైర్మన్ సివి నాగార్జునరెడ్డి చెప్పారు. ఈ లోటును భర్తీ చేసేందుకే చార్జీల పెంపు నిర్ణయం తీసుకున్నామన్నారు. పెంచిన విద్యుత్ చార్జీల కారణంగా ప్రభుత్వ సంస్థలు కార్పొరేట్ సంస్థలపై పదమూడు వందలు కోట్ల భారం పడనుందని అధికారులు చెబుతున్నారు.

వినియోగదారులకు రాష్ట్ర ప్రభుత్వానికి 2893.48 కోట్ల ఆర్థిక భారం తగ్గిస్తూ రెండు పంపిణీ సంస్థల నికర లోటును 10,060.63 కోట్లుగా నిర్ధారించారు. రైతులు వినియోగించే విద్యుత్ కోసం 8358.58 కోట్లు సబ్సిడీ రూపంలో చెల్లించేందుకు అంగీకారం తెలిపారు. రాష్ట్రంలో 9,500 మిలియన్ యూనిట్ల మిగులు విద్యుత్ ఉందని అందుకే ప్రైవేట్ విద్యుత్ సంస్థల నుంచి విద్యుత్ కొనుగోలుకు అనుమతి నిరాకరించినట్లు అధికారులు తెలిపారు. ఈసారి వ్యవసాయ విద్యుత్ కోసం పక్కా ప్రణాళిక రూపొందించామని రైతులకు తొమ్మిది గంటల విద్యుత్ ఇస్తామని చెప్పారు. అయితే ప్రభుత్వ సబ్సిడీ పెరిగిందని, క్రమంగా సబ్సిడీని ఉపసంహరించుకునే మార్గాలను అన్వేషిస్తామని తెలిపారు. 

Teluguone gnews banner