ఎన్ని నీళ్లు తాగినా మళ్లీ మళ్లీ దాహం వేస్తోందా? కారణం ఇదే కావచ్చు..!
posted on Jan 22, 2025 @ 9:30AM
దాహం వేసినప్పుడు నీళ్లు తాగడం చాలా సాధారణం. అయితే కొందరికి ఎప్పుడూ దాహంగా అనిపిస్తూ ఉంటుంది. ఎన్ని సార్లు, ఎన్ని నీళ్లు తాగినా సరే.. దాహం తీరదు. ఈ పరిస్థితి ఏంటో అర్థం కాక చాలామంది గందరగోళానికి గురవుతూ ఉంటారు. శరీరంలో వేడి ఎక్కువ అవ్వడం వల్ల ఇలా జరుగుతుందని సమాధానం చెప్పుకుని కొందరు ఈ సమస్యను లైట్ తీసుకుంటారు. కానీ విపరీతమైన దాహం అనేది కొన్ని వ్యాధులకు సూచన అని, ఈ సమస్య వల్ల వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని అంటున్నారు. ఇంతకీ ఎప్పుడూ దాహంగా అనిపించడం సమస్య అవుతుందా? దీని వెనుక కారణాలు ఏంటి? ఇవి ఏ జబ్బులు కలిగిస్తాయి? తెలుసుకుంటే..
వేసవికాలంలో దాహం వేయడం సహజం. అయితే దాహం వేసినప్పుడు నీరు తాగితే దాహం తీరుతుంది. కానీ కాలంతో సంబంధం లేకుండా కొందరికి పదే పదే దాహం వేస్తూ ఉంటుంది. ఇలా తరచుగా దాహం వేయడం అనేది శరీరం ఎక్కువగా డీహైడ్రేట్ అవుతూందనడానికి సూచన.
మధుమేహం..
కొందరికి పదే పదే దాహం వేస్తూ ఉంటుంది. చాలామందికి తెలియదు కానీ ఇది మధుమేహానికి సూచన. ఎప్పుడూ గొంతు పొడిబారడం, దాహం వేయడం అనేవి రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల జరుగుతాయట. రక్తంలో అదనపు చక్కెరను తొలగించడానికి మూత్రపిండాలు చాలా కష్టపడాల్సి వస్తుంది. ఈ కారణంగా శరీరం నుండి ద్రవం ఎక్కువగా చెమట, మూత్రం రూపంలో బయటకు వెళ్లిపోతుంది. దీని వల్ల పదే పదే దాహం వేస్తుంది.
రక్తహీనత..
శరీరంలో తగినంత రక్తం లేకపోతే దాన్ని రక్తహీనత అంటారు. ఎర్ర రక్తకణాలు శరీరంలో తగినంత ఉత్పత్తి చేయబడవు. శరీరంలో రక్తం తక్కువగా ఉంటే శరీరం డీహైడ్రేట్ కు గురికావడం, పదే పదే దాహం వేయడం జరుగుతుంది. పొడి గొంతు సమస్య కూడా పెరుగుతుంది.
జీర్ణక్రియ..
వేయించిన ఆహారాలు, నూనెలో డీప్ ప్రై చేసిన ఆహారాలు, తీపి పదార్థాలు మొదలైనవి తిన్నప్పుడల్లా జీర్ణక్రియ పై ఎక్కువ ప్రభావం పడుతుంది. దీని వల్ల కడుపులో ఇబ్బంది ఏర్పడుతుంది. ఇదే పదే పదే దాహం వేయడానికి కారణం అవుతుంది.
*రూపశ్రీ.