ఓయూలో ఉద్రిక్తత, బాష్పవాయువు ప్రయోగం

ఉస్మానియా యూనివర్శిటీలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీయే అడ్డంకి అంటూ కాంగ్రెస్ నాయకులు దిష్టిబొమ్మతో ఓయూలో విద్యార్ధులు మరోసారి ఆందోళనకు దిగారు. పెద్ద ఎత్తున విద్యార్థులు ఆర్ట్స్ కళాశాల నుండి ర్యాలీగా బయలుదేరి వస్తుండగా ఎన్‌సీసీ యాదయ్య గేటు వద్ద పోలీసులు ర్యాలీని అడ్డుకున్నారు. బయటకు రాకుండా ప్రధాన ద్వారానికి తాళం వేశారు. దీంతో విద్యార్ధులు - పోలీసుల మధ్య వాగ్వాదం జరిగి ఉద్రిక్తతకు దారితీసింది. విద్యార్ధులు పోలీసులపైకి రాళ్ళురువ్వారు. దీంతో పరిస్థితిని అదుపులోకి తేచ్చేందుకు పోలీసులు బాష్పవాయును ప్రయోగించారు. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. విద్యార్ధులు రోడ్డు మీదకు రాకుండా గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. అలాగే అటుగా వెళ్లే బస్సులను దారి మళ్లించారు.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.