ఫీజు రీ ఇంబర్స్ మెంట్ గందరగోళం

ఫీజు రీఇంబర్స్ మెంట్ విషయంలో ఇంకా గందరగోళం కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం ఫీజుల విషయంలో నిర్ణయం తీసుకోకపోవడం, రీ ఇంబర్స్ మెంట్ వ్యవహారంలో స్పష్టత లేకపోవడం విద్యార్థులపాలిట శాపంగా మారింది. మంత్రివర్గ ఉపసంఘం ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. ప్రభుత్వ ఉదాసీన వైఖరే ఈ గందరగోళానికి కారణమంటూ విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఫీజుల రీ ఇంబర్స్ మెంట్ ని ఎగ్గొట్టేందుకు ప్రభుత్వం కొత్త ఎత్తుగడ వేసిందంటూ ఎస్.ఎఫ్.ఐ పెద్ద ఎత్తున ఆందోళన జరుపుతోంది. ఇంజినీరింగ్ ఫీజుల వ్యవహారంలో అమీతుమీ తేల్చుకునేందుకు  రాష్ట్ర ప్రభుత్వం కోర్ట్ గడపతొక్కింది. కోర్టు నిర్ణయం వెలువడేవరకూ ఈ గందరగోళం తప్పేలా కనిపించడంలేదని విద్యావేత్తలు అంటున్నారు. తమ పిల్లల చదువులతో ప్రభుత్వం ఆడుకుంటోందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సమావేశంలో మంత్రివర్గం ఉపసంఘం ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకుంటుందన్న ఆశతో చాలామంది ఎదురుచూస్తున్నారు.
 

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.