అరెస్టు చేయడం దుర్మార్గం: కోదండరాం

 

చంద్రబాబు పాదయాత్రకు నిరసన తెలియజేసేందుకు వెళ్ళిన తెలంగాణ రాజకీయ జేఏసీ నేతలు పొ. కోదండరాం, స్వామిగౌడ్, శ్రీనివాస్‌గౌడ్ తదితరులను జిల్లాలోని శాంతినగర్ వద్ద సోమవారం పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. జెఏసి నేతల అరెస్టును పలువురు తెలంగాణవాదులు అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్భంగా కోదండరామ్ నిప్పులు చెరిగారు. తమను అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. శాంతియుతంగా నిరసన తెలియజేయాలని తాము భావిస్తే అరెస్టు చేయడమేమిటని ప్రశ్నించారు. తెలంగాణపై టిడిపి వైఖరి చెప్పమని ప్రశ్నిస్తే తప్పేమిటన్నారు. తాము బాబు యాత్రను అడ్డుకుంటామని చెప్పలేదని, నిరసన మాత్రమే తెలియజేస్తామని చెప్పామన్నారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ జేఏసీ నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రోడ్డుపై బైఠాయించి ఫ్లకార్డులతో నిరసనలు తెలిపారు.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.