20
గోవిందరావు వ్రాశాడు: "ఎప్పటికీ ఈ అన్వేషణ ఫలించదేమో ననిపిస్తూందమ్మా! ఇంటిదగ్గిర నుండి బయలుదేరి ఇన్నాళ్ళయింది. ఉత్తర భారతదేశం దాదాపు పూర్తి కావస్తున్నది. అనుకున్నదేదీ ఫలించలేదు. మిగిలినవల్లా హిమాలయా పర్వతపాదాల్లో ఉన్న ప్రాంతాలు. అక్కడికి మరో వారంరోజుల్లో ప్రయాణం కడతాను.
నువ్వెలా ఉన్నావో? ఏ పరిస్థితిలోనూ మనస్తాపానికి అవకాశమివ్వకు. ఇప్పుడు కాకపోయినా మరొకప్పుడైనా నీ నిరీక్షణకు సత్ఫలితం ఉంటుంది.అందరినీ అడిగా నని చెప్పు...."
ఒక కార్డు మాత్రమే. ఆర్తి అస్పష్ట స్వరాన ఏదో గొణుగుకుని దాన్ని పేపర్ వెయిట్ కింద పెట్టింది.
ఆశ్రమాన్ని గురించి సిటీలో చాలామందికి తెలిసింది. ఈ మధ్యకాలంలో అక్కడ సంఖ్య పెరిగింది. సుమారొక అరవైమందిదాకా రకరకాల వృత్తులను నేర్చు కుని, మళ్ళీ ధైర్యంగా జీవించగలమన్న ఆశతో ఏ సమా జానికైతే వెరిచి వచ్చారో అందులోకే వెళ్ళారు. వారందరు ప్రతిరోజూ తమకు పునర్జన్మ కలిగించిన ఆశ్రమ నిర్వాహకులైన ఆర్తికి, కళ్యాణికీ ఎన్నో లేఖలు వ్రాస్తూంటారు. ప్రస్తుతం అందులో యాభై మందిదాకా ఉంటున్నారు. శిశువులుమాత్రం కొద్ది సంఖ్యలోనే ఉన్నారు. ఓ పదహారుమంది.
ఆ ఆవరణకు పడమటి కొసన కాంపౌండ్ గోడ నానుకుని పడమటి గేటుకు కుడిపక్కన ఒక చిన్న కృష్ణ మందిరం కట్టబడింది. మందిరమంటే రాయి, ఇటుక, సున్నం వగైరా ఏమీ లేవు. ఆరు వాసాలమీద వెయ్యబదిన గడ్డి ఇల్లు. చుట్టూ వెదురు తడికలకు రెండువైపులా బెత్తెడు మందాన మట్టి మెత్తి నున్నగా పేడతో అలికిఉంటుంది. వాటిమీద ఎర్రమన్ను పూతమీద తెల్లని సున్నంతో రకరకాల బొమ్మలు వెయ్యబడిఉంటాయి. ఈ కొసకు వచ్చి డిస్పెన్సరీ మీదగాని, గీతాభవనంమీదగాని, ఆశ్రమంపైనగాని నిల్చుని చూస్తే అది బొమ్మరిల్లులా ఉంటుంది.
దాని చుట్టూ క్రమంగా పెంచబడిన మొక్కలు మూడు వరసలుగా ఉంటాయి. లోపల మట్టితో చేసిన గద్ధెమీద గోపాలదేవుని సుందర విగ్రహం. ఆయన వెనకనే మేత మరిచి మోర ఎత్తి మురళిని వింటున్న గోమాత.
దానిముందు మూడు వేపచెట్లు వరసగా ఉన్నాయి. ఎడమవైపు చెట్టుకింద ఒక మట్టిగద్దెపైన నావ రాయి వేసి కట్టబడిఉంది.
ఇవన్నీ ఆశ్రమంలో చేరినవారు స్వయంసేవ, శ్రమదానం చేసి నిర్మించుకున్నారు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం అక్కడ ప్రార్ధనలు జరుగుతాయి. ఉదయం ప్రార్ధనాగీతం రాధ పాడుతుంది. సాయంత్రం సునీత.
ప్రతిరోజు సాయంత్రం విశ్వం, నీలకంఠం తప్ప కుండా వస్తారు. నీలకంఠం ప్రతిరోజూ ఏదో ఒకటి, ఆధ్యాత్మిక విషయాన్నో, కృష్ణ జీవితాన్నో, మహా భారతంలో విజ్ఞానాన్నో, వేదాల ఉద్దేశ్యాలనో చెబుతూ ఉండేవాడు. అప్పుడప్పుడు సునీత, ఆర్తికూడా చెబుతూ ఉంటారు. కల్యాణి అన్నీ మౌనంగా వినేది.
కరుణ, నిర్మల తరుచు వచ్చి పోతూంటారు.
ఒకవైపు కాలం రోజుల పేజీలు తిరగేస్తూనే ఉన్నది. మరొకవైపు కళ్యాణికి నెలలు నిండుతున్నాయి.
వేణులో స్వల్పమైన మార్పుకూడా ఆర్తి దృష్టి నుండి తప్పించుకోలేదు. ఉదయం మేలుకుని గదినుండి వచ్చేటప్పుడు చూస్తే కళ్ళు ఎర్రగా ఉంటాయి. కాస్త దీక్షగా చూస్తే, కనురెప్పలకింద అప్పుడే ఏర్పడుతున్న నలుపుదనం అవుపించకపోదు. సునీత అతనిలో మునపటి హుషారు కొంచెం లోపించినట్లు పసికట్టింది. నాలుగు గంటలయ్యేసరికి, కళ్ళలో ఎక్కడలేని అలసటా వ్యక్తమవుతుంది. పని కష్టంగా ఉందంటూ వెళ్ళి పోతుంటాడు కూడాను.
ఆగ్రహించినా, అనుగ్రహించినా ప్రజాకోటిలో ఆగ్రహానుగ్రహాలు మహా తీవ్రంగా ఉంటాయి. అందులో ఆంద్రమహాజనులు మరీను! అనుగ్రహమే కలిగితే ఆత్మబంధువులు సెబాసని వీపు తట్టడం దగ్గిరనించి, అందలమెక్కించి, అమూల్యమయిన కానుకలతో బిరుదులిచ్చి, కనకాభిషేకాలు చేయించగల ఉదారులు. ఆగ్రహమే వస్తే వీడొక పిచ్చివాడు అన్న మాటలనుండి, పదునైన తమ మాటలు, చేతల కరకు కత్తులనుండి ఉరిస్తంభంవరకు సాగనంపగల సమర్ధులు.
అటు గీతా శ్రమంపట్ల ప్రజల ఆదరణ పెరుగుతున్నది. చెయ్యగలవారు ఇతోధికంగా చేయూత నిస్తున్నారు.
ఇటు నీలకంఠానికి మంచి వైజ్ఞానిక రచయిత అన్న పేరు పాకుతుంది. అతను వ్రాసి తెస్తాడు పుస్తకాలు చదివి, సునీత సంస్కరించి పంపుతుంది. కరుణకూడా కొంత భాగస్వామ్యం వహిస్తుంది. ఎక్కువగా తెలుగువాటిని తీసుకుంటుంది కరుణ. మిగతా మూడు భాషల భారం సునీతది.
నీలకంఠం హిందీ అ ఆలు, ఉర్దూ అలీఫ్ బేలు నేర్చుకున్నాడు. చదవటం, వ్రాయటంగూడా కొద్దిగా పట్టుబడింది. ప్రచురించబడిన తన వ్యాసాలకు లభించే పారితోషికాలన్నీ ఆశ్రమ వినియోగానికే ఇచ్చేస్తూంటాడు. అతని పరధ్యానం కరుణ ప్రయత్నం వల్ల అంతగా ఉండటంలేదు. యాదగిరిలో అదె నిర్లిప్తత.
సునీత స్వంతంగాకూడా వ్రాస్తున్నది. వేణు ఈమధ్య ఆఫీసుపట్ల అశ్రద్ధ చేస్తున్నాడు. అన్ని రహస్యాలూ తెలిసింది కనక సునీతే ప్రతిదీ పూనుకుని చెయ్యవలసివస్తూంది.
'అజాగ్రత్త చేస్తే వ్యాపారం ఎంత హీనస్థితికి దిగజారుతుందో తెలపాలి' అన్న తలంపు సునీతకు కలిగింది. 'చెబితే ఊదేస్తాడు అలాగేనంటూ! ఈ దశాబ్దంలో వ్యాపార విధానాల్లో మార్పులు, సులభపద్ధతులు వివరిస్తూ ఓ వ్యాసం వ్రాయాలి.'
నీలకంఠాన్ని ఈ రెండు మూడేళ్ళలో ప్రచచురించిన పుస్తకాలు కామెర్సుకు సంబంధించినవి ఏవైనా యూనివర్శిటీ లైబ్రరీలో ఉంటే తెచ్చిపెట్టమన్నది. అతను యూనివర్శిటీనుండేగాక, స్టేట్ లైబ్రరీనుండి కూడా రెండు పుస్తకాలు తెచ్చాడు. ఆమధ్య ఎప్పుడో పత్రికలలో పాశ్చాత్యులు వ్రాసిన ఆంగ్లవ్యాసాలు ఉంటే ఇంట్లో ఉన్న పాతపత్రికలు వెతికి తీసింది. అన్నీ ముందువేసుకుని నీలకంఠం సలహాలమీద ఒక వ్యాపార సంబంధమైన వ్యాసాన్ని తయారుచేసింది.
దాన్నికూడా తన పేరుమీద పంపుతుందేమోనని ఈసారి వాటిని తనే పోస్టు చేశాడు నీలకంఠం.
ఈ పత్రికలూ పుస్తకాలేకాక, గోవిందరావు కంపెనీలో పని చేసిన అనుభవము, తను నిత్యం టైపు చేసే ఉత్తరాలు, రీకాపీలు, గోవిందరావు చెప్పిన బండగుర్తులు అన్నీ ఆమెకు పనికివచ్చాయి.
ఆ వ్యాసం పదిరోజులు తరవాత ప్రచురించ బడింది. స్థానికాంగ్ల దినపత్రికలో, విజయవాడనుండి వచ్చే తెలుగు పత్రికలో రెండురోజుల తేడాతో ప్రచురించబడింది.
నీలకంఠం సాయంత్రం ఆశ్రమానికి వచ్చినపుడు వేణుకు బాకా ఊదేశాడు ఒంటరిగా ఉన్నపుడు. ఆరాత్రే ఇంటికి వచ్చిన పత్రికలో చూశాడు వేణు. వాణిజ్యం అని పేరు పెట్టబడిన దానిలో వర్తకం, దాని పుట్టుపూర్వోత్తరాలు, స్వదేశీ విదేశీ వ్యాపారాల్లో తేడాలు, పోలికలు, లోటుపాటులు లాభనష్టాలు, తత్సంబంధమైన రకరకాల పన్నుల గొడవలు అన్నీ వివరించబడ్డాయి.
ఆఫీసులో ఆమెను అభినందించాడు. "చాలా బావుంది, నీతా. నేను దాన్ని చదివిస్తంభించిపోయాను. ఆ పద్ధతులు బావున్నాయి. వాటిలో చాలా కొద్ది మాత్రమే నాకు తెలుసు. మిగతావన్నీ ఎమ్. కామ్ వాళ్ళ సిలబస్ లో ఉంటాయి."
"నీలకంఠం గారు యూనివర్శిటీ నుంచి గ్రంథాలు తెచ్చారు. యాదగిరి బాబాయి ఒకప్పుడు వ్యాపారం చేశారట. తను అనుభవాలు చెప్పారు."
"మొత్తంమీద నాకు తట్టని స్వల్ప విషయాలు నీకు తట్టాయి. మరిచిపోబోతున్న ప్రాథమిక విషయాలు జ్ఞప్తికి తెచ్చావు. బి. కామ్. పాసయినా నేను సిగ్గు పడుతున్నాను."
"ఆడమ్మాయిలా..."
"అప్పుడు నువ్వు మగబ్బాయివవుతావు!"
* * *
యాదగిరిలో పశ్చాత్తపంతోబాటు మితభాషిత్వం ఎక్కువైంది. కరుణ, నీలకంఠం ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. కరుణ సునీతను ఎప్పుడూ పరాచికంగా "అత్తా!" అని పిలుస్తూంటుంది.
ఆర్తి సునీతతో, కళ్యాణితో తప్ప మరెవరితోనూ అంతగా మాట్లాడటంలేదు. వాళ్ళిద్దరితోనైనా ఓ పావుగంట. సునీత పత్రికలకు వ్రాస్తుందని ఆమెకు ఎరుక అయింది. కానీ పూర్వంలా ఎక్కువసేపు మాట్లాడలేదు. అది తెలిసినప్పుడు. కళ్ళు సగం మూసుకుని, "పాపా, నాకు ఎంతో ఆనందకరమైన వార్త! కానీ....కానీ.....నేనెక్కువగా మాట్లాడలేనమ్మా..." అనిమాత్రం అంది. ఆమెకు సారథి చింత ఎక్కువైంది. మరొక నెల ఆగితే కళ్యాణి ప్రసవిస్తుంది.
నిండుకుండ లాంటి సునీతతో ఏ మార్పూ లేదు. ఎప్పటిలా కాళ్ళకు ఎరుపురంగు చెప్పులు, ఖద్దరు చీర, తప్పనిసరిగా నుదుట కుంకుమ, సముద్రతరంగాల్లా గాలికి ఎగిరిపడుతున్న వెంట్రుకలు, నిర్మలమైన దృష్టులు, స్వచ్చమైన ఉచ్చారణ, నిరాడంబరంగా ఉండే ఆమె అలంకరణా అలాగే ఉంది.
ఆమెను తరుచు నీలకంఠం ఇలా నిర్వచిస్తూంటాడు: "అందము, చదువు ఉండీ, ఏదో సాధించాలన్న అత్యాశకు వెళ్ళి పతనంకాక, ఎన్నో విషకీటకాల బారినుండి తనను తాను రక్షించుకుంటూ, ఎవరూ వేలెత్తి చూపని విధంగా రోజులు నెట్టుకొస్తూన్న ఆమె జీవితం అన్నపదానికి ప్రతినిధి, ఒంటరిబ్రతుకు, ఏకాకి అన్న మాట లకు ఆమె చెప్పినట్లు సరియైన అర్ధం మరెవరు చెప్పలేరు. దైనందిన జీవితంలో నిరంతర సంఘటనల, సంఘర్షణల మూలంగా రాటుదేలిన ఆమె హృదయం ఆవేశాలకూ ఉద్రేకాలకూ అతీతం."
రోజూ గడియారం ముళ్ళలా సాగిపోయే ఆమె కార్యక్రమం చూస్తాడు కనక, "యంత్రాలైనా తమ పనిని మరుస్తాయేమోగానీ, సునీత పదకోశంలో మరుపు అన్నది లేదు. అమెముందు ఎమ్. ఎ., పిహెచ్ . డి. ఎందుకూ పనికిరాదు. లోకజ్ఞానం ఆమె కెక్కువ. మొదటి మాటలోనే ఎదుటివాళ్ళను చదివేస్తుంది" అంటాడు.
యాదగిరికి ఆమెను చూస్తే అపస్వరభరితమైన గతం కళ్ళముందుకు వస్తుంది.
వేణు ఈమధ్య ఆమెతో మరీ సన్నిహితంగా ఉంటున్నాడు. ఆశ్రమానికి వచ్చిన నిర్మల రెండు మూడు సార్లు అది చూసి అనుమానపడింది. మళ్ళీ తనకెందు కని ఊరుకుంది.
రాధ-ఆమెదంతా అదొక లోకం. ఎవరెంత చనువుగా ఉన్నా వాళ్ళ స్నేహం ఎటువంటిదో తెలుసు కనక, పట్నవాసాన్ని సునీత శిక్షణతో బాగా ఆకళింపు చేసుకున్నది కనక పట్టించుకోలేదు. వేణు విషయంలో ఆమెకు అనుమానం లేదు. చిన్నప్పటినుంచీ మామయ్య కలుపుగోలు మనిషని, వ్యాపారస్థుడు నలుగురిలో తిరిగేవాడు ఎలా ఉండాలో అలా ఉంటున్నాడని అనుకుంటుంది. తన చిన్నారి ప్రేమ సామ్రాజ్యానికి ఆమె రాణి, వేణు రాజు. ఇంకా ఈ రకమైన అనుమానాలు విషవలయాలు ఆమె చుట్టూ ముసురుకోలేదు.
ఎటుబడీ అందరిని లోతుగా ఎరుగున్నవాడు విశ్వం ఒక్కడే. రోజుల్లో కనిపిస్తున్న ఈ ప్రశాంతత, నిర్లిప్తత అతనికేదో భయోత్పాతం కలిగించుతూ ఉంటాయి అప్పుడప్పుడు.
వేణులో మార్పుకు కారణం ఆచూకీ తియ్యబడింది.
పనిమనిషి ఇల్లు అంతా తుడుస్తున్నది. చాలా రోజులయిందని రాధే స్వయంగా దగ్గిరఉండి చేయి స్తున్నది. పదిన్నర అయింది. వేణు, ఆర్తి అంతకు ముందే వెళ్ళారు.
వేణు గది వంతు వచ్చింది. బెడ్ షీట్ దులుపు తూంటే వాసనేదో గుప్పున కొట్టింది. పనిమనిషి నడిగింది, "ఏదో వాసనవెయ్యటం లేదూ?" అని.
రోజూ దాన్ని దులిపివేసేటప్పుడు పనిమనిషికి ఆ వాసన వస్తూనే ఉంటుంది. పెద్దవాళ్ళ రహస్యాలతో జోక్యం కల్పించుకుంటే పొట్టకోసం సంపాదించుకున్న ఆ పని కాస్తా ఊడుతుందని ఎక్కడా అనలేదు. దిండు కవర్లమీద మరీ ఎక్కువగా ఉంటుందా వాసన. అదే చెప్పలేక చెప్పింది.
"ఏమిటది? తలనూనె వాసన అలా ఉండదు."
పనిపిల్ల కొంగు అడ్డంపెట్టుకుని కిసుక్కున నవ్వింది. ఎందుకు నవ్వావో చెప్పమని రాధ ఒత్తిడి చేసింది.
"గీవాసన బ్రాంది కుంటది. మా అయ్య సార తాగుతడు. పెద్ద పెద్దోల్లు, డబ్బున్న మారాజులు దీన్ని తాగుతరు."
