ఏమని చెబుతుంది? తన చర్యను ఎలా సమర్ధించుకుంటుంది? గురివేంద గింజలా అక్క తన ప్రవర్తన చూసుకోకుండా నన్ను తప్పు పడుతున్నాదని శాంత అసహ్యించుకోదా? ఈ విషయం ప్రకాశం వరకూ వెళితే?అమ్మకు, అన్నయ్యకు తెలుస్తే?
"తెలిస్తే ఏం? నువ్వు ఆడదానివి కావా? నీది మనిషి జన్మ కాదా? నీ జీవితమంతా ఇలాగే సన్యాసినిలా గడుపుతానని ఎవరికైనా మాటిచ్చేవా? ఎందుకంత భయం?" మనసు ధైర్యం చెప్పేది.
శాంత పక్కగా లేని ఇటువంటి అవకాశం తిరిగి ఇంత తొందర్లో రాకపోవచ్చు. ఒకసారి మనసు విప్పి మాట్లాడుకొన్నాక ఎవరు తమ మధ్య ఉన్నా మరి ఫరవాలేదు అనుకొన్నది జానకి. అతడు అంతలో మాట ఆపివేస్తాడేమో అని భయపడింది.
"మరి, మీ ఇష్టం ఏమిటి, గోవిందబాబూ?" అని ప్రశ్నించింది అత్రతగా.
అతడు జానకి ముఖంలోకి పరీక్షగా చూసేడు. జవాబు చెప్పాలని నోరు తెరిచేడు.
జానకి ఒళ్ళంతా చెవులు చేసుకొని, అతడు చెప్పబోయే మాట వినేందుకు సిద్దంగా ఉంది.
గాలి దుమారంలా వచ్చి పడింది శాంత.
"గోవిందబాబూ! నేను పరీక్ష పాసయ్యేను. సెకెండ్ డివిజన్" అంటూ అతని చేతులు పట్టుకొని ఉత్సాహంగా ఊపేయసాగింది.
శాంత అతని చేతుల్లో వాలిపోతుంటే , అతనే ఆపినట్లు అనిపించింది జానకికి. క్షణ కాలం ఆమె మనసు అగ్నిపర్వతం పగుళ్ళలోంచి ప్రవహించే లావాలా ఉడికి పోయింది.
అంతలోనే చెల్లెలి భవిష్యత్తు , మంచి చెడ్డలు చూసే అక్కగా మారిపోయింది.
"చాలా సంతోషం, శాంతా! కంగ్రాచ్యులేషన్సు" అన్నాడు గోవిందబాబు.
"ఎంత చల్లని కబురు చెప్పేవు, శాంతా! ఈరోజు కోసం ఎంతగా ఎదురు చూసేను?" అన్నది జానకి ఆప్యాయంగా.
గోవిందబాబు చేతులు వదిలి అక్కను కౌగలించుకొంది శాంత. "ఇందంతా నీ దయ వల్ల జరిగిందక్కా! ఆనాడు అభిమానంతో నువ్వు నా పక్క నిలవబట్టి కాని, లేకుంటే ఈసరికి రోడ్ల మీద కుక్కలా తిరగవలసిన గతి పట్టి ఉండును నాకు. లేక ఏనాడో మట్టిలో కలిసి పోయి ఉందును." శాంత కళ్ళలో నీళ్ళు తిరిగేయి.
"ఛా పిచ్చి పిల్లా! శుభంగా పరీక్ష పాసై ఎవరైనా ఏడుస్తారా? పద, ప్రకాశానికి చెప్పి వద్దాం" అంది జానకి.
"ఉదయం నుండి ఎండలో తిరుగుతున్నాను. ముఖం తిరుగుతున్నట్లున్నది. నువ్వు వెళ్ళిరా, అక్కా! నా కాళ్ళు లాక్కుపోతున్నాయి" అన్నది శాంత.
ఒక్కసారిగా జానకి ఉత్సాహం చల్లబడిపోయింది. తను ఒంటరిగా పోయేందుకు ఆమె మనస్సు ఇష్టపడలేదు. "పోనీలే . రేపు వాడే వస్తాడు" అన్నది.
"అలా కాదక్కా! పరీక్ష పోతుందేమోనన్న భయంతో అన్నయ్య కి నా నంబరైనా ఇయ్యలేదు. ఈ రోజు రిజల్టు వచ్చేయని తెలుస్తుంది. శాంత పరీక్ష పోయి ఉంటుంది. అందుకే చెప్పలేదు - అనుకొంటాడు. ఒక్కసారి వెళ్ళిరా, అక్కా. ఎంతసేపులో వెళ్ళి వచ్చేస్తావు?"
ఈ విషయంలో శాంత అంత బ్రతిమాలు కోవలసిన అవసరం ఉందా? అని ఆలోచిస్తూనే జానకి గుమ్మం కదిలింది.
"పదండి, పదండి. నేనూ మీ వెనకే వస్తున్నాను. ఇద్దరు, ముగ్గురు పిల్లలకి ఒంట్లో నలతగా ఉందని ఆయా ఇంతకీ పూర్వమే చెప్పింది. వాళ్ళని చూసి వస్తాను." అన్నాడు గోవిందబాబు.
మెయిన్ గేటు దాటేవరకూ వెనక్కు తిరిగి తిరిగి చూస్తూనే ఉంది జానకి.
* * * *
సుఖ దుఃఖాలు, మంచి చెడ్డ అనుభూతులు కాలంతో కలిసి పలచబడి పోతాయి. వాటి జ్ఞాపకాలు మాత్రమే మనిషికి మిగులుతాయి. ఆ జ్ఞాపకాలకు మనిషిని పట్టి నిలపగలిగే శక్తి ఉండదు. ఆ కారణం గానే ఒకనాటి ఆప్తమిత్రులు విడిపోవడానికి, విరోధుల మధ్య శతృత్వలు చల్లబడ్డానికి అవకాశాలు ఏర్పడతాయి.
గడిచిన కాలంలో, ఆర్ధికమైన ఇబ్బందులు సూర్యారావు అహంభావాన్ని, ఓ మెట్టు కిందికి దింపేయి. డబ్బు గడించుకొంటూ నిలకడగా జీవనం వెళ్ళదీస్తున్న చెల్లెలితో విరోధం పెట్టుకొంటే, తనే నష్టపోయేడని తెలుసుకొన్నాడు. తన కోపతాపాలకు వెరిచే స్థితిని తోడబుట్టువులు దాటి పోయేరని గురించేడు. తమ సంసారం పిల్లలు ఉన్నవాడు; వాళ్ళు ఒంటరి వాళ్ళు. వాళ్ళ అవసరం ఏదో విధాన తనకు ఉంటుంది. అనవసరంగా స్పర్ధలు పెంచుకొని, అభిమానాల్ని పోగొట్టుకొడం మంచిది కాదనుకొన్నాడు.
ఈ అభిప్రాయానికి రాగానే జానకికి ఉత్తరం రాసేడు. అటు తరువాత కూడా అయిందింట, పదింట ఉత్తరాలు రాస్తూనే ఉన్నాడు. ప్రతి ఉత్తరం రమారమి ఒకే రకమైన సమాచారాన్ని మోసుకొస్తూ ఉండేది. ఆర్ధికమైన ఇబ్బందులు, అనారోగ్యాలూ , ఆవేదనలు, భయాలు.....
ఇదేనా మానవ జీవితం? దీని కోసమేనా మనిషి బ్రతుకుతున్నది? తను ఏనాటికీ చేరుకోలేని గమ్యాన్ని ఊహిస్తూ, పడుతూ, లేస్తూ పరుగులు తీస్తూ, జీవిత పర్యంతం ఉరుకులు, పెడుతూ నడిచి, నడిచి ఏదో నాడు అలిసిపోయి కన్ను మూయ్యడమేనా?
ఆదిమధ్యాంతాలలో మానవుడు అందుకొంటున్న జీవితం ఇదేనా? దీని కోసమేనా ఈర్ష్యలు, కావేషాలు, అహంకార విరోధాలు పెంచుకోడం? ఆఖరికి అందరూ సాధించేది, అంతులేని ఆవేదన మధ్య కూరుకు చవడమేనా? అనుకొనేది జానకి.
అవసరాలకు అంతో ఇంతో అదుకొంటున్న పెద్ద చెల్లెలు జానకి తో రాజీపడినా, చిన్న చెల్లెలు శాంత ను క్షమించ లేకపోయాడు సూర్యారావు. తను వ్రాసే ఉత్తరాలతో, అసలు శాంత అన్న పిల్ల తమ కుటుంబంతో ఉన్న భావమే లేనట్లు వ్రాసేవాడు. ఈ పరిస్థితి జానకికి కష్టమనిపించేది. అన్నయ్య దగ్గిరి నుండి ఉత్తరం అనగానే శాంత అందుకొని చదివేది. అంతా పూర్తిగా చదివి అక్క చేతిలో పెట్టి నెమ్మదిగా వెళ్ళిపోయేది.
"అక్కా! అన్నయ్యకి, ఇంక ఎప్పటికీ నామీద కోపం పోదా?' ఆనేది.
"మనుషుల అభిమానాల్ని కొందరు డబ్బుతో కొలవగలరు, శాంతా! నువ్వూ ఉద్యోగం చేస్తూ ఆర్ధికంగా పై మెట్టులో ఉంటె నీ ఉనికిని అన్నయ్య గుర్తించవచ్చు" అని జవాబు చెప్పేది జానకి.
శాంత బి.ఎస్. సి పాసైన సంగతి అన్నకు వ్రాసింది జానకి. దీనితో అన్నయ్య కోపం చల్లబడవచ్చు అనుకొంది. అతని దగ్గిర నుండి వెంటనే జవాబు వచ్చింది. మొదటి పంక్తి లోనే "నీ చెల్లెలు పరీక్ష పాసైనందుకు సంతోషం" అని ఉంది.
పిచ్చి అన్నయ్య! తను కాదనుకొన్నంత మాత్రాన శాంత తన చెల్లెలు కాకుండా పోతుందా? మాటతో మాసిపోయే అనుబంధమైతే, ఇవి ఏనాడో తెగిపోయి ఉండేవి. చేతితో చెరుపు'కొంటె పోయేందుకు ఇది మసి బొట్టు కాదు, పచ్చ బొట్టు-- అనుకొన్నది.
మిగిలిన ఉత్తరం అంతా తమాషాగా వ్రాసేడు సూర్యారావు. అప్రస్తుతం అయిన అనేక విషయాలు వ్రాస్తూ "ఏదో ఆఫీసు పని మీద మీ అత్తవారి గ్రామం వెళ్ళవలసి వచ్చింది. ఆ గ్రామ కరణం రాజారావు అవడం వల్ల నా బస వారింట్లోనే ఏర్పాటయింది. ఆ రోజంతా నన్నెంతో ఆదరం తో చూసేడు. ఊళ్ళో అతనికి మంచి పలుకుబడి ఉంది. ఆస్తి పాస్తులు మంచి, మర్యాద....దేనికీ కొదవ లేదు" అని అంతవరకు వ్రాసి, ఇంకో విషయం జత చేసేడు. మూడు నెలల క్రిందట అతని భార్య పోయింది. తల్లీ, తండ్రి అంతకు పూర్వమే కాలం చేసేరుట. పాపం.... పిల్లలతో ఇబ్బంది పడుతున్నాడు-- అని సానుభూతి చూపెడు.
ఈ విషయాలన్నీ తనకు అన్నయ్య ఎందుకు వ్రాసి నట్లా అని ఆలోచించసాగింది జానకి. తన నిర్ణయం ఏనాడో అన్నకు తేల్చి చెప్పిందే! మళ్ళా ఈ ప్రస్తావన ఎందుకు తెచ్చినట్లు? లేక శాంత నిస్తే బాగుంటుందని అన్నయ్య అభిప్రాయమా? శాంత వంటి పిల్ల ఆ పల్లెటూరిలో ఆ పిల్లల తండ్రితో కాపురం చేస్తుందనే?
అవసరం కొద్ది చాటుగా వచ్చి, తనతో అయిదు నిమిషాలు మాట్లాడినందుకు భార్యను అనుమానించి, అవమానించిన ఘనుడు.... ఇప్పుడు.... ఒకసారి ఇంట్లోంచి లేచి పోయిందనే నిందను మోస్తున్న శాంతను చేసుకొంటాడనే? ఇది అర్ధం లేని ఆలోచన -- అనుకొంది జానకి.
శాంతను ఎమ్. సి చదివించాలి. లేదా ఉద్యోగంలో పెట్టాలి. దానికి అనువైన వరుణ్ణి అదే వెతుక్కొంటుంది అనుకొంది. ప్రకాశం కూడా అక్క ఆలోచన బాగుందన్నాడు. శాంత ఎమ్.సి చదువుతానంటే తాను కొంత సొమ్ము సాయం చేస్తానన్నాడు.
