గోవిందబాబును స్టేషను లో ఎదుర్కొని స్వయంగా తీసుకు వచ్చింది జానకి. అతన్ని చూడగానే ఆమెకు వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్లు అనిపించింది. తన బతుకు గురించి, బాలవిహార్ పిల్లల గురించి వేధిస్తున్న భయాలన్నీ పరుగులు తీసేయి.
"మీరోచ్చేరు, గోవిందబాబూ! నా భయాలన్నీ తొలగి పోయేయి. ఇంక అన్నీ మీరు చూసుకొంటారు" అన్నది స్వేచ్చగా ఊపిరి పీలుస్తూ.
"మీరు రమ్మని అజ్ఞాపించేక రాకుండా ఉండగలనా?" అన్నాడు.

నిజంగా తన మాట మీద గోవిందబాబుకు ఇంత గురి ఉన్నదా? అని అతని వైపు పరీక్షగా చూసింది. "ఏమిటలా చూస్తున్నారు? ఇక్కడి నుంచి వెళ్ళేక చిక్కి పోయానంటారా కొంప తీసి?..... ఇంట్లో కాలు పెట్టగానే మావాళ్ళంతా , ఏమిటి రా ఇలాగై పోయేవు? అక్కడ తిండి తిప్పలు సరిగా లేనా? అని ఒకటే ప్రశ్నలు. వాళ్ళ ఉద్దేశంతో ఇప్పుడిప్పుడే కోలుకొంటున్నానుట. మళ్ళా అక్కడి కెందుకురా? అని అడ్డు పుల్లలు వేసేరు. ఈసారి నా బరువు బాధ్యతలు వహించింది కో అమ్మాయి ఉందమ్మా. పూర్వం లా చిక్కిపోయి రాను; దుక్కతన్ని వస్తాను-- అని హామీ ఇచ్చి వచ్చెను. మరెలా చూస్తారో? మీదే పూచీ...." అన్నాడు గోవిందబాబు నవ్వుతూ.
ఇదివరలో గోవిందబాబు మాట్లాడే తీరుక, ఇప్పటి ,మటలకు ఏదో తేడా ఉన్నట్లు అనిపించింది జానకికి. చనువుగా తను రమ్మని ఉత్తరం వ్రాయడం వల్ల అతను కూడా చనువు తీసుకొని మాట్లాడుతున్నాడనుకొంది. అతని మాటలు ఆమెకు ఏవగింపు కలిగించలేదు. సరదాగా వినాలని పించింది.
దారి పొడుగునా నోరు ముయ్యకుండా అతను వెళ్ళేక బాలవిహార్ లో వచ్చిన మార్పుల్ని, ఆ మానేజరు చేస్తున్న అవకతవకల్ని వర్ణించి చెప్పింది జానకి. ఆ ముసలాయన చర్యల పట్ల అనసూయమ్మ చూపుతున్న నిర్లిప్తతను విమర్శించింది. ఆఖరి మాటగా, "గోవిందబాబూ! ఇప్పుడు మీరు రాకుంటే నేనిక్కడి ఉద్యోగం మానుకు పోవాలను కొన్నాను" అని పూర్తీ చేసింది.
గోవిందబాబు రాక తనకు ముందుగా తెలిసినట్లు, అతనికి స్వాగతం పలికెందుకు సిద్దంగా చావిట్లో కూర్చున్న అనసూయమ్మను చూసి ఆశ్చర్య పోయింది జానకి.
ఏపాటి ఆశ్చర్యం చూపకుండానే "వచ్చేవా, గోవిందూ! నీ మాటే అనుకొంటున్నాను" అన్నది అనసూయమ్మ.
గోవిందబాబు ఆమె మాటకు జవాబు చెప్పకుండా, "జానకీ, ఒక గ్లాసుతో నీళ్ళు తెచ్చి పెట్టగలరా?" అన్నాడు.
జానకి లోపలికి వెళ్ళింది.
"నీ ఉత్తరం అందింది, అక్కయ్యా! వెంటనే బయలుదేరాను. అంతకు పూర్వమే ఇక్కడి పరిస్థితుల్ని వివరిస్తూ జానకి రాసిన ఉత్తరం అందింది. నేను తన ఉత్తరం పైనే వచ్చెనని ఆమె అభిప్రాయపడుతున్నది" అన్నాడు గోవిందబాబు.
జానకికి బాల విహార్ పట్ల ఉన్న శ్రద్దా సక్తులకు అనసూయమ్మ సంతోషించింది. గోవిందబాబు ఆమెను ఎందుకిలా మభ్య పెడుతున్నాడో ఊహించుకొని చిన్నగా నవ్వుకొంది.
జానకి గ్లాసుతో నీళ్ళు తెచ్చింది. ఒకసారి గ్లాసును పెదవులకు తాకించి పక్కన పెట్టేడు గోవిందబాబు.
"నీ ఉత్తరం చూసి గోవిందబాబు వచ్చేడుట, జానకీ! చాలా మంచి పని చేసేవమ్మా! మళ్ళా గోవిందు ఈ బాధ్యత స్వీకరించడం నాకెంతో హాయిగా ఉంది. దీన్ని మీ ఇద్దరూ చల్లగా నడుపుకు పోగలరు" అన్నది ఆవిడ సంతృప్తిగా.
జానకి వెళ్ళిపోయేక అనసూయమ్మ ద్వారా బాలవిహార్ కు సంబంధించిన అనేక విషయాలు తెలుసుకొన్నాడు గోవిందబాబు. మరునాడు స్వయంగా వెళ్ళి చూసి వచ్చేడు. అతను వెళ్ళిన తరువాత కొన్ని మార్పులు జరిగిన మాట నిజమే. అవి మంచి ఫలితాలకు దారితీయక పోయినా మాట కూడా వాస్తవమే. అంతమాత్రం చేత బాలవిహార్ సంస్థ చిన్నాభిన్నం అయిపోయే ప్రమాదం లేదు. జానకి భయపడినంతగా ముంచుకు వచ్చిన ముప్పేం లేదు.
ముసలాయన మనస్తత్వం వేరు. దందనతో పిల్లల్ని, చేతి కింద పని చేసేవారిని అదుపులో ఉంచి, వారిచేత సక్రమంగా పనులు చేయించవచ్చని అతని అభిప్రాయం. దెబ్బకు దెయ్యం దడుస్తుందని అతని భావం. దెబ్బలకు దెయ్యాలు దడుస్తాయేమో కాని, చిన్న పిల్లాలు దడుసుకోరు. మొండి కేస్తారు. పనివాళ్ళు లొంగిరారు. తిట్టుకొంటారు.
అతడు తన దండన నీతిని అమలులో పెట్టడం వల్ల, ఆటు పిల్లలకు, ఇటు నౌకర్ల కు రాక్షసుడి లా కనిపించేవాడు. అంతకు ముంచిన లోపం అతనిలో లేదు. కాని అటువంటి మనస్తత్వం కలవాళ్ళు బాలవిహార్ వంటి చిన్న పిల్లల సంస్థలలో పని చెయ్యడానికి పనికి రారు-- అనుకొన్నాడు గోవిందబాబు.
ముసలాయన చేసిన పనికి ధన్యవాదాలు అందచేస్తూ గౌరవ పురస్పరంగా కోంత డబ్బిచ్చి అతన్ని సాగనంపింది అనసూయమ్మ. "మళ్ళా మీ అవసరం ఎప్పుడున్నా తెలియజేస్తాను" అన్నది.
అతడు సంతోషం గానే వెళ్లిపోయేడు.
శాంత పరీక్షలు వ్రాసి వచ్చి రెండు నెలలైంది. ఫలితాల కోసం ఆత్రతగా ఎదురు చూస్తున్నది జానకి.
"మీ చెల్లెలి కంటే మీకే ఆత్రతగా ఉందే!' అన్నాడు గోవిందబాబు.
"బరువు బాధ్యతలు మోస్తున్నవాళ్ళకి ఆత్రత ఉండడం సహజం, గోవిందబాబూ!"
"భారమనిపించుకొంటున్న వారికీ మాత్రం ఆత్రత ఉండదంటారా? సాధ్యమైనంత త్వరలో తమ భారం తగ్గించాలనే తాపత్రయం లేకుండా పోతుందా?"
'అటువంటి ఆలోచన శాంతకి వస్తే అది గొప్ప విషయమే. దాని మనసులో అది నాటుకుందో లేదో అనే నా బెంగ. ఎవరో ఒకరు తన బాధ్యత వహిస్తూ , అవసరాలు చూస్తుంటే, కలలలో, ఊహలలో తేలిపోతూ , తేలిగ్గా జీవితం గడిపి వేయాలనే తరహాకి చెందింది శాంత. తన కాళ్ళ మీద తను నిలబడాలనే కోర్కె గాని, కష్టించి పని చేయడంలో ఉన్న విలువ కాని దాని మనసులోకి రావు. అదృష్టవంతుల జీవితాలకి ఈ ఆశలు ప్రతిబంధకాలు కావు. కాని మీలాటి....."
"మీకేం తక్కువయింది , జానకీ! హాయిగా ఉద్యోగం చేసుకొంటున్నారు; స్వేచ్చగా బ్రతుకుతున్నారు. ధనవంతుల మనుకొంటున్నవాళ్ళు మాత్రం ఏ వేదన లేక సుఖపడి పోతున్నారా? వాళ్ళకి తగిన బాధలు వాళ్ళకీ ఉంటాయి.
"నా మాటే తీసుకోండి. ఇంట్లో నే నోక్కడ్నే మగపిల్లాడిని. నా ముందు వాళ్ళకి, తరవాత వాళ్ళకి కూడా పెళ్ళిళ్ళయి అత్తారి ఇళ్ళలో ఉన్నారు. ఎంత కాలం ఇలా బ్రహ్మచారి గా తిరుగుతావు; మన అంతస్తుకి తగిన పిల్లని పెళ్ళి చేసుకొని, హాయిగా, దర్జాగా బ్రతకరా-- అంటుంది అమ్మ, నాన్నగారికి నాతొ పాటు ఆ పల్లెల్లో తిరిగి , చేదోడు, వాదోడు గా ఉండగలిగే పిల్లని నేను చేసుకొంటే మంచిదని అభిప్రాయం. ఇంక నా ఇష్టం అంటారా?....."
జానకి, అతని వాక్యం పూర్తీ కావడం కోసం ఎదురు చూస్తున్నది. ఆమె గుండె వేగంగా కొట్టు కొంటున్నది. శరీరమంతా ప్రవహించిన వేడి, గాడ్పులా చెవుల్లోంచి బయటికి వస్తున్నది.
అతను చెప్పబోయే మాట ఆమె ఊహించుకొన్నది. కాని ఇంతవరకు అతని నోట ఆ మాట వినలేదు. ఈ రోజు వినబోతున్నది. ఈసారి వచ్చినప్పటి నుంచి అతని చర్యలు ఆ మాటకు బలం కలిగిస్తున్నాయి. నెల రోజులుగా ఏ నిమిషాన ఆ మాట వినబడుతుందో అని గుండెను అదిమి పట్టుకొని, చెవులను విశాలం చేసుకొని ఎదురు చూస్తున్నది.
అనేక సమయాల్లో పెదవుల చివరికి వచ్చిన ఆ మాటను అతను తిరిగి మింగేసేడు. అధమం ఆమెకు అలా అనిపించింది. ఈ ఒక్క విషయంలోనే ఆమె అతన్ని అర్ధం చేసుకోలేక పోతున్నది. ధైర్యం చేసి ఆ ఒక్కమాట అతను ఎందుకు చెప్పలేక పోతున్నాడు? పక్క, పక్క సీట్ల లో కూర్చుని సినిమా చూస్తున్నప్పుడు , చెయ్యి, చెయ్యి తాకినంత దగ్గిరగా చిరు వెలుగులో షికార్లు చేస్తున్నప్పుడు, ఎదురు బోదురుగా లాన్ లో కూర్చుని గంటల తరబడి మాట్లాడుకొంటున్నప్పుడు , తన హృదయంలోకి తొంగి చూడాలన్న ఆకాంక్షతో , తన చూపుల్లోని తలపులు గ్రహించాలనే తలపుతో, అంత దగ్గిరగా, అంత పరిశీలనగా చూస్తాడే? .... అప్పుడు అతనికి తన గుండె చప్పుడు వినిపించలేదా? కళ్ళలో భావం ప్రతిఫలించలేదా? మనసులో మాట తెలిసి రాలేదా?,.... ధైర్యంగా మనసులోని మాట చెప్పగలిగిన మగవాడు అతనే జంకు తుంటే.... ఇద్దరి పెదవుల వెనక ఈ మాట ఇలా బందీగా నిలిచి పోవలసిందేనా? దీని కోసం.... జీవిత పర్యంతం తను నిరీక్షించవలసిందేనా?--- అనుకొన్నది.
జానకి ధైర్యాన్ని కూడగట్టుకోన్నది. అతడు ఇప్పుడు కూడా చెప్పలేకపోతే తను అడిగి తెలుసుకోవాలనుకొంది. ఇదివరలో ఆమెకు ఈ తెగింపు వచ్చే సమయాలు లేకపోయేయి. అన్ని చోట్ల వారితో పాటు శాంత ఉండేది. తమతో పాటు శాంత లేకపోతె బాగుండు ననుకోనేది జానకి. కాని శాంతకు అ ఆలోచనే లేకపోయేది. ఆమె ముందరే అతన్ని రాసుకు పూసుకు తిరిగేది. తుళ్ళుతూ, నవ్వుతూ మాట్లాడేది. అక్క పక్క నున్న విషయమే మరిచి అతనితో కబుర్లలో పడేది.
శాంత మాటలను నాగస్వరానికి తలయెత్తిన పాములా చెవులు రిక్కించుకొని వినేవాడు గోవిందబాబు. ఒక్కొక్క రోజు జానకికి శాంత అంటే ఈర్ష్య పుట్టుకొచ్చేది. తమ ఇద్దరి మధ్య ఉన్న స్నేహం తెలిసి కూడా శాంత పానకంలో పుల్లలా ఎందుకు తయారవడం? ఈసారి స్పష్టంగా చెప్పేయాలి. నువ్వు గోవిందబాబుతో అలా పూసుకు తిరగడం బాగాలేదని చెప్పాలి. పరాయి మగాడితో అంత చనువు పనికి రాదని కూక వెయ్యాలి-- అనుకునేది జానకి.
"నువ్వు అతనితో చనువుగా ఉండటం లేదా? నీకు మాత్రం అతడు పరాయి వాడు కాడా? అతని దగ్గిర పని చేస్తున్నంత మాత్రాన షికార్లకి, సినిమాలకి అతనితో తిరగాలని ఉందా? నాకు బుద్ది చెబుతున్నావు. ముందు నీ సంగతి చూసుకో" అని శాంత ఎదురిస్తే?
