ఆ వాళ పండగనాడు అతను అంత చిన్న విషయానికే అంత గొడవ ఎందుకు చేశాడో కళ్యాణి కి ఎంత ఆలోచించినా అర్ధం కాలేదు 'అడుగడుగునా, అయిన దానికీ, కానీ దానికీ చిరాకు పడటం అది అయన తత్త్వం కావాలి. చేతనయితే దాన్ని వోర్చు కోటం లేకపోతె బాధపడటం అంతే నేను చేయగలిగింది.' అనుకుంది కళ్యాణి.
తనలో ఏదో ఆవేదన, మరేదో రవ్వంత అసూయ ఇంకేదో అసహనమూ ఇవన్నీ ఎక్కడివో మారుమూల దాగి వుండి మధ్య మధ్య తలఎత్తి తమ వునికిని చాతుకుంటాయి అని మురళీ కి కూడా స్పష్టంగా తెలియదు.
* * * *
సాయంకాలం అయిదు గంటల వేళ-- గేటు తెరచుకుని హుషారుగా అడుగులు వేసుకుంటూ లోపలికి నడిచి యింటి తలుపులు తట్టాడు మురళీ.
కళ్యాణి పలకటం 'ఆ వస్తున్నా' అని చెప్పటం ఏమీ వినిపించలేదు కాని. కొన్ని క్షణాల తరువాత తలుపులు తెరుచుకొన్నాయి. తెరిచినా తలుపుల కెదురుగా ఒక్క క్షణం నిలబడి భర్త కళ్ళల్లోకి ఒక్కసారి ఎలాగో చూసి చటుక్కున లోపలికి వెళ్ళిపోయింది కళ్యాణి.
'తల దువ్వుకోలేదు-- చీర మార్చుకోలేదు-- మొహం కడుక్కోలేదు-- పైగా ఇప్పటి దాకా యేడ్చి యేడ్చి ఇప్పుడు గబగబా కళ్ళు తుడుచుకు వచ్చినట్లు ఎర్రటి జ్యోతుల్లాంటి కళ్ళు. చెంపల నిండా కన్నీటి చారికలు-- మరొక్క క్షణం ఇక్కడ నిలబడి, నోరు మెదిపి మాట్లాడబోతే దుఃఖం పొంగి వస్తుంది అన్నట్లు అలా గబుక్కున లోపలికి వెళ్ళిపోవటం ఏమిటిది? కళ్యాణి ఎందుకిలా వుంది?' అనుకొంటూ ఖంగారుగా, కాలి జోళ్ళయినా విప్పుకోకుండా గబగబా లోపలికి వెళ్లాడు మురళీ.
మౌనంగా కన్నీళ్లు వోడుస్తూ కిటికీ లోంచి బయటకు వస్తున్న కళ్యాణి అడుగుల చప్పుడు విని తల తిప్పి చూసి, కొంగుతో చెంపలు అద్దుకుంటూ తలగడ క్రింది నుంచి ఉత్తరం తీసి ఇచ్చింది.
'కళ్యాణి ని యింతగా బాధించి దుఃఖ పెట్టగలిగే ఈ వుత్తరం ఏమై వుంటుందీ ?' అనుకుంటూ ఆసక్తిగా, ఆందోళనగా అది అందుకుని కళ్యాణి ప్రక్కగా మంచం మీద కూర్చుని గబగబా కవరు లోంచి కాగితం పైకి తీశాడు.
'చిరంజీవి సౌభాగ్యవతి కళ్యాణి ని ఆశీర్వదించి మీ అమ్మ వ్రాయునది!
అ మొదటి వాక్యం చదువుతుంటే నే అతని మొహం ఎలాగో అయిపొయింది. ఉత్తరం పూర్తిగా చదవ కుండానే మడత పెట్టి కళ్యాణి చేతికి యిచ్చేద్దామని పించింది. కాని అందులో ఏముందో తెలుసుకోవాలనే కుతూహలాన్ని అణచు కోలేక అదోవిధంగా మొహం చిట్లించు కుంటూ ఆ తరువాయి చదవటానికి వుపక్రమించాడు.
'అక్కడ నువ్వూ అల్లుడు గారు, పాపా అంతా క్షేమంగా వున్నారని తలుస్తాను. ఇంక మా సంగతి -- ఈ మధ్య కొన్నాళ్ళుగా నా ఆరోగ్యం ఏమీ బాగుండుట లేదు-- అదే పోతుందిలే అని కొన్నాళ్ళు మందు తినటం కూడ అశ్రద్ధ చేశాను-- తరువాత మామయ్యా బలవంతం మీద డాక్టరు కి చూపించాడు ఇప్పుడు మందులూ ఇంజక్షన్లూ తీసుకుంటున్నాను-- అయినా, ఏమిటో నా ఆరోగ్యం కుదుట బడుతుందని , నేను ఎప్పటిలా లేచి తిరుగుతాననీ నాకెందుకో నమ్మకం కలగటం లేదు. అయితే చావుకీ నేను భయపడటం లేదు. పుట్టిన ప్రతి మనిషీ ఎప్పుడో అప్పుడు చావవలసిందే కదా-- మరి అలాంటప్పుడు చావుని తలచుకుని భయపడటం ఎందుకు? నేను పెంచి పెద్ద చేయాల్సిన పసివాళ్ళు లేరు నాకు ఎవరి కోసమూ దిగులు లేదు. కాని నాకు మిమ్మల్నందరినీ ఒక్కసారి తృప్తిగా కరువు దీరా కంటి నిండా చూసుకుని మనసారా ఆశీర్వదించాలానే నా కోరిక తీరుతుందంటావా తల్లీ. అల్లుడు గారు పాపిష్టి దాని మొహం చూడటానికి అంగీకరిస్తారా? నీ చిట్టీ తల్లిని ఒక్కసారి నా చేతులలోకి తీసుకొని గుండెలకి హత్తుకొని ముద్దు పెట్టుకునే అదృష్టం నాకు కలిగించలేవా? నీ తల్లి కడసారి కోరిక తీర్చవా? మీరు ఎన్నాళ్ళో ఇక్కడ వుండక్కర లేదు. ఒక్కరోజు, ఒక్క పూట నా కళ్ళ యెదుట వుండి వెళ్లి పోదు రు గాని-- తప్పకుండా మీరంతా వస్తారని యెదురు చూస్తుంటాను. పాప పుట్టినప్పటి నుంచీ మీ దగ్గరికీ రావాలనీ మిమ్మల్నందర్నీ చూడాలనీ యెంతగా అనిపించినా ఆరోగ్యం బాగులేకనే ఇల్లు కదల లేక పోయాను-- ఇంకా నా కోరిక తీర్చే బాధ్యత నీదే...'
చదవటం పూర్తీ చేసి మాటా పలుకూ లేకుండా ఉత్తరం మడిచి కళ్యాణికి అందిస్తుంటే అతని మొహంలోని భావాలని అర్ధం చేసుకో గలిగినా వుండబట్టలేక అడిగింది-- 'ఒక్కసారి వెళ్దాం' అని.
'నేనూ రావాలా?' మురళీ గొంతు వెటకారంగా ఏవగింపుగా నిర్లక్ష్యంగా అనేక రకాలుగా అర్ధం అయింది కళ్యాణికి. 'నీకు మతి వుండే మాట్లాడుతున్నావా? నేను ఆ ఇంట్లో అడుగు పెట్టగలనని యెలా అనుకుంటున్నావు?' అన్నట్లు న్నాయి అతని చూపులు.
ఆ చూపులని తప్పించుకునెందుకు తల వంచుకుని 'అసలు జబ్బేమిటో వ్రాయనే లేదు. అంది కళ్యాణి తనలో తను అనుకుంటున్నట్లు.
'వ్రాయటాని కేముంది? అలాటి వాళ్ళకి వచ్చే జబ్బులన్నీ ఒక్కటే--' మురళీ సమాధానం విని త్రుళ్ళీ పడింది కళ్యాణి.
'మా వాళ్ళ పట్ల ఈయనలో ఇంత ద్వేషమూ కసీ ఉన్నాయా. ఈయన అన్న మాటలకి అర్ధం ఏమిటి? వయస్సులో ఒళ్ళు మరచి అన్ని సుఖాలు అనుభవించిన వాళ్లు చివరకు రోగాలతో కుళ్ళి చచ్చి పోతారనా . మరి నీతిగా పవిత్రంగా బ్రతికిన వాళ్ళకి అసలీ చావే రాదనా? హు....ఆ మాటల్లో ఎంత నిర్లక్ష్యం.? నేనేం నా తల్లిని వెనకేసుకుని రావటం లేదు.. వారు అన్న దాంట్లో అసత్యం యేమీ లేకపోవచ్చు....అయినా....ఆమె ఎలాంటి దయినా నన్ను కన్న తల్లి....ఇప్పుడు చావు బ్రతుకుల మధ్య వుండి, నన్నూ నా బిడ్డనీ కడసారి చూడాలని వెర్రిగా ప్రాధేయ పడుతూ, లేని శక్తి తెచ్చుకుని వుత్తరం వ్రాసింది....తల్లిని చూసి రావాల్సిన బాధ్యత నాకు లేదా? నీ జబ్బు పాపోష్టిది నువ్వు పాపిష్టి దానివి అని చెప్పి నిర్లక్ష్యం చెయ్యనా...ఒక్కసారి వెళ్లి చూసి వస్తాను-- ఆయన్ని కూడా రమ్మని ప్రాధేయ పడతాను...' అనుకుంటున్న కళ్యాణికి మరో ఆలోచన వచ్చింది.
'ఆ ఇంట్లో ఆ వాతావరణం లో వారు ఒక్క రోజు కాదు ఒక్క గంట కాదు ఒక్క క్షణం అయినా వుండగలరా? ఉహు, వద్దు....నాకోసం ఇంత చేసిన మనిషిని ఇంకా ఇంకా ఏదో చెయ్యమని అడగటం, చివరికి ఆ యింటికి కూడ రమ్మనటం భావ్యం కాదు-- వారు రానన్నారని అసలు నేను బాధపడటం లో అర్ధం లేదు.' అనుకుని, 'పాపని తీసుకుని నేను వెళ్తాను' అంది.
'నీ ఇష్టం , నా అభ్యంతరం ఏమీ లేదు.' అన్నాడు మురళీ పొడిగా.
అతను మనస్పూర్తిగా ఆ మాట అనలేదని అర్ధం చేసుకున్న కళ్యాణి అప్పటికి మరేమీ అడగకుండా వూరుకుంది.
కాని కాస్సేపటి తరువాత మురళీ యే అన్నాడు. 'ఏదో వెళ్ళాలి అని ఖంగారు పడటమే కాని ఆ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేవు నువ్వు-- అక్కడ జేరిన పదిమంది నిన్నో వింత మృగాన్ని చూసినట్లు గుచ్చి గుచ్చి చూస్తోంటే అసలు నీకు వూపిరి సలుపుతుందా అని.'--
మురళీ గొంతులో తను ఇబ్బంది పడిపోతుందేమో అన్న ఆదుర్దా ఆ అభిమానం వ్యక్తం కాలేదు కాని అదొక లాంటి విరుపు ''ఆ దిక్కుమాలిన కొంపలో నువ్వు కాలు ఎలా పెడతావు?' అన్న ఈసడింపు వున్నదని పించింది కళ్యాణి కి. అయినా పైకి ఏమీ అనాలనిపించలేదు.
మురళీ వెళ్లి కాళ్ళు కడుక్కు వచ్చే సరికి కాఫీ పట్టుకొచ్చింది. 'ఇవాళ తిఫినేం చెయ్యలేదు' అతని కి గ్లాసు అందిస్తూ.
'ఫర్వాలేదు లే....' అని వోసారి కళ్యాణి ముఖం వంక చూసి, 'నువ్వు వెళ్ళదలుచు కుంటే వెళ్ళు. నాకిష్టం లేదని అనుకోకు' అన్నాడు.
కళ్యాణి మౌనంగా తల వూగించింది.
అది వెడతానని చెప్పటమో వెళ్ళటం లేదని చెప్పటమో మురళీ కి అర్ధం కాలేదు--
అసలు కళ్యాణి వో నిశ్చయానికి రాలేక పోతోంది.
'వారికి ఇష్టం లేదని స్పష్టంగా తెలుస్తూనే వుంది . అలాంటప్పుడు నేను వెళ్ళటం జరిగితే వారికి కోపం వస్తుందేమో....అసలే వారి మనస్సు ఏమిటో ఒక్కొక్కసారి అది ఎంత దారుణంగా మారిపోతుందో బొత్తిగా అంతు పట్టడం లేదు నాకు-- అలాంటప్పుడు వారి ఇష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ఈ ఇంట్లో మళ్లీ కలతలూ గొడవలూ ఏమైనా వస్తాయేమో ...మరి అమ్మా....ఆమెని ఇప్పుడు వెళ్లి చూడకపోతే జీవితంలో ఇంక చూడటమే పడదేమో,' కళ్యాణి బుగ్గల మీదికి కన్నీళ్లు జారిపడ్డాయి. 'నాకు తెలుసు. నేను మళ్లీ ఆ యింటికి వెళ్ళటం అంటే వాళ్లతో రాకపోకలు సంబంధం పెట్టుకున్నట్లే అని అది వారికి తలవంపులు తెస్తుందనీ వారి అభిప్రాయం -- వారి భార్యగా వారి అభిప్రాయాలకి విలువ ఇవ్వాల్సిన బాధ్యత నాకు లేదా .....మరణ శయ్య మీద వుండి కడసారి చూపు కోసం ప్రాధేయ పడుతున్న కన్నతల్లి ఆరాటం తీర్చాల్సిన బాధ్యత మాత్రం నాకు లేదా .....ఇస్, అబ్బా -- భగవంతుడా ఏమీటీ విషమ పరీక్ష . నేనిప్పుడెం చెయ్యాలి' అనుకుంటూ బుగ్గని చెయ్యి ఆనించుకుని అలాగే కూర్చుండి పోయింది.
'ఈ రాత్రి ట్రైను కి వెళ్తావా-- సామాను అదీ సర్దుకో' అని అనాలనుకున్న మురళీ నాకెందుకు ఆ గొడవ అన్నట్లే వూరుకున్నాడు.
'ఇవాళ వెళ్తాను. రేపు ఒక్క పూట అక్కడ వుండి మళ్లీ వెంటనే రైలెక్కి వచ్చేస్తాను.' అని అడగాలనుకున్న కళ్యాణి మూగబోయిన అంతర్యం నోరు మేదపనివ్వలేదు.
ఆవాళ గడిచిపోయింది. మర్నాడూ గడిచి పోయింది. ఆ మూడో నాడు కళ్యాణి మరి వుండ బట్టలేక వో వుత్తరం వ్రాసి పడేసింది. ఆ సమాధానం చూసుకుని ఇక ఏమైనా సరే వెంటనే బయలుదేరాలని నిశ్చయించు కుంది-- ఆ తరువాత నాలుగు రోజులు గడిచి పోయాయి. ఆ నాలుగు రోజులూ ఏ పూట కాపూట తన వుత్తరానికి జవాబు వస్తుంది తల్లి పరిస్థితి ఎలా వుందో తెలుస్తుంది అని ఆత్రంగా పోస్టు కోసం ఎదురు చూడసాగింది కళ్యాణి.
ఇవాళ వెళ్తానంటుందేమో, రేపు వెళ్తా నంటుందేమో అనుకుంటూ ఏరోజూ కారోజు సందిగ్ధంగానే గడిపాడు మురళీ.
ఆవాళ సాయంకాలం ఆఫీసు నుంచి త్వరగా వచ్చేశాడు మురళీ. ఇద్దరూ ఏమో ఖబుర్లు చెప్పుకుంటూ పాప 'ఆ, ఊ,'అంటూ ఖబుర్లు చెప్తుంటే వింటూ కూర్చున్నారు. ఇంతలో 'పోస్టు' అన్న కేక వినిపించి గబుక్కున లేచి వెళ్ళింది కళ్యాణి.
కళ్యాణి,
నీ వుత్తరం అందింది. అమ్మ కి ఎలా వుందో వెంటనే వ్రాస్తే నువ్వు వస్తానని వ్రాశావు. అంటే, ఇంక ఆశ లేదు అన్న పరిస్థితి వస్తే వచ్చి చూడాలని నీ వుద్దేశ్యం కాబోలు-- నిజమేలే, లేకపొతే మాలాంటి వాళ్ళ ఇళ్ళకి నువ్వు వూరికే ఎందుకు వస్తావు-- నువ్వు ఇప్పుడు చాలా గోప్పదానివి నీకు సంఘంలో గౌరవం, పేరూ, హోదా అన్నీ వున్నాయి. మాలాంటి వాళ్ల ఇళ్ళకి వస్తే మైల పడిపోతావు. అందరు నిన్ను తక్కువగా చూస్తారు. పోనీ , నీ గొప్ప నీ దగ్గరే వుంచుకో....నువ్వు వస్తావు అని ఆఖరి క్షణం దాకా ఎదురు చూసిన అమ్మకి నీ వుత్తరం మాత్రం అందింది. అంతే చాలు. ఆ తృప్తయినా ఆవిడికి మిగిలింది....నీకు మళ్లీ వుత్తరం వ్రాయటానికి గాని, టెలిగ్రాం ఇవ్వటానికి గాని వ్యవధి లేకుండా ఈమధ్యహ్నమే అమ్మే కన్ను మూసింది--
ఇట్లు -
