Previous Page Next Page 
వసుంధర కథలు-1 పేజి 41


                                     5

    "సిమెంటు దొరకలేదండి-" అన్నాడు అల్లాఉద్దీన్.
    "ఎంత డబ్బైనా ఫరవాలేదు చెప్పానుగా...." అన్నాడు షేక్ మహమ్మద్ హుస్సేన్.
    "చెప్పారనుకోండి. కానీ మనక్కావలసినంత ఎక్కడా దొరకడం లేదు...."
    షేక్ మహమ్మద్ హుస్సేన్ ఆ నగరంలో సుమారు ఇరవై లక్షలదాకా ఖర్చుపెట్టి ఒక బ్రహ్మాండమైన భవనం కట్టించాలనుకున్నాడు. అలాంటి కంట్రాక్టు న్యాయంగా జగన్మోహనరావుకే వెళ్ళాలి. జగన్మోహనరావు ఆ ఊరికి పెద్ద కంట్రాక్టరు మాత్రమేకాక-అక్కడున్న చిన్న పెద్ద కంట్రాక్టర్లందరికీ అతను మకుటంలేని మహారాజు. చాలామంది చిన్న కంట్రాక్టర్లకతను ఆర్ధికంగా సాయం కూడా చేస్తూంటాడు.
    హుస్సేన్ కి జగన్మోహనరావుమీద నమ్మకంలేదు. తనకతను అన్యాయం చేయగలడని భయంవుంది. అందుకని అతను పొరుగూరిలోని ఓ ముస్లిం కంట్రాక్టరుని రప్పించాడు. ఈ విషయం జగన్మోహనరావుకి తెలిసింది. తన పలుకుబడినంతా వినియోగించి అతనికి ఎక్కడా సిమెంట్ దొరక్కుండా చేశాడు.
    "ఎక్కడా దొరకదంటావా?" అన్నాడు హుస్సేన్ సాలోచనగా.
    "జగన్మోహనరావు దగ్గరయితే....."
    "నోర్ముయ్...." అన్నాడు హుస్సేన్.
    అల్లావుద్దేన్ నోరు మూసుకున్నాడు. కానీ హుస్సేన్ ఆలోచనలు జగన్మోహనరావు చుట్టూ తిరుగుతున్నాయి. అతను బాగా ఆలోచించి-"పోనీ వెళ్ళి అతని దగ్గరే ప్రయత్నించు. ఈ విషయంలో ఒకటి రెండు లక్షలు నష్టమొచ్చినా ఫరవాలేదు" అన్నాడు.
    "నేను వెడితే పని జరగదండి తమరు స్వయంగా వెళ్ళాలి" అన్నాడు అల్లాఉద్దీన్.
    షేక్ మహమ్మద్ హుస్సేన్ తడబడ్డాడు. అతను అల్లా ఉద్దీన్ ని ప్రశ్నించి తెలుసుకున్న విశేషాలు-జగన్మోహనరావు తన స్వయంగా అడిగితే తప్ప సిమెంటు ఇవ్వడని తెలియజేశాయి.
    హుస్సేన్ జగన్మోహనరావుకు ఫోన్ చేశాడు-"నేను, షేక్ మహమ్మద్ హుస్సేన్ ని మాట్లాడుతున్నాను. మీతో అర్జంటుగా ఒక విషయమై మాట్లాడవలసివుంది......కాళీగా వున్నారా?"    
    "నాకు తీరుబడి ఎప్పుడూ ఉండదనుకోండి. కాని మీ అంతటివారితో మాట్లాడడానికి మాత్రం తీరుబడి దానంతటదే వస్తుంది. మీకు వీలయితే ఇప్పుడే రావచ్చు" ఫోన్ లో జగన్మోహనరావు గొంతులో వినయం, నమ్రత-ఉట్టిపడ్డాయి.
    ఆ గొంతు విని హుస్సేన్ ఆనందపడ్డాడు. అతను తక్షణం కార్లో జగన్మోహనరావు ఇంటికి వెళ్ళాడు. జగన్మోహనరావు అతనికి మంచి మర్యాదలు చేశాడు. ప్రాణమిత్రుడిలా ఆదరించి - "నేను మీకేవిధంగా ఉపయోగపడగలనో చెప్పండి" అన్నాడు.
    హుస్సేన్ తన ఇబ్బందిని వివరించాడు.
    జగన్మోహనరావు అంతావిని-"నాతో మాట మాత్రం అని వుంటే మీకు సాయపడి ఉండేవాన్ని కదా-నేనుతప్ప కుండా మీకు సిమెంటు దొరికేలా చేస్తాను. కానీ మీరు నాకో సాయం చేయాలి...." అన్నాడు.
    "ఏమిటది?"
    "మసీదు పక్కనే వున్న మీ స్థలం నాక్కావాలి. ఎంత ధరైనా ఇవ్వగలను...."
    "ఓస్ ఇంతేనా-"అనుకున్నాడు హుస్సేన్-"దాని కేముంది-మీ కెందుక్కావాలి?" అంటూ అడిగాడు.
    జగన్మోహనరావు క్షణం తటపటాయించాడు. "ఒక ముఖ్యమైన విషయంలోనే కావాల్సొచ్చింది లెండి...." అన్నాడు.
    చెప్పమన్నట్లు చూస్తున్నాడు హుస్సేన్.
    "మన కాలనీ ఒక విధంగా పదిమందికి ఆదర్శమైనది. హిందువులూ, ముస్లిములూ ప్రేమాదరాభిమానాలతో అన్న దమ్ముల్లా జీవిస్తున్నారు. ఎవరి ఆచారాలను వారు పాటిస్తూ మత సహనంతో జీవించగలుగుతున్నారు. ఇది అపూర్వం. అయితే కాలనీలోని హిందువులకువేరే దేవాలయంలేదు. వారు దైవ దర్శనం కోసం ఎంతోదూరం పోవలసి వస్తోంది. ఆ ఇబ్బందిని తొలగించడానికి కాలనీలో ఒక రామాలయం కట్టిద్దామనుకుంటున్నాను...." అన్నాడు.
    "అందుకా నా స్థలం అడుగుతున్నది?" అన్నాడు హుస్సేన్ అతని ముఖం ఎర్రబడింది.
    "అవును మసీదు, రామాలయం పక్కపక్కగా వుంటే ఎంత మనోహరంగా వుంటుంది...." జగన్మోహన్ రావు ఆ దృశ్యాన్ని తల్చుకుంటూ పరవశిస్తూ ముఖం పెట్టాడు.
    "మా మసీదు పక్క వుండాలని మీ రాముడు తపించి పోతున్నాడేమో నాకు తెలియదు కాని-అందుకు హుకుంకావాలి. రాముడ్ని పక్కన వుంచుకునేందుకు అల్లా ఎప్పుడూ ఒప్పుకోడు. కాబట్టి మీరా ఆలోచన మానుకోండి....."
    "రాముడికీ అల్లాకి పోలికేమిటి? రాముడు దయతలిస్తేనే మీకు సిమెంటు దొరుకుతుంది. అంగీకరించని పక్షంలో సిమెంటు మీ అల్లానడిగి తెచ్చుకోండి-" అన్నాడు జగన్మోహనరావు.
    "అల్లాకు డబ్బుంది. ఎంతయినా ఇచ్చి కొనగలడు సిమెంట్?" అన్నాడు హుస్సేన్.
    "రాముడు డబ్బుకు లొంగడు. నీతికీ నిజాయితీకి నిలబడేవాడు...." అన్నాడు జగన్మోహనరావు.
    ఇద్దరికీ మాటామాటా పెరిగింది. సిమెంటు బేరం చెడిపోయింది. ఆఖరున జగన్మోహనరావు మీకు సిమెంటు ఎప్పుడు కావాలన్నా ఇవ్వగలను. కానీ అడిగేముందు మీరు రామనామ జపం చేయాలి....." అన్నాడు.    
    "అలాంటి అవసరం లేకుండానే సిమెంట్ దొరుకుతుంది. ఏడ్చి గోలపెట్టినా రాముడికి మాత్రం అల్లాపక్కన చోటివ్వను...." అన్నాడు హుస్సేన్.
    
                                       6

    "ఘోరాలు చేసిచేసి, నేరాలు చేసిచేసి అల్లా అతని భక్తులు అపవిత్రులైపోయారు. మీ మసీదు ప్రక్కన రాముడిగుడి కడితే-మళ్ళీ అంతా పునీతులౌతారు- అవధాని."
    ఈ విధంగా వ్రాసి అవధాని పేరున్న కాగితాలు మసీదుకు చుట్టూ అంటించబడి వున్నాయి. అవి చదివిముస్లింలు మండి పడుతున్నారు. వారిలో కొంతమంది అక్బర్ ఆలీ ఇంటికీ కొందరు హుస్సేన్ ఇంటికీ పరిగెత్తి వార్త అందించారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS