వరహాలరావు నీరసంగా మళ్ళీ రోడ్డు మీదకు వచ్చాడు. అతను నాలుగడుగులు వేసేసరికి ఓ మనిషి యెదురై "మీరు సాంబయ్య గా రింటి కొచ్చిన బంధువులు కదూ--" అన్నాడు.
"అవును -- మీకెలా తెలుసు?" అన్నాడు వరహాలరావు.
"ఈ ఉత్తరం కాస్త సాంబయ్య గారి కంద జేయండి" అన్నాడు ఆ మనిషి. వరహాలరావు ఉత్తరం అందుకోగానే ఆ మనిషి క్షణాల మీద అక్కడ్నించి వెళ్ళిపోయాడు.
5
అప్పారావు చెప్పిన వార్త వింటూనే సాంబయ్య కంగారు పడ్డాడు. బెంగ, బాధ , భయం అన్నీ అయన ముఖంలో ఒక్కసారిగా కనపడ్డాయి.
"ఏది ఏమైనా ముందుగా నేను పోలీసు రిపోర్తివ్వాలేమో!" అని మనసులోనే గొణుక్కున్నాడు. తన ప్రాణాలకు ప్రాణమైన కొడుక్కేదైనా ప్రమాదం వాటిల్లుతుందన్న ఊహ తోస్తేనే అయన గజగజా వనికిపోతాడు.
ఒక్క క్షణం పాటు ఆయనకు కాళ్ళూ చేతులూ ఆడలేదు. ఆయన బుర్ర పనిచేసేలోగా ఎవరో ఆయన్ను సమీపించి "సార్! మికేక్కడ్నించో టెలిఫోన్ వచ్చిందండి." అన్నారు. సాంబయ్య పరుగులాంటి నడకతో ఫోన్ వద్దకు వెళ్ళి రిసీవర్ యెత్తి "హల్లో -- సాంబయ్య స్పీకింగ్...." అన్నాడు.
"సాంబయ్య గారా? నమస్కారం . మీ కుర్రాడి గురించి మీరేమీ భయపడకండి. ఇంటి కెళ్ళి వరహారరావుతో మాట్లాడితే అన్నీ చక్క బడతాయి."
"ఎవరు మీరు?" అన్నాడు సాంబయ్య.
"నేనేనండీ బావగారూ -- అనవసరంగా కంగారు పడి పోలీసు రిపోర్టిస్తే - అభాసవుతారని భయపడి ఫోన్ చేశాను." అంటూ ఫోన్ పెట్టేశాడు అవతలి వ్యక్తీ.
నన్ను బావగారు అని పిలిచినా ఆ వ్యక్తీ ఎవరో సాంబయ్య కు తెలియలేదు. ఇంటికొచ్చిన బంధువుల్లో ఎవరో ఒక రయుండాలసి- కంగారుగా ఫోన్ చేసి ఉంటాడని సాంబయ్య అనుకున్నాడు. అయన మనసు కాస్త తేలిక పడింది.
సాంబయ్య ఇంటికి వెళ్ళేసరికి అంతా ఇంకా కంగారుగా ఉన్నారు. అయన హడావుడిగా "వరహల్రావేడి?' అన్నాడు.
"వాడిక్కడే వున్నాడు...." అన్నారెవరో. అంతలోనే వరహాలరావు ముందుకు వచ్చి , "ఏం పెదనాన్న?" అన్నాడు.
"రాజారావేక్కడ?" అన్నాడు సాంబయ్య ఆత్రుతగా.
వరహలరావు కంగారు పడి పోయి "ఈ ప్రశ్న నన్నడిగితే నేనేం చెప్పగలను?" అన్నాడు నెమ్మదిగా.
సాంబయ్య తనకు వచ్చిన ఫోన్ వివరం చెప్పాడు. ఆయనలో ఇప్పుడు మళ్ళీ కంగారు మొదలయింది.
"అన్నట్లు -- పెదనాన్నా- నీ కిమ్మని ఎవరో పెద్దమనిషి స్కూలు దగ్గర ఓ ఉత్తరం ఇచ్చాడు- " అంటూ జేబులోంచి కవరు ఒకటి తీసి సాంబయ్యకు అందించాడు వరహాలరావు.
సాంబయ్య అ కవరు అందుకుని చించాడు. అందులోని ఉత్తరం పైకి తీసి చదువుతుంటే అయన చేతులు వణుకు తున్నాయి. చదవడం పూర్తయ్యేసరికి ఆ కాగితం అయన చేతుల్లోంచి జారిపోయింది. అయన కుప్పలా నేలమీద చతికిల పడిపోయాడు.
"ఏమిటి రాసుందందులో?" అన్నారెవరో కుతూహలంగా.
"ఈ ఉత్తరానికీ రాజారావు కనిపించక పోవడానికి సంబంధ ముంటుందని నా పాడు బుర్రకు తట్టనే లేదు....' అంటూ వరహాలరావు క్రింద పడ్డ ఆ కాగితం తీసి అందరూ వినేలా పైకి చదవసాగాడు.
"డియర్ సాంబయ్య!"
నీ కొడుకు కోసం ఏమైనా చేయగలవని అంటుంటావు. అర్జంటుగా నాకో యాభై వేలు కావాలి. ఇవ్వగలవా ? ఇస్తే నీ కొడుకు మళ్ళీ నీ ఇంటికి తిరిగి వస్తాడు. ఇవ్వకపోతే నీ కొడుకు శవం నీ ఇంటికి వస్తుంది. ఈ వార్తా నీ నోరు దాటి పోలీసులకు వెళ్ళిందా -- రాజారావు ఫినిష్! నీకు సరిగ్గా మూడే మూడు రోజులు గడువు .అంతకంటే నేను ఆగలేను. ఏ సంగతీ రేపు నీకు ఫోన్ చేసినప్పుడు చెప్పు.
--ఇట్లు నీ శ్రేయోభిలాషి"
అక్కడున్న బంధు జనంలో హటాత్తుగా నిశ్శబ్దం ఏర్పడింది. అ నిశ్శబ్దం రెండు క్షణాల పాటు మాత్రమే నిలిచింది. మళ్ళీ గుసగుసలు ప్రారంభమై , కోలాహలం ప్రారంభమైంది. ఆ కోలాహలం మళ్ళీ నిశ్శబ్దం గా మారిపోయింది. సాంబయ్య లేచి నిలబడడంతో.
"మీ అందరకూ ఒక చిన్న మనవి! ఈ క్లిష్ట పరిస్థితుల్లో నాకు కర్తవ్య భోధ చేయగలవారున్నారా? ఉంటె ముందుకు వచ్చి సాయం చేయండి....' అన్నాడు. అయన కంఠంలో ఏడుపు జీర తెలిసిపోతుంది.
బంధు జనంలో ఎవరూ ముందుకు రాలేదు. యేమని చెప్పాలో ఎవరికీ తోచడం లేదు. పోలీసులకు చెప్పమందామంటే - కుర్రాడి ప్రాణాలు పోవచ్చు. పోనీ డబ్బిచ్చి విడిపించుకోమందామంటే అంత డబ్బొక్క సారిగా సామాన్య మధ్యతరగతి సంసారుల కెక్కడి నుంచి వస్తుంది?
ఎవరూ మాట్లాడక పోవడం చూసి సాంబయ్య మళ్ళీ అన్నాడు - "పోనీ-- మీలో ఎవరైనా నాకు అప్పుగా తోచినంత డబ్బు సాయం చేయగలరా? అందుకూ తలో అయిదు వేలూ వేసుకుంటే యాభై వేలు పోగవడం కష్టం కాదు."
ఈ మాటలు అని సాంబయ్య అందరి వంకా చూశాడు. ఎవ్వరూ మాట్లాడలేదు. చాలామంది ముఖ కవళికలు కనిపించకుండా తలలు దించుకున్నారు.
"ఇంతకాలం నా సుఖాల్లో పాలు పంచుకోవలసిందిగా నేను కోరుతుంటే మన్నించి ప్రతి యేటా నాఇంటికి వచ్చి వెడుతున్నారు. అనుకోకుండా ఈరోజు ఈ కష్టం వచ్చి పడింది. నా కష్టాల్లో సాయపడడానికి కెవ్వరూ ముందుకు రాలేరా?" అన్నాడు సాంబయ్య దీనంగా.
ఎవ్వరూ ముందుకు రాలేదు.- 'అంతా మధ్య తరగతి వాళ్ళమే -- ఏదో మాట సాయం , పని సాయం అంటే మావల్ల వుతుంది కానీ ధన సాయం కావాలంటే ఎక్కడ కుదుర్తుంది?" అన్నాడో ముసలాయన.
'అయితే దయుంచి అందరూ వెళ్ళిపొండి. నన్ను ప్రశాంతంగా ఆలోచించుకోనివ్వండి. ఎలాగూ పుట్టినరోజు వేడుక జరుగాబోవడం లేదు. దేవుడు దయతల్చి మళ్ళీ సంవత్సరం పుట్టిన రోజు వేడుక మా ఇంట్లో జరిగితే మిమ్మల్నందర్నీ తప్పక పిలుస్తాను. వెళ్ళే ముందో చిన్న విన్నపం. మా అబ్బాయి తప్పిపోయినట్లు మాత్రం ఎక్కడా అనకండి..." అన్నాడు సాంబయ్య.
రాత్రయ్యే సరికి - బంధు జనంతో కోలాహలంగా వుండిన సాంబయ్య ఇల్లు బావురుమంటూ వుంది. వారి కుటుంబ సభ్యులలో యిప్పుడు ఓ మనిషి తక్కువగా వున్నాడు. అతను రాజారావు!
6
"రిక్షా అపు!" అంది మాలతి.
రిక్షా ఆగింది. అందులోంచి మాలతి , ఆమె భర్త దిగారు. మాలతి హడావుడిగా అడుగులు వేసి -- "అన్నయ్యా!' అని పిలిచింది.
రోడ్డు పక్క కూర్చుని ఆకాశం కేసి దిక్కులు చూస్తూ తనలో తనే నవ్వుకుంటున్న జోగినాధం ఉలిక్కిపడి "ఎవరూ?" అన్నాడు.
"నేనే అన్నయ్యా!" అంది మాలతి.
జోగినాధం ఆమెను గుర్తు పట్టాడు. చటుక్కున లేచి నిలబడి "ఏం జరిగిందమ్మా!" అన్నాడు. అప్పటికి మాలతి భర్త కూడా వచ్చి ఆమె పక్క నిలబడ్డాడు. అతను జోగినాధం వైపు జుగుప్సాకరంగా చూస్తున్నాడు.
మాలతి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. "ఒక్కడంటే ఒక్క కొడుకు, వన్నేవ్వరో ఎత్తు కెళ్ళి పోయారు..." అందామె.
"మీ అబ్బాయి నెవరో ఎత్తుకు పోయారా?" ఎందుకు?" అన్నాడు జోగినాధం.
"ఎందుకో తెలియదు గానీ వాణ్ణి మేము ప్రాణాలతో తిరిగి చూడాలంటే పది వేల రూపాయలివ్వాలి. ఎక్కణ్ణించి తెచ్చేది?" అంది మాలతి.
"పోలీసు కంప్లయింటి వ్వ లేకపోయారా?"
"అలా చేస్తే కుర్రాడి ప్రాణాలు దక్కవన్నారు. ఏం చేయాలో దిక్కుతోచక డబ్బు కోసం అయిన వాళ్ళని కాని వాళ్ళని దేబిరిస్తుంటే నువ్వు కనబడ్డావు. నీవల్ల ఏమైనా సాయం జరిగుతుందేమోనని ...." అంది మాలతి.
మాలతి భర్త నవ్వి "బాగానే ఉంది వ్యవహారం. కట్టుగుడ్డలు ఉతికించుకోలేని వాళ్ళను డబ్బు సాయం అడుగుతున్నావు. నీకు మతి గాని పోలేదు కదా?' అన్నాడు.
జోగినాధం అదోలా నవ్వి "వేషం చూసి మోసపోకండి బావగారూ! రేపుదయానికి మీకు పది వేల రూపాయలిస్తాను. దాంతో మీ పిల్లాడిని విదిపించుకుందురు గాని...." అన్నాడు.
"నిజంగానా------" అంది మాలతి.
"నన్ను నమ్ము. ఇంత త్వరగా నీకు సాయపడే అవకాశం వస్తుందను కోలేదు. ఈ రాత్రికే అవసరమైన డబ్బు సంపాదించుకుని వస్తాను. తెల్లారేసరికి మీ ఇంటి ముందు డబ్బుతో ఉంటాను. ఆ డబ్బు మీరు నాకు తిరిగి ఇవ్వవలసిన అవసరం కూడా ఉండదు." అన్నాడు జోగినాధం.
"మూడంటే మూడు రోజులు గడువిచ్చారు వాళ్ళు" అంది మాలతి.
"ఇలాంటి కేసు ఇదొక్కటేనా? ఇంకా యేమైనా జరిగాయా-- / నీకేమైనా తెలుసా? ఈ సమాచారం నా కుపయోగాపడుతుంది ....' అన్నాడు జోగినాధం.
"నాకు తెలియదు. ఒకవేళ జరిగినా యెవరూ బయట పెట్టు కోరు కదా - అందరికీ హెచ్చరికలూ అందే వుంటాయి " అంది మాలతి.
"సరేలే - నువ్వు మాత్రం నిశ్చింతగా ఉండు. నామాట నమ్మి నామీద గురి ఏర్పరచుకున్న వాళ్ళెవరూ యింత వరకూ నష్ట పోలేదు. అసంతృప్తి చెందలేదు. నీకోడుక్కే ప్రమాదమూ లేదు. నా అభయం లభించింది" అన్నాడు జోగినాధం. ఈ మాట అని అతను లేచి నిలబడ్డాడు.
"మాలతీ నీకు పిచ్చి గానీ పట్టలేదు కదా -- ఆ ముష్టి వెధవ నేవడినో వరస పెట్టి అన్నయ్య అని పిలవడమే కాక డబ్బు కూడా అడగదమేమిటి? వాణ్ని చూస్తుంటేనే తెలియడం లేదూ- నెత్తి మీద రూపాయి పెట్టి అయిదు పైసల కమ్మినా వాడి నెవరూ కొనుక్కోరు..." అన్నాడు. మాలతి భర్త చిరాగ్గా మాలతితో కలిసి తిరిగి వెళ్ళిపోయాడు.
"ఏమోనండీ - యే పుట్టలో యే పాముందో ...." అని ఊరుకుంది మాలతి.
7
జోగినాధం ఆ భవనం గేటు ముందు ఓ పది నిముషాలు తచ్చాడాడు. ఆఖరికి నెమ్మదిగా లోపల ప్రవేశించబోయాడు.
"ఏయ్ అగు--" అన్నాడు కాపలావాడు.
"ఎందుకని?"
"ఈ క్లబ్ నీలాంటి వాళ్ళ కోసం కాదు."
