అతను అదోలా నవ్వి -- "చూడమ్మా -- వాసనను భరించలేనని నువ్వు నిన్ను మోసం చేసుకుంటున్నావు. ఈ ప్రపంచమంతా మోసం, అన్యాయం, కుళ్ళు, ఆ విషయం మీ అందరికీ తెలుసు. అయినా ఆ వాసన భరించ గల్గుతున్నారు. అటువంటి మీకు నా వాసన భారం కాకూడదు. నేను చాలా అరుదుగా స్నానం చేస్తాను. అందుకే నా వంటికి ఈ వాసన. అయితే నా శరీరం స్నానానికి నోచుకున్న రోజున ఈ ప్రపంచంలోని శతకోటి అన్యాయాలలో ఒకటి తొలగించబడిందని అర్ధం! నా వేదాంతం మీ కర్ధం కాదు కానీ మీ ఇంట్లో ఉండడానికి నేను బట్టలు మార్చుకోవడం ఒక షరతు అయిన పక్షం లో నేను తక్షణం వెళ్ళిపోతాను. ఎందుకంటె నాకు ప్రస్తుతం ఒక బాధ్యత ఉంది. అది తీరాక స్నానానికి మీ ఇంటికే వస్తాను. అంతవరకూ స్నానం ప్రసక్తి నా వద్ద రాకూడదు-" అన్నాడు.
అతని మాటలన్నీ జ్వరానికి సంబంధించిన సంధి ప్రేలాపనగా మాలతి భావించింది -- "ఈ జబ్బుతో ఇప్పుడెక్కడికి వెడతావులే -- నీకు నచ్చితే ఇలాగే ఉండు--" అంది మాలతి.
తర్వాత డాక్టరు వచ్చినపుడు అతని మాటలు చెప్పింది ,మాలతి -- 'చిత్రమైన మనిషిలా గున్నాడు?" అన్నాడు. డాక్టర్ ఆమె చెప్పినవన్నీ విని, అయితే అయన ఆ మనిషితో అట్టే మాటలు పెట్టుకోలేను. అతని వాసన భరించడం ఆయనకు కష్టంగా ఉంది.
"ఇతనికి జ్వరం తగ్గు ముఖం పట్టినట్లే ...." అన్నాడు డాక్టర్ వెళ్ళే తప్పుడు.
ఆ మర్నాడు పొద్దునకు అతనికి నార్మల్ కు వచ్చింది. మాలతి ఎంత బలవంత పెట్టినా వినకుండా అతను వెళ్ళి పోవడానికి సిద్దపడ్డాడు.
"ఒక్కరోజు పద్యం తిని విశ్రాంతి తీసుకుని వేళ్ళన్నయ్యా --" అంది మాలతి.
"వద్దమ్మా -- నీలా ఆదరించే ఆడవాళ్ళు ప్రపంచంలో అరుదు. నీ ఋణం తీర్చుకునే అవకాశం నాకు వస్తుందో రాదో తెలియదు. నీ కెప్పుడు కష్టం వచ్చినా నాకు కబురు పెట్టు...." అన్నాడతను.
"నీ చిరునామా....?" అంది మాలతి.
"ప్రస్తుతానికి ఈ ఊరు రోడ్లు. ఈ ఊరు వదిలి వెళ్ళేటప్పుడు నీకు చెప్పే వెడతాను. నా పేరు జోగినాధం " అన్నాడతను.
మాలతి అతని వంకే ఆశ్చర్యంగా చూస్తూ నిలబడింది.
3
"క్షమించాలి. మిస్టర్ జోగినాధం - మీ అనుమానాలకు ఆధారం లేదని చెప్పడానికి విచారిస్తున్నాను."
"మీ విచారణ సంగతి తర్వాత చూద్దాం-- నావి అనుమానాలనీ , వాటికి ఆధారం లేదనీ ఎందు కనుకుంటున్నారు ?" అన్నాడు జోగినాధం.
"ఎందుకేమిటి? ఎంత ప్రయత్నించినా ఒక్కటంటే ఒక్క క్లూ కూడా దొరకలేదు."
"అందుకు కారణం మీ అసమర్ధత కాకూడదా?"
"మిస్టర్ జోగినాధం! మీరు మాటలు జాగ్రత్తగా రానివ్వాలి. నేను బాధ్యత గల ప్రభుత్యోద్యోగి నన్న విషయం మరిచి పోతున్నారు."
"చూడండి. నాకు మీ మీద ఏ విధమైన కోపమూ లేదు. నేను నిజం తప్ప ఇంకొకటి మాట్లాడను. అందువల్ల మీకు కాస్త బాధ కలిగించినా -- బాధ్యత గల ప్రభుత్యోద్యోగులు నిజాన్ని భరించగలగాలి. నేను మీకిది వరలో చెప్పినవి అనుమానాలు కాదు. బేర్ ఫాక్ట్స్! అని మీకు చెప్పడానికి కారణం మీరు బాధ్యత గల ప్రభుత్యోదుగులు కావడం . అయితే మీ బాధ్యతను మీరు సమర్ధవంతంగా నిర్వహించలేకపోయారు. ఆ విషయాన్ని నేను తప్పక రుజువు చేయగలను....' అన్నాడు జోగినాధం.
"ఎవరికి?" అన్నాడతను. "ఎవరికో ఋజువు చేసి మిమ్మల్ని నవ్వుల పాలు చేయవలసిన అవసరం నాకు లేదు. నేనేం ఋజువు చేసినా మీకే చేస్తాను ...." అన్నాడు జోగినాధం.
"నావల్ల కానిపని మీవల్ల నవుతుందనుకుంటున్నారా!
"మీరు సీబీలకు చెందిన మనిషి. అయితే ఇంటి బయట మీ నేమ్ ప్లేట్ ఇంకో విధంగా తగిలించాడు. అయినా మీరెవరో నేను తెలుసుకో గలిగాను. మీకు ముఖ్యమైన బాధ్యత కూడా అప్పగించాను. ఇవన్నీ ఎలా చేయగలిగాననుకుంటూన్నారు?"
"మిస్టర్ జోగినాధం -- మీరు నాకు చెప్పిన విషయాలు ఋజువు చేస్తే మీరు చెప్పినట్లు వింటాను...' అన్నాడా సీబీఐ ఆఫీసరు.
"నేను చెప్పినట్లు వినడం మీవల్ల కాదు..." అన్నాడు జోగినాధం.
"ఎందుకని?"
"మీరు కూడా నాకులా ఉండగలరా? అంటే - ఇలాగే స్నానం చేయకుండా మాసిన బట్టలు కట్టుకుని...." అని నవ్వాడు జోగినాధం.
"ఏమిటి దాని వల్ల ప్రయోజనం ?"
"లక్ష్యం ఏర్పడుతుంది. నేననుకున్నది సాధించే వరకూ నేను స్నానం చేయను. బట్టలు మార్చను. లక్ష్మణుడిలా నిద్ర హారాలు విసర్జించ లేని నాకు సులువైన మార్గమిదే కనబడింది...." అన్నాడు జోగినాధం.
"అదికాదు మీరు చెప్పినట్లు వినడమంటే ...." అని అతను నవ్వి - "ఇప్పుడు మీరు చెప్పింది ఋజువు చేయగలిగితే , ఇంక మీదట మీరేమైనా చెబితే ఆ పని సాధించి తీర్తాను."అన్నాడు.
"ఇప్పుడే నేను రంగంలో ప్రవేశిస్తున్నాడు. అయితే అందుకు మీ సహకారం కావాలి. అది తప్పక లభిస్తుందని నా ఆశ!" అన్నాడు జోగినాధం.
4
సాంబయ్య గారింట్లో చాలా హడావుడిగా ఉన్నదా రోజు. మర్నాడు సాంబయ్య గారి ఏకైక సంతానం రాజారావు జన్మదినం! ప్రతి ఏటా పెద్ద ఎత్తున ఆ ఇంట్లో జరిగే వేడుక ఇది.
సాంబయ్య కోటీశ్వరుడు కాదు. లక్షాధికారి కాదు. నాలుగు వెళ్ళు నోట్లోకి పోయేటంత ధనికుడు కూడా కావడానికి వీల్లేదు. అతను అతి మామూలు గుమస్తా! అతనికి తల్లి, తండ్రి ఉన్నారు. భార్య ఉంది. పదేళ్ళ కొడుకున్నాడు.
అతనికి వచ్చే జీతం ఇంటి ఖర్చులకు బొటాబొటీగా సరిపోతుంది. అయినా ఏటా కొడుకు పుట్టిన రోజు పండుగ అత్యంత వైభవంగా జరుపుకుంటాడు. అల్లారు ముద్దుగా పెరిగిన ఏకైక పుత్రుడి పుట్టిన రోజు విషయంలో మాత్రం అతను ఎంత ఖర్చయినప్పటికీ సందేహించడు.
ఊళ్ళో తెలిసిన వారందర్నీ పిలిచారు. పోరుగుళ్ళ లో ఉన్న బంధువుల క్కూడా ఆహ్వానాలు వెళ్ళాయి. ఇంట్లో పెద్ద ఎత్తున స్వీట్సు ప్రిపేర్ చేస్తున్నారు. ఇంట్లో బంధు జనం చాలామంది ఉన్నారు. ఛలో క్తులతో వాళ్ళందరూ సరదాగా సమయం గడుపుతున్నారు.
ఉన్నట్లుండీ ఇంట్లోని ఓ ముసలమ్మా - " ఈ వేడుక ఎవరి గురించి జరుగుతుందో -- వాడేడర్రా-" అంది.
"వాడు స్కూల్లో ఉన్నాడు...." అన్నారెవరో.
"ఏడిసినట్లే ఉంది. మనమంతా సరదాగా కబుర్లు చెప్పుకుంటుంటే వాడేమీ ఈసురోమంటూ స్కూల్లో ఏడుస్తున్నాడా - ఎవర్నయినా పంపించి వాణ్ని ఇంటికి పిలిపించండి...." అందా ముసలమ్మ ఆజ్ఞను జారీ చేస్తున్నట్లుగా.
కొంతమంది పిల్లాడి స్కూలు పాడు చేయడం అనవసరమన్నారు. ఎలాగూ రేపు స్కూలు మానేస్తున్నాడు గా అన్నారు. అయితే మరి కొంతమంది ఒక్కరోజులో పిల్లాడి చదువు పాడయ్యే దేమీ లేదన్నారు. పుట్టిన రోజు పూట మానడం విశేషం కాదు- అంతకు ముందు రోజు కూడా ఆనందించాలన్నారు. ఆఖరికి స్కూలుకు ఓ మనిషిని పంపాలనుకున్నారు. ఆ మనిషి పేరు వరహాలరావు.
వరహలరావు ఉత్సాహంగా స్కూలు కు వెళ్ళాడు. అతను స్కూలుకు వెళ్ళేసరికి ఉండవలసిన క్లాసులో రాజారావు లేడు'.
"సరిగ్గా పదిహేను నిమిషాల క్రితం ఎవరో సాంబయ్య గారు పంపగా వచ్చి రాజారావు ని పీల్చుకుని వెళ్ళి పోయాను...." అన్నాడు క్లాసు టీ చరు.
వరహాలరావు నిరుత్సాహంగా క్లాసు లోంచి బయటకు వచ్చేశాడు. చేసేది యేమీ లేదు కాబట్టి అతను ఇంటికి తిరిగి వెళ్ళాడు.
"రాజు ఏడీ?" అంది రాజారావు తల్లి.
"వాళ్ళ నాన్నగారు యెవరో మనిషిని పంపి పిల్చుకు వెళ్ళారుట" అన్నాడు వరహాలరావు.
"రేపు పుట్టిన రోజు గదా -- ఏవో కొనడానికయుంటుంది...." అన్నాడో ముసలాయన.
రాజారావు తల్లి నిరుత్సాహంగా - "ఇద్దరూ కలిసి బజారుకు వెళ్ళేరంటే -- ఓ పట్టాన తిరిగి రారు. వాడడిగినవన్నీ కొనాలని అయన పంతం. అయన వద్దనే దాకా అడగానని వాడి పంతం. ఆఖరికి దుకాణాలన్నీ మాయించి ఇంటికి వస్తారు...." అంది.
"ఎలాగైనా కుర్రాడు అదృష్టవంతుడు. తండ్రి గుమస్తా అయితేనేం . అడిగినవన్నీ కొనిపెడతాను...." అనుకున్నాడు వరహలరావు మనసులో. అతని తండ్రి కాస్త ఉన్నవాడే. అయినా ఆయనకు డబ్బు పిచ్చి, ఉన్నంతలో నాలుగు డబ్బులు వెనకేసు కొందామనే అయన ఆలోచన.
ఇంతలో ఆఫీసు నుంచి ఫ్యూన్ అప్పారావు వచ్చాడు. రాజారావు తల్లి ఆత్రుతగా ఎదురు వెళ్ళింది. 'అయ్యగారు పంపారండి. ఆఫీసులో అనుకోని పని తగిలిందండీ. కాస్త ఆలస్యంగా వస్తారుట. అబ్బాయిగారు స్కూల్నించి రాగానే వారికేమైనా కావాలంటే వరహలరావు గారికి డబ్బిచ్చి బజారుకి పంపించమన్నారు...." అన్నాడు అప్పారావు.
ఆవిడ కంగారుగా "ఏమిటీ - రాజు అక్కడ లేడూ?" అంది.
అప్పారావు కు విషయం అర్ధం కావడానికి పది నిముషాలు పట్టింది. అతను కంగారుగా ఈ వార్త అందించడానికి ఆఫీసుకు పరుగెత్తాడు. ఈలోగా అంతా కలిసి వరహాలరావు ని మళ్ళీ స్కూలుకు పరుగెత్తించారు.
వరహాలరావు స్కూలుకు వెళ్ళి కనుక్కోగా -- ఎవరో నీలం పాంట్, ఎర్ర చొక్కా వేసుకున్న సుమారు పాతికేళ్ళ మోడ్రన్ యువకుడూ రాజారావును పీల్చుకుని వెళ్ళినట్లు చెప్పారు.
