Previous Page Next Page 
వసుంధర కధలు-5 పేజి 40

 

    "కనీసం తనకు ఫోన్ వచ్చిందన్నందుకైన సాక్ష్యం లేదన్నమాట" అన్నాడు భానోజీరావు నీరసంగా.
    "ఇంటివాళ్ళు ఊళ్ళో లేరు. అందువల్ల మేము ఫోన్ వున్న గదిలోనే పడుకుంటున్నాం" అంది ఉమ.
    "విది వీడి మీద పగ బట్టునట్లుంది. అసలు వీడికే ఫోన్ కాలు రాలేదు. ఉదయం బాపిరాజు చేసిన అవమానం వీడి మనసును బాధిస్తుంటే, పాతికవేల అవసరం పీకుతుంటే, రాత్రి పదకొండు గంటల వేళ ఒక నిర్ణయానికి వచ్చి, వీడు బాపిరాజు యింటికి బయల్దేరాడు. ఆవేశంలో ఆయన్ను హత్య చేసి అవసరమైన పాతికవేలు తీసుకుని వచ్చేశాడు.
    "అన్నయ్య" అంది ఉమ బాధగా.
    "అని నేను కాదమ్మా. నా డ్యూటీ అంటుంది. కాదని ఎవరైనా ఋజువు చేయగలిగితే సంతోషించగలిగేది నా కంటే ఎవరూ వుండరు"అన్నాడు భానోజీరావు. మళ్ళీ ఒక్క క్షణం ఆగి, "హత్యా సాధనమైన ఇనుప గొట్టం మీద హంతకుడి వెలి ముద్రలున్నాయి. నా ఆశ ఒక్క ఈదాని మీదనే వున్నాయి" అన్నాడు.

                                    14
    "మురళీధర్ కి పాతికవేలు కావాలి. ఎలాగైనా ఆ డబ్బు సంపాదించాలన్నది అతని ఆశయం. ఈ ఆశయ సిద్ది కోసం తనలోని బలహీనతలు వెలికి వచ్చి తనచేత నేరం చేయిస్తాయోమోనని అతను చాలా భయపడుతున్నాడు. లంచానికి లొంగిపోతానేమో నని భయపడి ఆఫీసుకు వెళ్ళడం కూడా మానేశాడు.
    డబ్బిస్తానని యింటికి పిలిచి బాపిరాజు మురళీధర్ ని దారుణంగా అవమానించాడు. ఆవేశంగా అతని యిల్లు వదిలి పెడుతూ , మళ్ళీ నీ గుమ్మం తొక్కితే అది నీ ప్రాణాలు తీయడానికే నన్నాడు మురళీధర్.
    అతను మళ్ళీ బాపిరాజు గుమ్మం తొక్కాడు. బాపిరాజు ప్రాణాలు పోయాయి.
    బాపిరాజు తనకు ఫోన్ చేశాడన్న విషయాన్నీ మురళీధర్ రుజువు చేయలేడు. అర్ధరాత్రి అతను బాపిరాజు యింటికి వెళ్ళాడు. బాపిరాజు మరణించాడు. మురళీధర్ ని బాపిరాజు భార్య చూసింది. బాపిరాజు ను చంపడానికి ఉపయోగించిన ఇనుప గొట్టం మీద మురళీధర్ వ్రేలిముద్రలె వున్నాయి. బాపిరాజు ఇంట్లో మాయమైన పాతికవేలూ మురళీధర్ ఇంట్లో వున్నాయి.
    మురళీధర్ చెప్పే విధంగా బాపిరాజు ఔదార్యాన్ని చూపించిన సంఘటనలు మచ్చుకొక్కటైనా వున్న వివరాలు లేవు.
    హత్య జరిగిన సమయానికి వాన పడుతోంది. మురళీధర్ వానలో తడిశాడు. అతను వానలో బాగా తడిస్తే జ్వర పడతాడు.  మర్నాడతను జ్వర పడడం,  అతను వానలో బాగా తడిశాడన్న విషయాన్ని స్పష్టం చేస్తుంది.
    రామారావు తను కాగితం మీద  వ్రాసుకున్న వివరాలన్నీ మరోసారి బాధగా చూసుకున్నాడు. ఈ పరిస్థితుల్లో తను చేయగలిగిన దేమీ లేదు. నిజానికి హత్యను నిరూపించడానికి యిటువంటి ఆధారాలు సంపాదించడానికే తను ప్రయత్నిస్తాడు. కేసును పటిష్టం చేయడానికీ ఆధారాలు చాలు.
    మురళీధర్ ని కలుసుకుందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్ళాడు రామారావు. భానోజీరావు ముభావంగా పలకరించాడు.
    "ఏమంటున్నాడు మురళీధర్?' అడిగాడు రామారావు.
    అదోలా నవ్వి , "తను అమాయకుడ్ని ని నమ్మమంటున్నాడు" అన్నాడు భానోజీరావు.
    "అమాయకుడని నమ్మడానికి అభ్యంతరం లేదు. కానీ అమాయకులు మాత్రం హంతకు లెందుకు కాకూడదు?"
    "ఏరా -- నువ్వు నమ్ముతున్నావా, మురళి హత్య చేశాడంటే" రామారావు బాధగా అడిగాడు.
    భానోజీరావు టేబిల్ మీంచి ఒక ఫైలు తీసి, "ఇది చూడు. మురళి మన మిత్రుడని మరిచిపో. నీ అభిప్రాయం చెప్పు" అన్నాడు.
    "ఆ ఫైలు చూడవలసిన అవసరం లేదు. వివరాలన్నీ నాకు తెలుసు" అన్నాడు రామారావు.
    "నీ అభిప్రాయం చెప్పు మరి."
    "కాకతాళీయంగా యెన్నో విషయాలు జరిగుంటే తప్ప, మురళీధర్ నిర్దోషి అనలేము. ఇన్ని విషయాలు కాకతాళీయంగా జరగడం నా అనుభవం లో ఇంతవరకూ రాలేదు. చిన్నతనం నుంచీ మరళీధర్ ని యెరుగుదును కాబట్టి, అందరకూ సమంజసంగా కనబడే నిర్ణయానికి రావడం కష్టంగా వుంది" అన్నాడు రామారావు.
    భానోజీరావు మాట్లాడలేదు. రామారావే మళ్ళీ "ఒక పర్యాయం వెళ్ళి మురళితో మాట్లాడి వస్తాను" అన్నాడు. భానోజీరావో క్షణం అలోచించి, "నిజం ఒప్పేసుకుంటే శిక్ష తగ్గుతుందని కూడా చెప్పు" అన్నాడు.
    రామారావుకు మురళీధర్ ని చూస్తె కడుపు తరుక్కు పోయింది. ఈ వేషంలో అటువంటి అవతారం లో అతన్ని చూస్తానని అతననుకోలేదు.
    "మురళీ!" అన్నాడతను బరువుగా.
    "రామారావ్. ఏమిటి విశేషాలు?" అన్నాడు మురళీధర్ విషాదంగా.
    "నిజం ఒప్పేసుకుంటే , శిక్ష తగ్గుతుందని చెప్పమంటున్నాడు భానోజీరావు."
    "నువ్వు కూడా నేను హంతకుడని నమ్ముతున్నావా" రామారావ్, నిజంగా నేను నిర్దోషిని."
    'అలాగంటే అందరూ నవ్వుతున్నారు. ఎలా రుజువు చేయడం?"
    "ఋజువు చేసుకోవలనుంటుందని ముందుగా నాకు తెలియదు గదా! లేకపోతే జాగ్రత్తపడి వుండేవాడిని. నీకు గుర్తుందో లేదో కానీ, మనం స్నేహితులం ముగ్గురం ఒకసారి మూడు అబద్దాల గురించి మాట్లాడుతున్నాం. ఈనాడందులో రెండు నిజాలయ్యాయి. బాపిరాజు ఔదార్యం చూపించాడు, భానోజీరావు నన్నరెస్టు చేశాడు. కానీ, లోకం నమ్ముతున్న నిజాలు వేరుగా వున్నాయి. భానోజీరావు నన్న రెస్టు చేశాడు, నేను హత్య చేశాను. వీటిల్లో అసలు నిజమా, అసలు అబద్దమా తెలిసిన వాళ్ళు ముగ్గురం. ఒకడు బాపిరాజు మావయ్య. ఈ లోకం విడిచి వెళ్ళిపోయాడు. రెండు భగవంతుడు. ఉలకడు, పలకడు. మూడు నేను, నా మాట నమ్మరు."
    రామారావు మౌనంగా అంతా విని, "నేనింకా నిన్ను రక్షించాలనే ప్రయత్నం లోనే వున్నాను. అన్ని వివరంగా మరొక్కసారి చెప్పు. ఒక్క సంఘటన కూడా తప్పకూడదు" అన్నాడు. మురళీ ధర్ ఓపిగ్గా అంతా చెప్పాడు.
    "నువ్వు దారిలో వాన పడ్డప్పుడోక ఇంట్లో అగానని చెబుతున్నావే, ఆ సంఘటన కూడా నిన్ను రక్షించదు. ఎందుకంటె వాళ్ళెవ్వరూ నిన్ను సరిగ్గా ఏ  టైముకు కలుసుకున్నారో చెప్పలేక పోతున్నారు. ఎక్కడాఏ హోపూ లేదు. నువ్వు మాత్రం అధైర్య పడకు. నేను ప్రయత్నాలు చేస్తుంటాను."
    రామారావు మురళీధర్ తో మాట్లాడి సెలవు తీసుకుని వెళ్ళిపోయేక భానోజీరావు మరోసారి కలిశాడతన్ని.
    "ఒరేయ్ , స్నేహితుడిగా నా సలహా విను. నీచేత నేరం ఒప్పించలేనందుకు పోలీసు శాఖ నన్నసమర్ధుడిగా లెక్కడుతుంది. అయినా అందుకు భయపడ్డం లేదు నేను. నిన్ను మరొకరి చేతికి ఒప్పగించాలేమోనని హడలి పోతున్నాను. నేరస్థుల చేత నేరాన్నోప్పింప చేసేందుకు పోలీసు శాఖ అవలంబించే పద్దతులు నీకు తెలియవు. నువ్వు ఆ దారుణ హింసలకు గురి కావడం ఊహలో కూడా నేను సహించలేను. నువ్వు నిజంగా హంతకుడివి కాదనుకో, అసలు హంతకుడు తనకు తాను స్వయంగా వచ్చి బయట పడి, హత్య ఎలా జరిగింది వివరిస్తే తప్ప, ఈ పరిస్థితుల్లో నువ్వు నేరస్థుడివి కాక తప్పదు. నీ భార్యాబిడ్డలకు వచ్చిన లోటు లేదు. వాళ్ళు ప్రస్తుతం మా ఇంట్లోనే వుంటున్నారు. చెల్లాయినీ, మేనల్లుడినీ కంటికి రెప్పలా చూసుకుంటాన్నేను. వెంటనే నేరం ఒప్పేసుకుంటే, శిక్ష తగ్గించడానికి ఏమైనా సహయపడగలుగుతాను నేను-- నీ మేలు కోరి చెబుతున్నాను . నేరం ఒప్పేసుకో!"
    "ఒప్పుకోకపోతే...."
    "నేను రంగం లోంచి తప్పుకుంటాను. మా పోలీసు శాఖ నీ చేత ఎలాగూ నేరాన్ని ఒప్పించగలదు, కానీ, నీ భార్యా బిడ్డలకు నీడ కల్పించే అవకాశం నేను కోల్పోవచ్చు."
    మురళీధర్ అతన్ని మరేమీ ప్రశ్నించలేదు. శూన్యం లోకి చూశాడు కాసేపు. తర్వాత "ఎన్నో సార్లు పుస్తకాల్లో చదివాను. చట్టానికి చెవులే కానీ, కళ్ళు లేవని. అది ఇంత భయంకరంగా నా జీవితంలో నిజమవుతుందని కలలో కూడా ఊహించలేదు. ఒరేయ్ భానోజీరావ్! భగవంతుడనేవాడుంటే, ఒక నిరపరాదికి నిష్కారణంగా శిక్ష విధించబడిందని మీరంతా గ్రహించే రోజు తప్పక వస్తుందిరా. అంతవరకూ భగవంతుడు నాకాయుష్షు ఇస్తాడేమో చూడాలి. అదంతా ఎందుకులే కానీ, బాపిరాజు మావయ్య హత్య గురించి నీకు తోచిన విధంగా రాయి, నువ్వెక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేస్తాను" అన్నాడు.
    భానోజీరావు ముఖంలో సంతోషం కనబడింది. అతను తృప్తిగా నిట్టూర్చాడు.
    ఆ తర్వాత సుమారు నెలరోజులకు కోర్టు విచారణ ముగిసి, మురళీధర్ కు యావజీవ కారాగార శిక్ష విధించబడింది.

                                    15
    "ఎలా చిక్కిపోయాడో" అన్నాడు బసవరాజు రాజుని చూసి బాధగా.
    బసవరాజు ఉమ కున్న ఏకైక బంధువు. వరుసకు అన్నయ్య అవుతాడు. ఉమ వివాహం అతని చేతుల మీదగానే జరిగింది. మురళీధర్ జైల్లో ఉన్నాడని తెలిసి వచ్చాడు. రాజుకి ఆ ఏడాది చదువు పూర్తయ్యేవరకూ ఉమ ఆ ఊళ్ళో నే ఉండడానికి నిర్ణయించుకుంది. ఆమెకు ధైర్యంగా వుండడం కోసం ఓ నెలరోజుల పాటు ఆమె వద్ద గడపడానికి భార్యా బిడ్డలతో సహా అక్కడికి వచ్చేశాడు. అతను భానోజీరావు కు కృతజ్ఞతలు చెప్పుకుని, ఉమ బాధ్యతలు తను వహిస్తానని చెప్పాడు.
   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS