వేషం చూసి మోసపోకండి!
వసుంధర
బాగా ఆలోచించిన మీదట మాలతి సాంఘిక నవల తీసుకుని చదవడం మొదలు పెట్టింది.
ప్రస్తుతానికి నవల చదివే మూడ్ లేదు. కానీ నిద్ర పట్టక కాలక్షేపమయ్యే దారిలేక ఏదైనా పుస్తకం చదవాలని ఆమె అనుకుంది. మూడ్ లేనప్పుడు కూడా ఆమె చదవగలిగిన పుస్తకాలు డిటెక్టివ్ నవలలు. అయితే ఇప్పుడామె డిటెక్టివ్ నవల చదవడం లేదు.
భర్త పక్కన లేనప్పుడు మాలతి డిటెక్టివ్ కధలు చదవడు. ఎందుకంటె ఆమెకు విపరీతమైన భయం. నవల చదివేక ఇంట్లో ఏ శబ్దం వినిపించినా, గాలికి తెర కదిలినా తన నీడే గోడ మీద పడినా -- కూడా భయంగా ఉంటుంది.
భర్త ఆమెను ప్రోత్సహిస్తుంటాడు- డిటెక్టివ్ నవలలు చదువుకునేందుకు. ఎందుకంటె- నవలలు చదవడం పూర్తికాగానే అతనాడక్కుండానే దగ్గరగానే చేరి పడుకుంటుంది. ఆ క్షణంలో అతనికి భార్య ముఖంలోని అమాయకతనపు చాయలు గోచరిస్తాయి.
ప్రస్తుతం సాంఘిక నవల చదువుతున్న మాలతి పక్కన భర్త లేడు. అతనూళ్ళో లేడు. ఇంకా రెండు రోజుల దాకా రాడు. ఊరికి వెళ్ళేటప్పుడు అతను మరీ మరీ చెప్పి వెళ్ళాడు. ధైర్యంగా ఉండమని! ఆమె అలాగే అంది కానీ ధైర్యం లేదు.
పొరుగు వాళ్ళ అమ్మాయిని సాయం పడుకో బెట్టుకునేదే కానీ దిరదృష్టవశాత్తు ఆ పిల్ల బావ ఈ మధ్యనే ఇక్కడకు వచ్చి తిష్ట వేశాడు.
మాలతి హటాత్తుగా నవల చదవడం ఆపేసింది. కంగారుగా టైం చూసుకుంది. పదీ ఇరవై అయింది. చెప్పుకోదగ్గ రాత్రికిందే లెక్క! ఆ సమయంలో మూలుగు వినిపిస్తోంది - తనకు స్పష్టంగా!
డిటెక్టివ్ నవల కలిగించిన భ్రమ అనుకునేందుకు వీల్లేదు. ఆమె చదువుతున్నది సాంఘిక నవల. అదీకాక ఆ మూలుగు స్పష్టంగా వినబడుతున్నది.
మాలతి వెంటనే మంచం దిగలేదు. ముందుగా ఆమెకు భయం కలిగింది. అది మూలుగా, దెయ్యపు కేకా అన్న విషయం ముందుగా ఆలోచించింది. అయితే ఆ మూలుగు అదే పనిగా వినిపించడం లేదు. ఉండి ఉండి ఆగి ఆగి వినిపిస్తోంది.
టైము పది నలభై అయేలోగా మాలతి నిద్ర పోవడానికి కొన్ని వృధా ప్రయత్నాలు చేసింది. ఆమె ఆలోచనలనీ, మూలుగు పైననే కేంద్రీకరించబడ్డాయి. ఆ మూలుగు అలా వినిపిస్తూనే ఉంది.
కాసేపయ్యాక మాలతి మంచం మీద నుంచి లేచింది. ఆ మూలుగు ఎక్కణ్ణించి వస్తోందో, ఎలా వస్తోందో తెలుసుకుంటే గానీ తనకు నిద్రపట్టే అవకాశం లేదని ఆమెకు తోచింది. క్రమంగా ధైర్యం తెచ్చుకుని మంచం దిగింది. మూలుగు వీధి వైపు నుంచి వస్తోందని తెలుసుకోవడానికి ఆమెకు ఏంతో సేపు పట్టలేదు.
ఇంట్లో అన్ని స్వేచ్ లు వేసి వీధి గుమ్మం దగ్గరకు వచ్చింది మాలతి. ఇప్పుడు మూలుగు గట్టిగా వినబడుతుంది. అది తలుపులకు అవతలి వైపు నుంఛి వస్తోంది. మూలుగుతున్నది మనిషే! కానీ ఆ మూలుగు అదోరకంగా విచిత్రంగా ఉంది.
మాలతి తలుపు తీయడానికి తటపటాయించింది. ఒక వేళ ఎవరైనా దొంగవాడు అలా నటిస్తున్నాడేమో?
వాడు దొంగాడయితే తనింట్లో ఏముంది - ఎత్తుకు పోవడానికి?
ఇంట్లో తనూ- బాబూ తప్ప ఎవ్వరూ లేరు. బాబు అదృష్టవంతుడు . వాడు నిద్రపోతున్నాడు. తనకు నిద్ర పట్టడం లేదు.
దొంగాడు కాని పక్షంలో వాడు.....
ఆ భయం కూడా మాలతికి ఎక్కువగానే ఉంది. ఈ రోజుల్లో ఆడదానికి పూర్వపు విలువలు లేవు. పెళ్ళయిందని తెలిసినా మగాళ్ళకు వెధవ బుద్దులు పోవడం లేదు. బస్సులో రష్ గా ఉన్నప్పుడూ , సినిమా హాలు వద్ద గుంపు అదుపు తప్పినప్పుడూ , వగైరా అవకాశాలు వచ్చినప్పుడు మగవాళ్ళు అసభ్యంగా ప్రవర్తించడం ఆమెకు అనుభవం లో లేకపోలేదు. అందువల్ల ఎవడైనా తనకోసం ఆశపడి వచ్చాడని ఆమె భ్రమ పడినా ఆశ్చర్యం లేదు.
అయితే ఆ మూలుగు ఆమె చెవిలో పడుతూనే వుంది. ఆమెలోని రకరకాల భయాలను జయించి- ఆమె చేత ఆఖరికి తలుపును తీయించగలిగింది. తలుపులు తీయగానే కనపడ్డ దృశ్యం మాలతిని నిశ్చేష్టురాల్ని చేసింది. భయమూ ఆశ్చర్యమూ ఒకేసారిగా కలిగాయామెకు.
ఒక మనిషి - పురుషుడే ఇంటి అరుగు మీద పడుకుని ఉన్నాడు. అతను గజగజ వణుకుతూ అప్పుడప్పుడు మూలుగుతున్నాడు. మనిషికి స్పృహ వుందో లేదో తెలియదు. మాలతి తలుపు తెరిచినప్పుడు వచ్చిన ప్రత్యేకమైన వెలుగు అతనిలో ఏవిధమైన మార్పునూ తీసుకు రాలేదు.
2
మాలతి ఒక అడుగు వెనక్కు వేసి వీధరుగుల మీది లైటు స్వేచ్ నొక్కింది. అరుగు ప్రకశావంతమైంది.
అ మనిషి యింకా అలా వణుకుతూ మూలుగుతూనే ఉన్నాడు.
మాలతి ధైర్యం చేసి అరుగు మీదకు వెళ్ళి ఆ మనిషిని సమీపించింది. ఏ క్షణం లోనైనా ఆ మనిషి చటుక్కున లేచి తన్ను పట్టుకోవచ్చు నన్న అనుమానమూ, భయమూ ఆమెకు కలిగింది. అయినా ఆమె ధైర్యం తెచ్చుకుంది. కొద్దిగా వంగి ఆ మనిషిని "ఏమండోయ్ --" అని పిలిచింది.
ఆ మనిషి మూలుగు ఆపలేదు. వణకడం మానలేదు.
ఒక నిముషం తటపటాయించి మాలతి అతని ముందుగా కూర్చుని ఏదో అనుమానంతో అతని నుదుటి మీద చేయి వేసి చూసి ఉలిక్కిపడింది. అతని శరీరం సలసలా కాలిపోతోంది.
మాలతి మనసులోని భ్రమలన్నీ తొలగి పోయాయి. హటాత్తుగా ఆమెలోని మానవత్వం మేల్కొంది. అప్పుడే ఆమె ఈ లోకంలోకి వచ్చింది. వెంటనే ఆమెకు జ్ఞానేంద్రియాలు పని చేయడం ప్రారంభించాయి. ఆ ప్రయత్నంగా ఆమె ముక్కు మూసుకుని "అబ్బ!' అనుకుంది!"
అక్కడ భరించలేని వాసనగా వుంది.
ఆ పురుషుడికి ఎంతో వయసుండదు. గెడ్డం మాసి ఉంది. తైల సంస్కారం లేని జుట్టు, బట్టలు చిరిగి లేవు కానీ వాటికీ అటుకులున్నాయి. అతను వాటిని ధరించి ఎంత కాలమయిందో తెలియదు కానీ అవి బాగా మాసి వున్నాయి. వాసన అతని బట్టల నుంచి వస్తోందో, ఒంటి నుంచి వస్తోందో చెప్పడం కష్టం. మనిషి చాలా అపరి శుభ్రంగా ఉన్నాడు.
మాలతి తటపటాయించలేదు. ఆమె అతన్ని తట్టి లేపడానికి అయిదారుసార్లు ప్రయత్నించి, ఆఖరికి బలవంతంగా లేవదీసి కూర్చో బెట్టింది.
అతనో పర్యాయం కళ్ళు తెరిచి లేచి నిలబడ్డాడు. ఆమె వైపు చూశాడు కానీ ఆ కళ్ళలో తెలివి లేదు. అతనికి జ్వరం చాలా ఎక్కువగా ఉన్నదని మాలతికి తోచింది. ఆమె అతన్ని ఇంట్లోకి నడిపించింది. అతని చేయి పట్టుకుని పడిపోకుండా జాగ్రత్తగా లోపలికి తీసుకు వెళ్ళి మంచం మీద పడుకో బెట్టింది.
ఆ క్షణం లో అతను పరాయి మగవాడని, అతన్నింట్లో ఉంచుకోవడం ప్రమాదమని మాలతికీ తోచలేదు. ఆ వ్యక్తీ పడుకోగానే పదేళ్ళ కొడుకుని లేపి -- 'బాబూ గమ్మున మన డాక్టరు గారింటికి వెళ్ళి అమ్మ అర్జంటుగా రమ్మంటుందని చెప్పు పిల్చుకునిరా -- " అంది. బాబు విసుక్కుంటూనే వెళ్ళి డాక్టర్ని తీసుకు వచ్చాడు.
"డాక్టర్ ఆ మనిషిని సమీపిస్తూనే చటుక్కున ముక్కు మూసుకుని -- "అబ్బా- ఇదెక్కడి వాసన? అమ్మా మాలతీ-- ఈయేనేవారు? మీకు బంధువా?" అన్నాడు.
మాలతి పరిస్థితి చెప్పింది.
డాక్టర్ అతన్ని పరీక్షించి -- ఏదో ఇంజక్షన్ చేశాడు. తన పెట్టె లోంచి ఏవో బిళ్ళలు తీసిచ్చి ఎలా వాడాలో చెప్పి -- ముక్కు మొహం ఎరగని వాణ్ని ఇంట్లో పెట్టుకున్నావ్ -- ఏమైనా ప్రమాదం జరిగితే ?--- అన్నాడు.
'అనింటికీ ఆ దేవుడే ఉన్నాడు--" అంది మాలతి.
"రేపటికి జ్వర తీవ్రత తగ్గవచ్చునెమో కానీ-- ఇంకా రెండు మూడ్రోజుల వరకూ అతను మంచం మీద ఉండక తప్పదనుకుంటాను. అంతవరకూ ఇతని వల్ల నీకే ప్రమాదమూ ఉండదు--" అన్నాడు డాక్టర్.
"నా ప్రమాదం సంగతి ఎలా ఉన్నా -- అతనికి ప్రమాదం తప్పినట్లేనా డాక్టర్ !" అంది మాలతి.
"అతనికేం ప్రమాదం లేదు ...." అని వెళ్ళిపోయాడు డాక్టర్.
ఆరాత్రి తెల్లావార్లూ అతను మూలుగుతూనే ఉన్నాడు.
మాలతికి నిద్ర లేకుండానూ చేశాడు.
మర్నాడుదయం ఎనిమిది గంటల ప్రాంతంలో అతనికి తెలివి వచ్చింది. ఓసారి చుట్టూ పరికించి -- "నేనెక్కడున్నాను ...." అన్నాడు.
ఆ సమయంలో మాలతి అక్కడే ఉంది. అతని ప్రశ్నకు సమాధానంగా ఆమె రాత్రి జరిగిన వివరాలన్నీ చెప్పింది.
'అమ్మా-- నువ్వెవరో కానీ దేవతవు..." అన్నాడతను.
"నా సంగతి తర్వాత చూద్దాం గానీ మీరెవరో మీ వివరాలేమిటో చెప్పండి..."
అతను ఆమె వంక ఆరాధనా పూర్వకంగా చూసి -- "నా వేషాన్ని చూసే మీరు అంటూ మన్నించే మనుషులే తక్కువ అక్కడే నీ గొప్ప గుణం తెలుస్తోంది. నేను సామాన్యుణ్ణి. నా గురించి ఎవరికీ చెప్పుకోడానికి ఏమీ లేదు..." అన్నాడు. ఒక్క క్షణం ఆగి -- "నేను నిన్ను మన్నించలేదని అన్యధా భావించకు. కన్న తల్లినీ, తోడబుట్టిన చెల్లినీ నువ్వని పిలిస్తే నే తృప్తిగా ఉంటుంది. నువ్వూ నన్నలా గే పిలు....' అన్నాడు.
మాలతీ అతని వంక ఆశ్చర్యంగా చూసింది. అతని బుద్ది మంచిదనీ -- అతను చాలా తెలివైనవాడని మాటలను బట్టి అనిపిస్తోంది. అయితే పరిచయం పెరిగాక కానీ మనుషుల అసలు రంగులు బయటపడవు.
"అయితే నిన్ను అన్నయ్యా అని పిలుస్తాను. నా కోరిక మన్నించి నీ బట్టలు మార్చుకో. వాసన భరించ లేకుండా ఉన్నాము...." అంది మాలతి.
